Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమాకి ఆర్ ఆర్ చాలా ముఖ్యం. రీరికార్డింగ్ వల్ల పోయిన సినిమాలు, దాని వల్లే ఆడిన సినిమాలున్నాయి. కానీ లాంగ్ రన్లో మాత్రం పాటలే గుర్తుండిపోతాయి. కాబట్టి అన్నిటి కంటే ట్యూన్ ముఖ్యం' అని సంగీత దర్శకుడు రఘు కుంచె అన్నారు. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీనివాస్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాగల 24 గంటల్లో'. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, 'దర్శకుడు శ్రీనివాస్రెడ్డితో నాకిది రెండో చిత్రం. గతంలో 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రానికి పని చేశాను. ఎన్నో కామెడీ సినిమాలు చేసిన ఆయన జోనర్ మార్చి థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథ చెప్పినప్పుడు మొదటి భాగంలోని ట్విస్టులు, సెకండాఫ్లో వాటిని విప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. నేను థ్రిల్లర్ సినిమాలు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ కథ నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఇందులో రెండు పాటలుంటాయి. అవి కథలో భాగంగానే వస్తాయి. ఒకటి ఇషా రెబ్బాపై ప్రమోషనల్ సాంగ్. మహిళా ప్రధానంగా సాగే చిత్రమిది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లర్గా సాగుతుంది. శ్రీనివాస్ రెడ్డి సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అనుభవమే ఈ చిత్రం. థ్రిల్లర్ చిత్రాలు ఆర్.ఆర్పై ఆధారపడి ఉంటాయి. దీనికి 30 రోజుల్లో ఆర్ ఆర్ చేశా. చాలా మంది ఇందులోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడికి క్రియేటివ్ ప్రెజర్ ఆర్ ఆర్ విషయంలోనే ఉంటుంది. బ్లాంక్ ఫేస్కి కూడా హావభావాలు పలికించగల శక్తి ఆర్ఆర్లో ఉంటుంది. అయితే ఆర్.ఆర్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలున్నాయి. అలాగే హిట్ అయినవి కూడా ఉన్నాయి. కానీ ఆర్ఆర్ని ఎవరూ గుర్తు పెట్టుకోరు. అంతిమంగా సంగీతానికి, పాటలకే గుర్తింపు ఉంటుంది. లాంగ్రన్లో పాటలే గుర్తుంటాయి. కెరీర్ పరంగా నాకు అనుకున్న గుర్తింపు, విజయాలు రానప్పటికీ హ్యాపీగానే ఉన్నా. యావరేజ్గా కెరీర్ సాగుతుంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తున్నా. నటుడిగానూ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. అయితే సినిమాకి సంగీతం ఒకరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరొకరు అందించడం కరెక్ట్కాదు. ట్యూన్స్ ఇచ్చేవారు సినిమా మొత్తం ట్రావెల్ అవుతారు. తనకి కథ, ఎమోషన్స్ అన్నీ తెలుస్తాయి. తనే ఆర్ ఆర్ చేస్తే కరెక్ట్గా కుదురుతుంది. సినిమాకి హెల్ప్ అవుతుంది. కానీ ఓ రెండు సినిమాలకు పాటల వరకు నన్ను తీసుకుని, ఆర్ ఆర్ని మరొకరితో చేయించారు. ఆ సినిమాలు కూడా పోయాయి. ఇండిస్టీలో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు సౌండ్కి ప్రాధాన్యత పెరిగింది. ట్యూన్సే సినిమాకి ముఖ్యం. అయితే ఇతర పాటలను, ట్యూన్స్ని స్ఫూర్తి పొందడం తప్పుకాదు, దాన్ని యదాతథంగా కాపీ కొట్టడం కరెక్ట్ కాదు' అని అన్నారు.