Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత, విశ్లేషకులు కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా మారుతూ రూపొందించిన చిత్రం 'స్క్రీన్ప్లే'. 'ఆఫ్ యాన్్ ఇండియన్ లవ్ స్టోరీ' అనేది ఉపశీర్షిక. విక్రమ్ శివ, ప్రగతి జంటగా నటించిన ఈ చిత్రాన్ని బుజ్జి బుడుగు ఫిల్మ్స్ పతాకంపై డా|| అరుణకుమారి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన రమేష్ ప్రసాద్ ట్రైలర్ని ఆవిష్కరించి అభినందనలు తెలిపారు. ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'ప్రసాద్గారి పాతికేండ్ల కల. సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ,'కె.ఎల్.ప్రసాద్గారు స్త్రీ పక్షపాతి. ఇందులో ప్రగతి, విక్రమ్ అత్యద్భుతంగా నటించారు. శ్రీలేఖ ఇందులో ఉన్న ఒకే ఒక్కపాటని అత్యద్భుతంగా కంపోజ్ చేశారు. సినిమా గురించి బయట ఎన్నో విశ్లేషణలు చేస్తాం. కానీ సినిమా తీసి సక్సెస్ సాధించడం గొప్ప విషయం. కె.ఎల్.ప్రసాద్ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'సినిమాకిది యాప్ట్ టైటిల్. నిజం చెప్పాలంటే భార్యాభర్తల మధ్యే మంచి స్క్రీన్ప్లే ఉంటుంది. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు నిన్ను ఎందుకు చేసుకున్నానని అనుకున్నారంటే ఆ బంధం నిలబడదు. పిల్లలకు పెళ్ళి చేసే తల్లిదండ్రులు, పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు కూడా చూడాల్సిన చిత్రమిది. నాకు నచ్చిన, నేను మెచ్చిన చిత్రమిది' అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. చిత్ర దర్శకుడు కె.ఎల్.ప్రసాద్ చెబుతూ, 'ఈ సినిమా నాకు ఇంతటి గౌరవం తెస్తుందని ఊహించలేదు. చంద్రషా అనే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో తిరిగే వ్యక్తి మా సినిమా చూసి బీజింగ్, కాంబోడియా వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్కి రికమండ్ చేశారు. ఈ సినిమా కథ, పాత్రలు నా మనసులోనుంచి వచ్చాయి. అందరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుణ కుమారి, పరకాల ప్రభాకర్, జె.కె.భారవి, విక్రమ్, ప్రగతి పాల్గొన్నారు.