Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' చిత్రం రూపొందుతుంది. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు రామ్ నటించిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. రామ్, తిరుమల కిషోర్ కాంబినేషన్లో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత ఇది మూడో చిత్రం. గత రెండు విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. గోవా, హైదరాబాద్, వైజాగ్ల్లో జరిపిన షూటింగ్తో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలోమైట్స్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. హీరో రామ్, మాళవిక శర్మలపై ఈ రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెల 20 వరకు చిత్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్ వచ్చాక మరో పాటని చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందే అనౌన్స్ చేసినట్లు ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నాం' అని చెప్పారు.