Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత ముచ్చటగా మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెండో షెడ్యూల్ని జరుపుకోబోతుంది. ఇందులో అల్లు అర్జున్ పాల్గొంటారట. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ వినిపిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధానంగా యాక్షన్ డ్రామాగా సినిమా సాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి క్యారెక్టర్ బేస్డ్గా 'శేషాచలం' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్రం బృందం ఉందట. ఇదిలా ఉంటే, ఇందులో అనసూయ కీలక పాత్రలో మెరవనుందట. సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అనసూయ మెప్పించిన విషయం విదితమే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' ఈ సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆరు రోజుల్లో రూ.104కోట్లు కలెక్ట్ చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. అంతేకాదు 'డీజే' తర్వాత నైజాంలో 20 కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా 'అల..వైకుంఠపురములో' నిలవడం విశేషం.