Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా చిన్న స్థాయి సినీ కళాకారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ఆయా చిత్ర రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలి' అని రజనీకాంత్ చెప్పారు. అంతేకాదు సినీ కళాకారులను ఆదుకునేందుకు ఆయన వంతు సాయంగా రూ. 50 లక్షల రూపాయల్ని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సంఘానికి విరాళంగా ప్రకటించారు. అలాగే యువ కథానాయకుడు విజరు సేతుపతి సైతం రూ. 50లక్షల రూపాయల్ని ఆర్థిక సాయాన్ని ఇదే సంఘానికి అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్ అంటే వందల మందితో కూడిన వ్యవహారం కావడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఎఫ్ఈఎఫ్ఎస్ఐకు చెందిన చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.
ఈ సంఘంలో దాదాపు 25 వేల మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారని, వారిలో 15 వేల మంది కనీసం నిత్యావసర వస్తువులను కొనేందుకు డబ్బులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని ఆ సంఘం అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులందరూ తమ వంతు కళాకారులకు సాయం చేయాలని కోరారు. విరాళాలు ఇస్తే కనీసం బియ్యం బస్తాలు కొని వాళ్ళకి అందజేస్తామని ఆయన చెప్పారు.
కళాకారులను ఆదుకునేందుకు సోమవారం సూర్య, ఆయన సోదరుడు కార్తీ కలిసి రూ.10 లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చిన విషయం విదితమే.
ఇదిలా ఉంటే, టాలీవుడ్ కథానాయకుడు నితిన్ మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు తన వంతు సాయంగా నితిన్ ఈ విరాళాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లడుతూ, 'కరోనా వ్యాప్తి నిరోధ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలందరూ లాక్డౌన్కు పూర్తిగా సహకరించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలి. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.10 లక్షలను అందజేస్తాను' అని చెప్పారు.
అలాగే నటుడు శివాజీరాజా సైతం సినీ కళాకారులకు ఉచితంగా కూరగాయలను అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రాజశేఖర్ సినీ కళాకారుల కోసం నిత్యావసర వస్తువులను తన రాజశేఖర్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్న విషయం విదితమే. అలాగే నిర్మాత ప్రశాంత్ గౌడ్ సైతం సినీ కార్మికుల కోసం వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.