Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దావోస్ వేదికగా పిరమల్ గ్రూపు సమ్మతి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఔషధ తయారీని మరింతగా విస్తరించాలని పిరమల్ గ్రూపు నిర్ణయించింది. ఇందుకు గాను రానున్న మూడేండ్ల కాలంలో దాదాపు రూ.500 కోట్ల మేర ఇక్కడ కొత్తగా పెట్టుబడులను పెట్టాలని సంస్థ భావిస్తోంది. దావోస్లో జరుగుతున్న ''వరల్డ్ ఎకనమిక్ సమిట్'' (డబ్ల్యుఏఎస్) వేదికపై పిరమల్ గ్రూపు చైర్మెన్ అజరు పిరమల్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పిరమల్ గ్రూపు విస్తరణకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. దావోస్లోని తెలంగాణ పెవీలియన్లో పలు అంశాలపై చర్చలు జరిపిన తరువాత పిరమల్ గ్రూపు తెలంగాణలో దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తన సమ్మతిని తెలిపిందని సర్కారు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ తాజా పెట్టుబడులతో సంస్థ తన తయారీ బ్లాక్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, గిడ్డంగుల విస్తరణ, ప్లాంట్ల ఆధునీకరణ వంటి కార్యకలాపాలను చేపట్టనుంది. ప్రస్తుతం పిరమల్ ఫార్మా సంస్థ మూడు బహుళ ఉత్పత్తి బ్లాక్లను కలిగి ఉంది. వీటి మొత్తం రియాక్టర్ సామర్థ్యం 1000 కిలో లీటర్లుగా ఉంది. తన విస్తరణ ప్రణాళికలో భాగంగా పిరమల్ గ్రూపు హైదరాబాద్ చుట్టపక్కల ఉన్న సంస్థల కొనుగోలుపై కూడా దృష్టి సారించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచుకొనే క్రమంలో భాంగంగా ఈ కొనుగోల్లు ఉంటాయని సంస్థ తెలిపింది. పిరమల్ ఇతర రాష్ట్రాలలో కలిగి ఉన్న తయారీ యూనిట్లను కూడా హైదరాబాద్కు తరలించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సర్కారు కల్పిస్తున్న సరళతరమైన వ్యాపార విధానానికి అకర్షితమవుతూ పిరమల్ ఈ దిశగా చర్యలు తీసుకోనుందని ప్రభుత్వ తన ప్రకటనలో తెలిపింది.