Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా 'తలైవి' పేరుతో బయోపిక్ రూపొందుతుంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, విబ్రీ మోషన్ పిక్చర్స్ పతాకాలపై శైలేష్ ఆర్ సింగ్, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తుండగా, ప్రధాన పాత్రలైన ఎంజీఆర్గా అరవిందస్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. శుక్రవారం ఎంజీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈచిత్రంలో ఆయన పాత్ర పోషిస్తున్న అరవింద స్వామి లుక్ని, టీజర్ని విడుదల చేశారు. ఓ తమిళ చిత్రంలోని పాట పాడుతూ, డాన్సులు వేస్తున్న అరవింద్ స్వామి టీజర్, హుందాతనం ఉట్టిపడేలా సోఫాలో కూర్చున్న లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, 'తలైవి జయలలిత బయోపిక్ తీసే అవకాశం రావడం ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికీ అభిమానుల గుండెలో జీవించే ఉన్న ఆమెపై సినిమా చేయడం అద్భుతమైన అనుభవం. ఇందులో ప్రధాన తారాగణానికి నటీనటులను ఎంపిక చేయడం సవాల్తో కూడినది. కంగనా రనౌత్ ఫైనల్ అయ్యాక ఎంజీఆర్ పాత్ర కోసం అనేక మంది నటులను పరిశీలించాం. చివరికి అరవిందస్వామిని ఎంపిక చేశాం. ఆయన బాగా కుదిరారు. లెజెండరీ పాత్రలో ఆయన ఒదిగిన తీరు అద్భుతం. భారతరత్న అవార్డు గ్రహీత, అలనాటి నటుడు ఎంజీఆర్ ఇప్పటికీ తమిళనాడు ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది' అని అన్నారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఇప్పటికే విడుదల చేసిన కంగనా లుక్, టీజర్కి మంచి స్పందన లభించింది. జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.