Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనాతో క్రికెట్లో మార్పులు
-నేటి నుంచి ఇంగ్లాండ్, విండీస్ తొలి టెస్టు
నవతెలంగాణ క్రీడావిభాగం
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ క్రికెట్కు మూడు నెలల విరామం వచ్చింది. కరోనా ప్రమాదం తొలిగిపోలేదు, కానీ క్రికెట్ మాత్రం పున ప్రారంభం అవుతోంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టెస్టు సిరీస్కు రంగం సిద్ధం చేసింది. కరోనా మహమ్మారి తర్వాతి సమయంలో మనకు తెలిసిన క్రికెట్ ఇప్పుడు కొత్తగా, భిన్నంగా కనిపించనుంది. ఇక ముందు క్రికెట్ స్టేడియాల్లో భారత్ ఆర్మీ, బర్మీ ఆర్మీ, రికీస్ ఆర్మీలను చూడలేం. జాతీయ పతాకాల రెపరెపలు చూడలేం. విచిత్ర వేషధారణలు, సంగీత కచేరిలు, సంప్రదాయ నృత్యాలు, ప్రత్యర్థి జట్లపై అభిమానుల అరుపులు, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లపై కేకలు ప్రస్తుతానికి చరిత్రే. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసీసీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్ బయో బబుల్ వాతావరణంలో జరుగనుంది. ఇప్పటికే రెండు జట్లు అంతర్గత ముఖాముఖి 3, 4 రోజుల మ్యాచులో తలపడ్డాయి. క్రికెటర్లు అందరికీ వారానికి రెండు సార్లు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్రికెట్ పున ప్రారంభానికి అంతా సవ్యంగానే సాగుతోంది. అయినా, ఇన్నాండ్లూ మనం చూస్తున్న క్రికెట్లా ఇది ఉండబోదు. ఆట, ఆటగాళ్ల ప్రదర్శనలు, కండ్లుచెదిరే విన్యాసాలు, రసవత్తర పోరాటాలు, నరాలు తెగే ఉత్కంఠ, మునివేళ్లపై నిలిపే సందర్భాలకు కొదవ లేకపోయినా.. అభిమానులు కొన్ని విషయాలను కోల్పోనున్నారు. ఆటగాళ్లు సైతం గతంలో మాదిరి మైదానంలో స్పందించలేరు. ఇంగ్లాండ్, వెస్టిండీస్లు నేడు సౌతాంప్టన్లో తొలి టెస్టుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన క్రికెట్లో మనం మిస్ అవనున్న సందర్భాలను ఓసారి చూద్దాం..!.
భుజాలపై చేతులేస్కుని చర్చకు నో
ఐసీసీ నిబంధనల్లో భౌతిక దూరం పాటించటం తప్పనిసరి. మైదానంలోకి వచ్చేముందు జట్టు సభ్యులంతా భుజాలపై చేతులేసుకుని కెప్టెన్ ప్రేరణ వచనాలు వినటం ఇక కుదరదు. డీఆర్ఎస్ నిర్ణయాల సమయంలో జట్టంతా ఒక చోటికి చేరి చర్చించుకోవటం సైతం కనిపించదు. అంపైర్తో ముఖా ముఖి అస్సలు ఉండదు.
అంపైర్లకు ఇవ్వటం కుదరదు
బౌలర్లు సహజంగా అంపైర్లకు తమ క్యాప్లు, చలువ కళ్లద్దాలు, టవల్స్, జంపర్స్ ఇవ్వటం సహజం. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఇక ఇవి చేయడానికి వీల్లేదు. అలాగని ఇతర సహచర ఆటగాళ్లకు సైతం ఇవ్వడానికి లేదు. బంతిని పరిశీలించేందుకు అంపైర్లు సైతం చేతికి గ్లౌవ్స్ ధరించనున్నారు. టోపీలు, జంపర్స్, సన్గ్లాసెస్, టవల్స్ను బహుశా బౌండరీ లైన్ వద్ద ఉంచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.
సంబరాలు కొత్తగా..
క్రికెట్లో బ్యాట్స్మెన్ ఆధిపత్యం ఎక్కువ. బౌలర్లు వికెట్లు పడినప్పుడే ఎనలేని సంతృప్తి పొందుతారు. అందుకే వికెట్ సంబరాలు క్రికెట్లో ఓ మ్యాజిక్. కీలక బ్యాట్స్మన్ను వెనక్కి పంపినప్పుడు, విలువైన భాగస్వామ్యం విడదీసినప్పుడు జరుపుకునే సంబరాలకు ఆకాశమే హద్దు. మోచేతి, కాలు సంబురాలు వీటికి ప్రత్యామ్నాం కాదు. అయినా, ఇక క్రికెట్లో ఈ సంబరాలకు చోటు లేదు.
ఆటోగ్రాఫ్లకు ఆమడ దూరం!
కుదిరేతే ఓ సెల్ఫీ, వీలైతే ఓ ఆటోగ్రాఫ్. క్రికెట్ మ్యాచులకు, ప్రాక్టీస్ సెషన్లను చూసేందుకు వచ్చే అభిమానుల మనోగతం ఇలాగే ఉంటుంది. అభిమాన క్రికెటర్లతో కరచాలనం, ఫోటోలు, ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు ఎంతగా ఆరాటపడతారో మాటల్లో వర్ణించలేం. శ్రీలంక పర్యటనలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు లంక అభిమానులు పుట్టినరోజు కేక్ తినిపించారు. క్రికెట్ జెంటిల్మెన్ కేన్ విలియమ్సన్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. కానీ ఇప్పుడు క్రికెట్లో కేక్ సంగతి అటుంచి, అభిమానులను కలిసేందుకు సైతం అవకాశం లేదు. ఇదెంత కాలం కొనసాగుతుందో చూడాలి.
ఉమ్మికి గుడ్బై
టెస్టు క్రికెట్లో బౌలర్లను రేసులో నిలిపేది ఉమ్మి!. అదేంటి అనుకుంటున్నారా.. ఉమ్మిపై బంతిపై రుద్ది ఆ మెరుపు సాయంతోనే బ్యాట్స్మె న్ను బోల్తాకొట్టిస్తారు. ఉమ్మిపై నిషేధంతో బౌలర్లకు ఇది కఠిన సవాల్ కానుంది. ఐదు వికెట్ల ప్రదర్శన సంకేతంగా బంతిని ముద్దాడటం బౌలర్లకు ఇష్టం. ఇప్పుడు అందుకు తావు లేదు.