Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, రానా ముఖ్య పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే మరోమారు ప్రభాస్, రానా సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోబోతున్నారని వినిపిస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా, 'జిల్' ఫేమ్ రాధాకష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా ప్రత్యేక పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాకి 'రాధే శ్యామ్' అనే టైటిల్ని పెట్టబోతున్నట్టు ప్రచారంలో ఉంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే 5 కోట్ల రూపాయల బడ్జెట్తో ఓ 1980 కాలం నాటి హాస్పిటల్ సెట్ని వేశారని వినిపిస్తోంది. దాదాపు 30 రోజుల పాటు ఈ సెట్లోనే చిత్రీకరణ చెయ్యబోతున్నారట. ఇదిలా ఉంటే, రానా ప్రస్తుతం 'విరాటపర్వం', 'అరణ్య', 'హిరణ్యకశ్యప' చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిల్లో 'అరణ్య' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, 'విరాటపర్వం' ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. అలాగే 'హిరణ్యకశ్యప' చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు దర్శకుడు గుణశేఖర్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం విదితమే.