Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకరత్న దాసరి నారాయణ రావు 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఫిలిం ఛాంబర్లోని దాసరి విగ్రహానికి పలువురు సినీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా దాసరితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగభరితులయ్యారు. హీరో శ్రీకాంత్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి.నరసింహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ,'కరోనా వల్ల సినిమా ఇండిస్టీలో జరిగిన నష్టాన్ని దాసరిగారైతే వేరే రకంగా కాపాడేవారు. దాసరి గారిని తల్చుకోని రోజు ఉండదు. ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి దాసరిగారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈ రోజు ఆయన మూడో వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానం చేస్తున్నాం. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తాం' అని తెలిపారు. 'ఇండిస్టీకి పెద్ద దిక్కు దాసరి. ఎటువంటి విషయాలు అయినప్పటికీ వ్యవస్థలను ముందు పెట్టి ఆయన నడిపించేవారు. ప్రతి సినిమా టెక్నీషియన్కి, నటుడికి విలువ ఇచ్చి మాట్లాడేవారు. ఆయన లేని లోటు తెలుస్తోంది. ఈ కరోనా సమయంలో మరింత ఆయన లోటు కనిపిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు' అని ప్రసన్న కుమార్ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,'దాసరి గారి లేని లోటు పూడ్చలేం. నేను కానీ, సి.కళ్యాణ్ కానీ, రామ సత్యనారాయణ కానీ ఆయన దగ్గర పనిచేయలేదు. అయినాసరే ఆయన మనుషులమని మేం గర్వంగా చెప్పుకుంటాం' అని చెప్పారు. 'దాసరిగారి మీద ఉన్న అపారమైన ప్రేమతో ఈ రోజు 3 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం. నేను బతికి ఉన్నత కాలం దాసరిగారి పుట్టినరోజు మే 4, దాసరి గారి వర్ధంతి మే 30 కచ్చితంగా ఇక్కడే జరుపుకుంటాను. ప్రతి సంవత్సరం దాసరి అవార్డ్స్ కొనసాగిస్తాను. ఈ ఫంక్షన్ను దాసరి కుటుంబ సభ్యులు, ఆయన శిష్యుల సమక్షంలో చేస్తాను' అని టి. రామ సత్యనారాయణ అన్నారు. రేలంగి నరసింహారావు, దొరై, రాజా వన్నెం రెడ్డి, సత్తుపల్లి తాండవ, పిడివి ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వారిలో నేనూ ఒకడిని : మోహన్బాబు
'నటుడిగా నాకు జన్మని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి నా గురువు దాసరి నారాయణరావు గారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగినటువంటి మహా దర్శకుడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, రాజకీయవేత్తగా నవరసాలూ ఆయనలో ఉన్నాయి. మా గురువు గారు ఎంతోమందికి దీపాలు పెట్టారు, ఆ దీపాలు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి. అందులో నేనూ ఒకడ్ని. సినిమాలో ఎన్ని పాత్రలుంటాయో అన్ని పాత్రలూ ఒక్కొక్క సినిమాలో ఒక్కోవిధంగా నాకు క్రియేట్ చేసి, ఆయన కలం ద్వారా నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. గురువు గారు తెలుగు సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ని మీరు చూసిన విధంగా ఇంకొకరు రారు, రాలేరు, పుట్టలేరు కూడా. మా గురువుగారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబానికి ఉంటాయి' అని మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.