Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ సొంత కథల మీద కంటే పర భాషా సినిమాల రీమేక్ల మీదే దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆధార పడుతున్నారు. వాటి మీద ఎక్కువ నమ్మకమూ పెట్టుకుంటున్నారు. మలయాళ సినిమాలపై టాలీవుడ్, విదేశీ సినిమాలపై బాలీవుడ్ ఫోకస్ చేశాయి. దీంతో ఇప్పుడు రెండు పరిశ్రమల్లోనూ రీమేక్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.
బాలీవుడ్లో విదేశీ సినిమాలు
1994లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా 'ఫారెస్ట్ గంప్'. ఆరు ఆస్కారులను కైవసం చేసుకున్న చేసుకున్న ఈ చిత్రాన్ని అమీర్ఖాన్ కథానాయకుడిగా 'లాల్ సింగ్ చద్దా'గా రీమేక్ చేస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.
2015లో రిలీజై ఘన విజయం సాధించిన చిత్రం 'వెటరన్'. సౌత్ కొరియాలో అత్యధిక వసూళ్లను రాబట్టి బెస్ట్ టాప్ టెన్ సినిమాల జాబితాలో స్థానం సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని సల్మాన్ఖాన్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్ర రీమేక్ హక్కులను దర్శక, నిర్మాత, నటుడు అతుల్ అగ్నిహౌత్రి దక్కించుకున్నారు. ఇందులో సల్మాన్ డిటెక్టివ్గా కనిపించబోతున్నారు.
1998లో విడులైన జర్మన్ థ్రిల్లర్ 'రన్ లోలా రన్'. 71వ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ విభాగంలో ఆస్కార్ని కైవసం చేసుకున్న చిత్రమిది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుందీ చిత్రం. ఈ సినిమాను తాప్సీ ముఖ్య పాత్రధారిణిగా 'లూప్ లపేటా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీనికి ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా ముఖ్యంగా ప్రియుడి కోసం ఓ ప్రియురాలు చేసే ఉత్కంఠభరిత యూక్షన్ సన్నివేశాల సమాహారంగా రూపొందే ఈ చిత్రం కోసం తాప్సీ పోరాట సన్నివేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోందని సమాచారం.
రచయిత పౌలా హాకిన్స్ రాసిన నవలల్లో అత్యధికంగా పాఠకాదరణ పొందిన నవల 'ద గర్ల ఆన్ ది ట్రైన్'. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో 2016లో విడుదలైన ఈ సినిమా కూడా అత్యంత ఆదరణ పొంది హాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ చిత్రాన్ని అదే టైటిల్తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. రిబుదాస్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో పరిణీతి చోప్రా ముఖ్య పాత్రధారిణిగా నటిస్తున్నారు.
తెలుగులో మలయాళ సినిమాలు
మోహన్లాల్ కథానాయకుడిగా మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం 'లూసిఫర్'. సమకాలీన రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకుల్లో ఉండే స్వార్థం, అవినీతి, డ్రగ్స్ మాఫియా, మతోన్మాదం వంటి తదితర అంశాలతో తెరకెక్కి దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టిన ఈచిత్రాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చెయ్యబోతున్నారు. దీనికి 'సాహౌ' చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో పాత్రల పరంగా చిరంజీవి చెల్లెలుగా రోజా, అనుచురుడిగా విజరు దేవరకొండ నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాణ హక్కుల్ని చిరంజీవి తనయుడు రామ్చరణ్ సొంతం చేసుకున్న విషయం విదితమే.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'. ఈ చిత్ర రీమేక్లను సైతం రామ్చరణ్ దక్కించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పవన్కళ్యాణ్తో రీమేక్ చెయ్యబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు.
ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు పొందిన మరో మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ చెయ్యబోతోంది. రవితేజ, రానా కథానాయకులుగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
ఇక త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య' సినిమా కూడా మలయాళ సినిమాకి రీమేకే. ఓ ఫొటోగ్రాఫర్ నెరవేర్చుకునే ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన 'మహిషింతే ప్రతీకారం' చిత్రాన్ని తెలుగులో సత్యదేవ్ కథానాయకుడిగా 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య'గా రూపొందించారు. దీనికి 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. తెలుగు నేటివీటికి అనుగుణంగా ముస్తాబైన ఈ సినిమా ఫలితాన్ని త్వరలోనే ప్రేక్షకులు ఇవ్వబోతున్నారు.
మలయాళంలో మంచి ఆదరణ పొందిన చిత్రం 'హెలెన్'. ఈ చిత్రాన్ని అనుపమా పరమేశ్వరన్ ముఖ్య పాత్రధారిణిగా పీవీపీ సంస్థ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
గ్యాంగ్స్టర్ కామెడీ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్న 'పడయోట్టం' చిత్రాన్ని తెలుగులో సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్నారు.