Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణ, కిరణ్ చత్వాని జంటగా లింగస్వామి వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా మాటే వినవా'. శ్రీ శివానీ ఆర్ట్స్ అండ్ పి.ఎస్.మూవీ మేకర్స్ పతాకంపై శ్రీ శంకర్గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత మోహన్ వడ్లపట్ల పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'చిన్న సినిమాలకు మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహకారం అందిస్తుంటాం. ఈ చిత్రానికి కూడా మా సపోర్ట్ ఉంటుంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'గతంలో ఎనిమిది సినిమాలు చేశా. ఆరు నంది అవార్డులను అందుకున్నా. యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాను. కృష్ణ మంచి ఎనర్జిటిక్ హీరో. 'కృష్ణారావు సూపర్ మార్కెట్'తో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రంతో నటుడిగా పేరు తెచ్చుకుంటారు. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. ఏలేంద్రగారు ఐదు మంచి పాటలను అందించారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు బి.టెక్ స్టూడెంట్స్ కలిసి ప్రయాణం చేసి పెళ్ళి వరకు ఎలా వచ్చారనేది కథ. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం' అని దర్శకుడు లింగస్వామి తెలిపారు. హీరో కృష్ణ చెబుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకుని హ్యాపీగా ఫీలయ్యాం. పాటలన్నీ బాగా వచ్చాయి. వరంగల్పై వచ్చే మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. నన్ను యాక్షన్ నుంచి లవర్ బారుగా చూపించిన దర్శకుడికి థ్యాంక్స్' అని చెప్పారు. 'ప్రేమ, కుటుంబ కథ మేళవించిన చిత్రమిది. నాకు బాగా నచ్చి నిర్మించాను. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత శ్రీ శంకర్ గౌడ్ తెలిపారు.