Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలోనే కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఇక లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే మన దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎవ్వరూ ఊహించని భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలి లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అగ్ర కథానాయకుడు వెంకటేష్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. 'లాక్డౌన్ మాత్రమే ముగుస్తోంది. కానీ కరోనా మహమ్మారి మాత్రం ఇంకా అలానే ఉంది. లాక్డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదు. గత 70 రోజులుగా అనేక చర్యలు తీసుకుని కరోనా వైరస్ ముప్పును తగ్గించేందుకు ప్రయత్నించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు. ఇటువంటి క్లిష్ట సమయంలో మా సంరక్షణ కోసం రాత్రింబవళ్లూ సేవలు అందించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. ఇప్పుడిప్పుడే మెల్లగా మన ద్వారాలు తెరచుకుంటున్నాయి. పౌరులే బాధ్యతగా వ్యవహరించాలి. లాక్డౌన్ మాత్రమే ముగింపుకి వచ్చింది. వైరస్ కాదు. కాబట్టి లాక్డౌన్ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, వాటిని ఇకపై కూడా పాటించాలి. సురక్షితంగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి' అని వెంకటేష్ ట్వీట్లో సూచించారు.