Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓడిపోవడమనేది నా జీవితంలోనే లేదు. నేను నటుడిగా దక్షిణాదికే పరిమితమయ్యాను. కానీ ప్రభాస్ దేశ వ్యాప్తంగానే కాదు, ఇతర దేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుని, తండ్రిని మించిన కొడుకు అని నిరూపించుకున్నాడు. అందుకు చాలా గర్వపడుతున్నా' అని కృష్ణంరాజు అన్నారు. ఈ నెల 20న కృష్ణంరాజు 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం బర్త్ డే సెలబ్రేషన్ జరిగింది. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సినీ జర్నలిస్టుల విశ్లేషణ నటీనటుల భవిష్యత్కి, ఎదుగుదలకి ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి ఎందరో గొప్ప జర్నలిస్ట్లతో నాకు మంచి అనుబంధం ఉంది. అందరికీ ఏదో ఒక వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితులను చేసుకునే వ్యసనం ఉంది. ఫ్రెండ్స్ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. గోపీకృష్ణ మూవీస్ని స్థాపించి అనేక గొప్ప సినిమాలను నిర్మించి, నటించాను. 'బొబ్బిలి బ్రహ్మన్న', 'కృష్ణవేణి', 'అమర ద్వీపం', 'మనవూరి పాండవులు' వంటి చిత్రాలు చేశా. 'తాండ్రా పాపారాయుడు' చిత్ర సమయంలో ఐదువేల మందితో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాం. క్లిష్ట పరిస్థితుల్లో అంత మందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి ఏంటో తెలిసింది. అది చూసి ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు మా గోపీకృష్ణ మూవీస్లో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. ఇప్పటికే విదేశాల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శుక్రవారం నుంచి హైదరాబాద్లో మరో షెడ్యూల్ జరుగుతుంది. ఈ ఏడాది చివర్లోగాని లేదా వచ్చే ఏడాది సమ్మర్లోగాని సినిమాని విడుదల చేస్తాం. ఓ కొత్తరకమైన వెరైటీ లవ్ స్టోరీ ఇది. టేకింగ్ కొత్తగా ఉంటుంది. ఓ కీలక పాత్రలో నేను కూడా నటిస్తున్నా. రాజకీయాల పరంగా నాకు ఏదైన పదవి వస్తే ఆనందంగా స్వీకరిస్తాను. అంతేకానీ పదవుల కోసం ఆశపడను' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ పాల్గొని కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని, 'బొబ్బిలి బ్రహ్మన్న' చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృష్ణంరాజుని ప్రత్యేకంగా సత్కరించింది. అసోసియేషన్కి తమ వంతు సహకారం అందిస్తానని కృష్ణంరాజు చెప్పారు.