Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేం ప్రతిష్టాత్మకంగా భావించే నాన్నగారి ఏఎన్నార్ జాతీయ అవార్డులను 2018, 2019 సంవత్సరాలకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశాం. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్నాం' అని నాగార్జున చెప్పారు. ప్రతి ఏడాది ఇచ్చే ఏఎన్నార్ జాతీయ అవార్డులను 2018, 19లకు కలిపి ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ నెల 17న అన్నపూర్ణ సెవన్ ఎకర్స్లో ఈ వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అవార్డు కమిటీ చైర్మెన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, 'అక్కినేని నాగేశ్వరరావుగారు అందరి గుండెల్లో నిలిచిపోయే గొప్ప వ్యక్తి. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు తన పేరు మీద కూడా ఓ అవార్డు పెడితే బాగుంటుందన్నప్పుడు నేనూ ఓకే చెప్పాను. నన్నే చైర్మెన్గా ఉండాలని కోరారు. ఇప్పటి వరకు దేవానంద్, లతా మంగేష్కర్, శ్యామ్ బెనెగల్, హేమా మాలిని, అమితాబ్ బచ్చన్, రాజమౌళి వంటి వారికి అందించాం. దేశ వ్యాప్తంగా సినీ రంగంలో విశేష సేవలందించిన గొప్ప వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. గత రెండేండ్లుగా గ్యాప్ వచ్చింది. ఈసారి రెండేండ్లకు కలిపి శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశాం. శ్రీదేవి తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి తెలుగమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది. శ్రీదేవి మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా మన చుట్టూనే ఉంటారు.
ఆమె తరపున అవార్డుని బోనీ కపూర్ కుటుంబం అందుకుంటుంది. రేఖ మన తెలుగమ్మాయి. తనదైన నటనతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. స్వయంగా ఈ అవార్డు అందుకోవడానికి వస్తున్నారు. శ్రీదేవికి ఈ అవార్డు ఇవ్వాలనేది ఏఎన్నార్గారి కోరిక. తండ్రి కోరికను మనసులో ఉంచుకుని దాన్ని నెరవేరుస్తున్నందుకు ఈ సందర్భంగా నాగార్జునని అభినందిస్తున్నా' అని అన్నారు. 'నాన్నగారి పేరు ఉన్నంత వరకు ఈ అవార్డుని ఇస్తూనే ఉంటాం. ఇది ఇంత సక్సెస్ అవ్వడానికి సుబ్బరామిరెడ్డినే కారణం. ఆయన నాన్నగారికి, నాకు స్నేహితుడిగా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల గతేడాది గ్యాప్ వచ్చింది. నాన్నగారి మరో కల అన్నపూర్ణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్. అది ప్రారంభించి ఏడేండ్లు అవుతుంది. ఆ వేడుకతోపాటు ఏఎన్నార్ జాతీయ అవార్డు వేడుకని నిర్వహిస్తున్నాం. రేఖ చేతుల మీదుగా 70 మంది ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నాం. రేఖగారిని నేను ఫోన్ చేసి ఆహ్వానించాను. ఆమె నాన్నగారితో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన దగ్గర గైడెన్స్ తీసుకున్నానని చెబుతూ కచ్చితంగా ఈ వేడకకి వస్తానన్నారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. నా నెక్ట్స్ సినిమా డిసెంబర్లో ప్రారంభమవుతుంది' అని నాగార్జున చెప్పారు.