Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలుగు, తమిళం, హిందీలో రూపొందిస్తున్న చిత్రం 'అరణ్య'. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, 'జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని అస్సాంలోని నిజ ఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఆయన 1300 ఎకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన పని వల్ల నది కోత నుండి భూమి పరిరక్షింపబడింది. జంతువులు ఉండే ప్రాంతాలను, ప్రకృతిని మనం మార్చాలనుకున్నప్పుడు వాటికేం ప్రమాదం ఉండదు. ఈ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ప్రభుగారితో సినిమా చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా రోజుల పాటు నాకు కో యాక్టర్ లేకుండా నటించాల్సి వచ్చింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్గారికి రుణపడి ఉంటాను. ప్రభుగారి టేకింగ్ వేరే రిథమ్లో ఉంటుంది. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని అన్నారు.
'నేనెప్పుడూ కథని నెరేట్ చేయను. సురేష్బాబుకి ఇరవై నిమిషాల కథ చెప్పా. మరోసారి కలిసి మాట్లాడిన తర్వాత సినిమా ట్రాక్ ఎక్కేసింది. రానాగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏనుగులతో ఒక లాంగ్వేజ్లోనే సినిమా చేయడం చాలా కష్టమైన పని. కానీ మూడు లాంగ్వేజెస్లో ముప్పై ఏనుగులతో సినిమా చేయడమంటే చాలా కష్టమైన పని. ఎంత కష్టమైన పనిని రానాగారు చేయడానికి రెడీ అయ్యారు. తనని తాను అరణ్యగా మార్చుకున్నారు. తర్వాత విష్ణు విశాల్గారికి థ్యాంక్స్. ఇదొక ఐకాన్ మూవీ అని చెప్పగలను' అని దర్శకుడు ప్రభు సాల్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సీఎంఓ మానవ్ సేతీ, డిస్ట్రిబ్యూషన్ హెడ్ నందు అహుజా, విష్ణు విశాల్, సురేష్బాబు పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు.