Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాగ్యశ్రీ ఈపేరు వినగానే.. సంచలన విజయం సాధించిన 'మైనే ప్యార్ కియా' సినిమా కచ్చితంగా గుర్తొస్తుంది. కుటుంబ విలువలు, సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన 'మైనే ప్యార్ కియా' సినిమా అప్పట్లో బాలీవుడ్లో విశేష ప్రేక్షకాదరణ పొంది భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో భాగ్యశ్రీ నటన ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసింది. తెలుగులో 'ఓంకారం', 'రాణా' చిత్రాల్లో కథానాయికగా నటించిన భాగ్యశ్రీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో ప్రభాస్ పాల్గొంటున్నట్టు ఓ ఫొటోని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో కృష్ణంరాజు కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఓ కొత్త తరహా లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి 'జాన్' అనే టైటిల్ వినిపిస్తుంది. ఇందులో ప్రభాస్కి తల్లిగా నటి భాగ్యశ్రీ నటించనున్నట్టు సమాచారం. ఈ పాత్ర కోసం ఆమెని చిత్ర బృందం సంప్రదించగా, నటించేందుకు సుముఖతని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు కాజల్ కూడా గెస్ట్గా మెరవనుందట.