Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి తొలి చిత్రం 'పునాదిరాళ్లు' దర్శకుడు గుడిపాటి రాజ్కుమార్ (78) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. 'పునాదిరాళ్ళు' సినిమా చిరంజీవికే కాదు, దర్శకుడిగా రాజ్కుమార్కి కూడా తొలి చిత్రం కావడం విశేషం. దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్కుమార్ మరణంతో చిరంజీవితోపాటు పలువురు సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్కుమార్ విజయవాడలో డిగ్రీ వరకు చదువుకున్నారు. 1966లో హైదరాబాద్కి వచ్చారు. ఫిజికల్ ఎడ్యూకేషన్లో ట్రైనింగ్ తీసుకుని నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. కాలేజ్ రోజుల్లోనే నాటకాలు వేస్తూ, పాటలు కూడా పాడేవారు. ఎలాగైనా సినిమాల్లో రాణించాలని పాతబస్తీ జహనుమాలోనా సదరన్ మూవీస్ స్టూడియోలో జాయిన్ అయ్యారు. రాజ్కుమార్లోని ఆసక్తిని గమనించిన దర్శకులు 'సతీ అనసూయ', 'రహస్యం' సినిమాలకు కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. కోడైరెక్టర్గా వచ్చిన అనుభవంతో 'పునాదిరాళ్లు' కథ రాశారు. 1978లో ఈ సినిమాని తెరకెక్కించారు. నియంతృత్వానికి, క్రూరత్వానికి మారుపేరైన గ్రామ సర్పంచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అతని కుమారుడు కొంతమంది యువకులతో కలిసి సాగించిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సర్పంచిగా గోకిన రామారావు, ఆయన కుమారుడిగా నరసింహరాజు, అతని స్నేహితుల్లో ఒకరిగా చిరంజీవి నటించారు. అలాగే సర్పంచ్ భార్యగా సావిత్రి నటించడం విశేషం. ఆమెతోపాటు సర్పంచ్ వల్ల అత్యాచారానికి బలై, పిచ్చిదానిలా మారిపోయిన యువతిగా రోజారమణి, సర్పంచ్ కొడుకు పోరాటానికి మద్దతు ఇచ్చిన టీచరుగా కవిత నటించారు. ఇది ఘన విజయం సాధించి దర్శకుడిగా రాజ్కుమార్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుందీ చిత్రం. ఓ సినిమా ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం కూడా తొలిసారే కావడం మరో విశేషం. దీని తర్వాత 'ఈ సామ్రాజ్యం మాకొద్దు', 'మనవూరి గాంధీ', 'ఇంకా తెలవారదేమి', 'తాండవ కృష్ణ తారంగం', 'మా సిరిమల్లి'తోపాటు దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. 2018లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు లైఫ్ ఎచీవ్మెంట్ పురస్కారంతో, 2019లో న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవార్డుతో సత్కరించింది. ఇదిలా ఉంటే, రాజ్కుమార్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివారయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో దర్శకులు పూరీ జగన్నాథ్, మెహర్ రమేష్, కాశీ విశ్వనాథ్, ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిల్మ్ మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్రెడ్డి, 'మనంసైతం' నుంచి ఆర్థిక సాయం అందించారు.
నా నట జీవితానికి పునాది
వేసిన సినిమా : చిరంజీవి
'రాజ్ కుమార్ నన్ను కలిసి తన దర్శకత్వంలో వస్తున్న 'పునాదిరాళ్లు' సినిమాలో వేషం వేయమని అడిగారు. అప్పుడు నేను ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నా. ఆ ట్రైనింగ్ పూర్తి కాకుండానే బలవంతంగా నువ్వే చేయాలని నాతో ఆ సినిమా చేయించారు.
నా నట జీవితానికి అదే 'పునాది రాళ్లు' వేసింది. ఈ మధ్యనే మా ఇంటికి వచ్చి కలిశారు. అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించాను. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారనుకున్నా. ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'
అని చిరంజీవి అన్నారు.