Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం విదితమే. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలూ అస్తవ్యస్తమయ్యాయి. ఇక సాధారణ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్డౌన్ కారణంగా ఇల్లు విడిచి వెళ్ళలేని పరిస్థితుల్లో పూట గడవడం కష్టం ఉన్న కార్మికులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో కొంతమందిని తన వంతు సాయంగా బాలీవుడ్ కథానాయకుడు అక్షరుకుమార్ 25 కోట్ల రూపాయల్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి అందజేసిన విషయం విదితమే. ఇక అక్షరు బాటలోనే సల్మాన్ఖాన్ కూడా సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అక్షరు ప్రజల కోసం సాయం చేస్తే, సినీ కార్మికులను ఆదుకోవడానికి చేయూతనిచ్చారు. దీంతో మానవత్వానికి ప్రతీకగా వీళ్ళు నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
దేశంలోని అత్యంత భారీ చిత్ర పరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. దాదాపు ఐదు లక్ష మంది సినీ కార్మికులు బాలీవుడ్లో పని చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రకటించిన లాక్డౌన్ కారణంగా దాదాపు 25 వేల మంది సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకునేందుకు సల్మాన్ఖాన్ ఆపన్న హస్తం అందించారు. తన వంతు ఆర్థిక సాయాన్ని ఆయన ఈ 25 వేల మంది సినీ కార్మికులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. సోషల్మీడియాలో ఈ విషయం పోస్ట్ కావడంతో సల్మాన్ని యావత్ భారతీయ ప్రజానీకంతో పాటు సినీ ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు.
'రోజువారి సినీ కార్మికులకు సాయం చేయడానికి సల్మాన్కి చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు మూడు రోజుల క్రితం మమ్మల్ని కలిశారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్లో ఐదు లక్షల మంది ఉండగా, ఇందులో 25 వేల మంది కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ 25 వేల మంది బాగోగులను సల్మాన్ బీయింగ్ హ్యూమన్ సంస్థే చూసుకుంటుందని ఆ ప్రతినిధులు తెలిపారు. కార్మికులు ఖాతాల్లోనే డబ్బులను నేరుగా జమ చేసేందుకు వీలుగా వీరికి సంబంధించిన ఖాతా వివరాలను అడిగి తీసుకున్నారు' అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ ప్రెసిడెండ్ బి.ఎన్.తివారీ తెలిపారు.