Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతి త్వరలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 14కి సంబంధించి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ఖాన్ అందుకోబోయే పారితోషికం అక్షరాలు 500 కోట్ల రూపాయలు. ఇది వినటానికి నమ్మశక్యంగా లేకపోయినా వాస్తవం అని అంటున్నారు సల్మాన్ సన్నిహితులు. బిగ్ బాస్ సీజన్ 14కి సంబంధించి ఒక్కో ఎపిసోడ్కి 16 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్గా సల్మాన్కి బిగ్బాస్ నిర్వాహకులు అందజేయ బోతున్నారట. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లాక్డౌన్ పీరియడ్లోనూ ఇంత పెద్ద భారీ ఆదాయాన్ని సల్మాన్ ఆర్జించడం బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు బిగ్ బాస్ షో కోసం నిర్వహించిన 13 సీజన్లకు దాదాపు 11 సీజన్లకు సల్మాన్ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సల్మాన్ స్టయిల్, పంచ్ డైలాగ్స్తో షోలో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీ పోటీ దారులతోపాటు వీక్షకుల్ని కూడా ఫిదా చేశాయి. దీంతో బిగ్బాస్ నిర్వాహకులు సైతం సల్మాన్కే ప్రయారిటీ ఇచ్చారు. అంతేకాదు ఆయన ఎంత అడిగితే అంత పారితోషికాన్ని కూడా ఇస్తూ వచ్చారు. 2010లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్కే సల్మాన్ ఒక్కో ఎపిసోడ్కి 2.5కోట్ల రూపాయల్ని తీసుకుని అప్పట్లోనే వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్కి 16 కోట్ల రూపాయలను తీసుకుంటూ అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే, సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సల్మాన్ సరసన కథానాయికగా దిశా పటానీ నటిస్తుండగా, ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెరవనుంది. ఈ స్పెషల్ సాంగ్ను అల్లుఅర్జున్, హరీష్శంకర్ కాంబోలో రూపొంది, ఘన విజయం సాధించిన 'డీజే' (దువ్వాడ జగన్నాథం) సినిమాలోని 'సీటీమార్..' సాంగ్కి రీమిక్స్ చేశారని సమాచారం. 'డీజే'కి స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాదే స్వయంగా దీన్ని రీమిక్స్ చేశారని వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో మేఘా ఆకాష్ సైతం నటిస్తోంది. సల్మాన్ ఈ సినిమాతోపాటు 'కబీ ఈద్ కబీ దివాలి' చిత్రంలోనూ నటిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఈ రెండు సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. చిత్రీకరణల విషయంలో కేంద్రం మార్గదర్శకాలను సూచించిన అనంతరం, వాటికి అనుగుణంగా చిత్రీకరణను ప్రారంభించేందుకు రెండు సినిమాలకు సంబంధించిన చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నాయి.