Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత మూడు నెలలుగా లాక్డౌన్ని కొనసాగించాయి. దీంతో సినిమాలకు సంబంధించి చిత్రీకరణలు కూడా నిలిచిపోయాయి. అయితే లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా చిత్రీకరణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా త్వరలోనే చిత్ర పరిశ్రమకు తీపి కబురు అందనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణలను పున: ప్రారంభించు కునేందుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన 'ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫీక్కీ) 21వ వార్షిక సమావేశాలకు జావదేకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా, సీరియల్, రియాలిటీ షోస్, పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ తదితర రంగాల్లో పని చేసే పలువురు లబ్ధి పొందే అవకాశం ఉంది. సినిమా, టీవీ, గేమింగ్ తదితర విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలను విడుదల చేస్తాం. సృజనాత్మక రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఇక్కడ చిత్రీకరించిన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో వీక్షిస్తున్నారు. ఈ రంగంలో వ్యాపారవేత్తలు మరిన్ని పెట్టుబడులు పెట్టి చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సృజనాత్మక పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. మీడియా, వినోద పరిశ్రమ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది' అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలోనే చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ఆరంభించారు. అయితే రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల వల్ల చిత్రీకరణలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతోపాటు తక్కువ మందితో చిత్రీకరణలు జరపడం అసాధ్యం అవ్వడం వల్ల కూడా చాలా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి.