Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'భీష్మ'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, 'నితిన్కి వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయి. సినిమా చూశాను. చాలా బాగుంది. రష్మిక 'సరిలేరు నీకెవ్వరు'తో మంచి సక్సెస్ రూట్లో దూసుకుపోతుంది. ఈ చిత్రంతోపాటు మరిన్ని విజయాలను ఆమె అందుకోవాలి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్లో రెండున్నాయి. అందులో వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్, జానీ మాస్టర్ చేసిన 'వాటే బ్యూటీ' పాట చాలా బాగున్నాయి. మా 'బుట్టబొమ్మ' సాంగ్ని జానీ మాస్టర్ ఎంత బాగా చేశాడో, 'వాటే బ్యూటీ'ని అంత బాగా చేశాడు. 'జెర్సీ' తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'పక్కా స్క్రిప్ట్తో రావాలని కొంచెం ఆగి ఈ సినిమా చేశా. దర్శకుడు వెంకీ 'దిల్' సినిమాకు, నాకూ పెద్ద అభిమాని. ఒక ఫ్యాన్ బారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి 'దిల్', 'సై' తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ 'డ్యాన్స్ అన్నా.. డ్యాన్స్ అన్నా' అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్ చూసి అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నా బెండు తీసేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బాగా చేయించారు. సెకండాఫ్లో వచ్చే ఫైట్ను వెంకట్ అదరకొట్టేశారు. ఆ ఫైట్లో ఫ్యాన్స్కి గూస్ బంప్స్ గ్యారంటీ. ఇక సాగర్ మహతి సినిమాకు లైఫ్ లాగా నిలిచే పాటలందించాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నన్ను, రష్మికను సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ చాలా అందంగా చూపించారు. రష్మిక మంచి నటి. ఈ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్లో తను చేసిన డ్యాన్స్ చూసి షాకయ్యా. హార్డ్ వర్క్, డెడికేషన్తో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట 'అ ఆ' చేసి, ఇప్పుడు ఈ సినిమా చేశాను. మూడో సినిమా 'రంగ్ దే' చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా లైఫ్లో పంచ ప్రాణాలు మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నాక్కాబోయే భార్య ఆరో ప్రాణం కాబోతోంది' అని నితిన్ చెప్పారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, 'త్రివిక్రమ్కి నేను భక్తుడ్ని. ఆయన దగ్గర ఎప్పట్నుంచో పనిచేద్దామని అనుకుంటున్నప్పుడు 'అ ఆ' సినిమాకు ఆయన దగ్గర చినబాబుగారు చేర్పించారు. వాళ్లిద్దరికీ థాంక్స్. సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ మంచి విజువల్స్ ఇచ్చారు. పాటలకు సాగర్ ఎంత మంచి బాణీలిచ్చాడో, రీరికార్డింగ్ కూడా అంత అసాధారణంగా ఇచ్చాడు. ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయం' అని చెప్పారు. 'ఈ తరంలో నిజమైన ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టమైపోతోంది. కానీ ఈ సినిమాకి పనిచేసేటప్పుడు నేను జెన్యూన్ పీపుల్ని కలిశాను. వెంకీ కుడుముల అలాంటి వ్యక్తి. ఈరోజు టాలీవుడ్లో నేనిక్కడ ఉన్నానంటే ఒక ప్రధాన కారణం ఆయనే. 'భీష్మ' స్క్రిప్టును ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంతో ఆయన రాసుకున్నారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు 'అ ఆ' చూశాను. సినిమాలు చేస్తే, ఇలాంటి సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఇప్పుడు అదే నితిన్తో 'భీష్మ' చేశాను. తెర బయట ఆయన ఒక జెన్యూన్ పర్సన్. ఆయనను బెస్ట్ కో-స్టార్ అని చెప్పను, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. ప్రేక్షకులతో పాటు నేనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు రావాలని కోరుకుంటున్నా' అని రష్మిక మందన్నా చెప్పింది. ఈ కార్యక్రమంలో గీత రచయితలు కాసర్లశ్యామ్, శ్రీమణి, దర్శకుడు వెంకీ అట్లూరి, నటుడు బ్రహ్మాజీ, దిల్రాజు, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య, బాలనటుడు రాకేష్ పాల్గొని తమ అభినందనలు తెలిపారు.