Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు అందర్నీ కలవర పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోయింది. అయితే పలు మల్టీఫ్లెక్స్ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని తమ మల్టీఫ్లెక్సుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తామని గట్టి హామీలు ఇస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న కరోనా భయం వారిని థియేటర్ల దిశగా ఆలోచించేలా చేయడం లేదు. దీంతో నిర్మాతలకు, అలాగే థియేటర్ ఓనర్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్లకు ప్రత్నామ్నాయంగా నిలిచిన ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
వీటిల్లో అగ్రకథానాయిక కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' కూడా ఇటీవలే విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ పొందలేకపోయింది. 'మహానటి' తర్వాత ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ కీర్తి సురేష్కి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఆమె నటించిన 'పెంగ్విన్' చిత్రంపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను సినిమా రీచ్ కాలేకపోయింది. కంటెంట్ పరంగానే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో ఇంకా టెక్నాలజీపై అవగాహన రాకపోవడం కూడా మరో ముఖ్య కారణమైంది. ఇదిలా ఉంటే, కీర్తి నటించిన మరో రెండు చిత్రాలు కూడా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
కీర్తి నటించిన 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖీ' చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే కరోనా లాక్డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఇవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేయాలనే యోచనకు సదరు చిత్ర దర్శక, నిర్మాతలొచ్చినట్టు సమాచారం. కానీ వీరు ఊహించిన ఫ్యాన్సీ ఆఫర్ను ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు సుముఖుంగా లేవని వినిపిస్తోంది.