Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సక్సెస్ చుట్టే ఏదైనా తిరుగుతుంది. సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. దర్శకుడిగా గ్యాప్ వచ్చిన నాకు ఈ సినిమా మళ్ళీ పుంజుకునేలా చేస్తుందని నమ్ముతున్నా' అని దర్శకుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన చిత్రం 'రాగల 24 గంటల్లో'. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ, ''ఢమరుకం' తర్వాత నాగచైతన్య హీరోగా 'హలోబ్రదర్' రీమేక్ చేద్దామని నాగార్జునగారన్నారు. కానీ అది సెట్ కాలేదు. ఆ తర్వాత 'దుర్గా' పేరుతో చైతూ హీరోగా మరో సినిమా అనుకున్నాం. అది కూడా పట్టాలెక్కలేదు. దీంతో తెలియకుండానే దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 'మామ మంచు అల్లుడు కంచు'తో వచ్చా. ఈ సినిమా తర్వాత రెండు కామెడీ స్క్రిప్ట్లపై వర్క్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కథని తీసుకొచ్చారు. బాగా ఇంప్రెస్ అయ్యాను. మొదటిసారి ఈ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించాను. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మనం రాగల 24 గంటల్లో... అనే మాటలను వాతావరణానికి సంబంధించిన వార్తల్లో వింటాం. అలా ఈ సినిమా కూడా భారీ వర్షం, ఈదురు గాలులతో ప్రారంభమవుతుంది. అందులోనూ రాగల 24 గంటల్లో అనే మాటలే చెబుతారు. ఈ క్రమంలో ఓ మర్డర్ వార్త వస్తుంది. పోలీసులు ఆ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రధానంగా జరిగే కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. స్క్రీన్ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది. దీనికి కథే హీరో. ఏడెనిమిది పాత్రలు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఈషా రెబ్బా అద్భుతంగా నటించింది. ఆమెని ఈ చిత్రంతో మరో నయనతార అని పిలుస్తారు. సత్యదేవ్ తన నట విశ్వరూపం చూపించారు. శ్రీరామ్ శక్తివంతమైన పోలీస్గా కనిపిస్తారు. అయితే ఇందులో నా మార్క్ కామెడీ అస్సలు ఉండదు. కథ సీరియస్గా సాగుతుంది. కామెడీ పెడితే అతికించినట్టు ఉంటుంది. కథకు నప్పదు. ఈ చిత్రానికి నటుడు కృష్ణభగవాన్ మాటలు అందించారు. మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. రఘు కుంచె ఆర్ ఆర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. థ్రిల్ చేస్తుంది. ఈ సినిమా విడుదలయ్యాక ఆయనకు అవకాశాలు క్యూ కడతాయి. అంత బాగా ఉంటుంది. సక్సెస్ చుట్టూ తిరిగే ఇండిస్టీ ఇంది. ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళని పట్టించుకోరు. అలాంటి టైమ్లో నిర్మాత శ్రీనివాస్ కానూరి నన్ను నమ్మారు. ఈ సినిమాకి ఆయనే మొదటి హీరో. ఈ సినిమాని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా. నెక్ట్స్ పెద్ద హీరోకి సూట్ అయ్యే కథ ఉంది. అలాగే ఇదే బ్యానర్లో మరో రెండు సినిమాలు అనుకున్నాం' అని అన్నారు.