Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ భారతీయ చలన చిత్ర సీమకే కాదు ప్రపంచ సినిమా పరిశ్రమకి సైతం దాతృత్వంలో మన తెలుగు సినీ ప్రముఖులు స్ఫూర్తినిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల సినిమా షూటింగులు బంద్ అవ్వడంతో సినీ కార్మికులు, కళాకారుల జీవితాలు అతలాకుతలమై పోతున్నాయి. ఏప్రిల్ 15 వరకు కొనసాగే లాక్డౌన్ వల్ల వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని గ్రహించిన తెలుగు సినీ ప్రముఖులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. సినీ కార్మికుల రక్షణే ధ్యేయంగా అందరూ ఏకతాటిపై నిలిచి తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. చిరంజీవి, పవన్కళ్యాణ్, మహేష్బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, సాయితేజ్, వి.వి.వినాయక్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, సతీష్ వేగేశ, దిల్రాజు, అల్లరి నరేష్, రాజశేఖర్, శివాజీరాజా తదితరులు ప్రకటించిన భారీ విరాళాల స్ఫూర్తితో శుక్రవారం మరికొంత మంది సినీ ప్రముఖులు సాయం అందిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పవన్కళ్యాణ్ అన్నారు.
అంతేకాదు కరోనా వైరస్ కట్టడికి అలుపెరగని పోరాటాన్ని చేస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు తమ వంతు సాయాన్ని ప్రకటించిన సినీ ప్రముఖులందరినీ ట్విట్టర్ ద్వారా పేరు పేరున పవన్కళ్యాణ్ అభినందించారు. విరాళాల పరంపరలో భాగంగా శుక్రవారం అల్లు అర్జున్ రూ.1.25 కోట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. 'కోవిడ్ -19 ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తోంది. ఆ మహమ్మారి మన రోజువారీ జీవితాలను కూడా మార్చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందరో వైద్యులు, నర్సులు, పోలీసులు, సైన్యం అలాగే మరెన్నో రంగాలకు చెందినవారు తమ జీవితాలను పణంగా పెట్టి మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారందరి నుంచి స్ఫూర్తి
పొందిన నేను నా వంతు సాయంగా రూ.1.25
కోట్లను విరాళంగా అందజేస్తున్నాను. కరోనా కట్టడికి
స్వీయ నిర్బంధమే సరైన మార్గం' అని ఓ స్పెషల్ వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అలాగే దర్శకుడు సుకుమార్ కూడా తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలను విరాళంగా అందించారు. సంగీత దర్శకుడు తమన్ సైతం రూ.5 లక్షలను సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి విరాళంగా ఇచ్చారు. వీరి బాటలోనే కథానాయిక ప్రణీత తన ప్రణీత ఫౌండేషన్ తరఫున 50 నిరుపేద కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయంగా అందించారు. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ రూ. 20 లక్షలు, మరో ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు, హీరో సుధీర్బాబు రూ.2 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతుల నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ రూ.20 లక్షలను రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళంగా అందజేశారు.