Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టలేదు. అమితాబ్ బచ్చన్తోపాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరారు, మనవరాలు ఆరాధ్య సైతం కరోనా బారిన పడటం బాలీవుడ్నే కాదు జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న అమితాబ్ అభిమానుల్ని, భిన్న భాషలకు చెందిన సెలబ్రిటీలను సైతం ఆందోళనకు గురి చేసింది. అయితే బిగ్బి ఫ్యామిలీకి జరిపిన కరోనా పరీక్షల్లో అమితాబ్ సతీమణి జయాబచ్చన్కు నెగటివ్ రావడం కొంత ఊరటనిచ్చింది. అలాగే ప్రముఖ నటుడు అనుపమ్ఖేర్ కుటుంబం కూడా కరోనా బారిన పడటం బాధాకారం. సకల హంగులతోపాటు బోల్డెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న అందర్నీ ఆలోచించేలా చేస్తోంది.
బాలీవుడ్ లెజెండ్ 'బిగ్ బీ అమితాబ్ బచ్చన్' కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో 'బచ్చన్ కుటుంబానికి సంబంధించిన నాలుగు బంగ్లాలను 'బీఎంసీ' సీలు చేసి వాటిని కంటైనర్ కంట్కెన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆ వైపు ఎవ్వరూ వెళ్లకుండా పోలీస్లు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజానికి కరోనా పాజిటివ్ రావడం దేశ ప్రజలతో పాటు భారతీయ చలనచిత్ర ప్రముఖులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అమితాబ్ అభిమానులు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ కుంటుంబానికి నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేకంగా కరోనా ట్రీట్మెంట్ని అందిస్తున్నారు.
అయితే అమితాబ్ తేలికపాటి కోవిడ్ లక్షణాలతో స్థిరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉంచారు. అమితాబ్తో పాటు ఆసుపత్రిలో చేరిన అభిషేక్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఐశ్వర్యరారు, ఆమె కూతురు ఆరాధ్యకి సైతం కరోనా పాజిటివ్ ఉండటంతో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో నానావతి హాస్పిటల్లో జాయిన్ అయిన అమితాబ్ అక్కడ పనిచేస్తున్న డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది సహా దేశంలో ప్రజలకు వైద్యం అందిస్తోన్న ఇతర డాక్టర్స్, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు.
అందరం కలిసి పోరాడాల్సిన తరుణమిది : అమితాబ్
'నానావతి హాస్పిటల్లోని డాక్టర్స్, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా ప్రతికూల పరిస్థితుల్లో వీళ్ళు అద్భుతమైన సేవలను అందిస్తున్నారు. నేను ఈమధ్య సూరత్లోని ఓ బోర్డ్ను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. అందులో ఇప్పుడు దేవుడి గుళ్లు ఎందుకు మూసివేశారో తెలుసా? దేవుడు తెల్లకోటు వేసుకుని హాస్పిటల్లో పనిచేస్తున్నాడని ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఇతరులు దైవ స్వరూపులు. మానవత్వం కోసం పనిచేస్తున్నారు. ప్రాణదాతలుగా మారారు. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు లేకపోతే మనుషులంతా ఏమైపోయేవారో. ఇవి నిరాశ జనకంగా ఉన్న రోజులని నాకు తెలుసు. అందరూ వారి పరిధులు దాటి పనిచేస్తున్నారు. మానసిక ఒత్తిడి, భయం నెలకొని ఉంది. కానీ నేను చెప్పేదొక్కటే ఎవరూ భయపడొద్దు, నిరాశపడొద్దు. మనమందం కలిసి పోరాడాల్సిన తరుణమిది. అలా చేస్తేనే మనం ఈ పరిస్థితి నుండి బయటపడగలం. నానావతి హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు. ఇలానే సేవలు అందిస్తే దేశమంతా మిమ్మల్ని ప్రేమతో, గౌరవంతో చూస్తుంది' అని వీడియోలో తెలిపారు అమితాబ్ బచ్చన్.
భావోద్వేగభరిత పవన్కళ్యాణ్ ట్వీట్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చేరిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అమితాబ్ కోలుకోవాలంటూ ట్వీట్స్ కూడా చేశారు.
'నా ప్రియమైన, గౌరవనీయలైన అమితాబ్ బచ్చన్కి, నా తల్లి, తండ్రితో సహా కుటుంబం మొత్తం మీ శ్రేయస్సు కోసం ప్రార్థించిన నాటి సమయం నేను ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. మీరు 'కూలీ చిత్రీకరణ'లో గాయపడినప్పుడు అందరూ మీ క్షేమాన్ని కాంక్షించారు. మేము మిమ్మల్ని సదా ప్రేమిస్తూనే ఉంటాం. ఒక్క మీ ప్రతిభనే కాకుండా మీ పోరాట స్ఫూర్తి, సరళత, వినయాన్ని సైతం మేము ఇష్టపడతాం. మీకు, అభిషేక్కి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి చాలా బాధ కలిగింది. ధన్వంత్రి మాత మిమ్మల్ని, అభిషేక్ని శక్తిమంతుల్ని చేయాలని, మీరిద్దరినీ మంచి ఆరోగ్యంతో చూడాలని ఎదురుచూస్తున్నాం' అని ఓ అభిమానిగా, ఆరాధకుడిగా పవన్కళ్యాణ్ భావోద్వేగభరితంగా ట్వీట్ పెట్టారు. పవన్కళ్యాణ్ మాదిరిగానే చిరంజీవి, నాగార్జున, మహేష్బాబు వంటి తదితర టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు బాలీవుడ్కి చెందిన పలువురు సెలబిట్రీలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెట్టారు.
తన తల్లి, సోదరునితో సహా నలుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు. గత కొద్ది రోజులుగా తన తల్లి దులారి అనారోగ్యంతో బాధపడుతున్నారని అనుపమ్ తెలిపారు. కొంతకాలంగా ఆమెకు ఆకలి కలగడం లేదని, నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వైద్యుని సలహాతో పరీక్షలు చేయించగా, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. తరువాత తన కుటుంబ సభ్యలకు కరోనా పరీక్షలు చేయించగా, నలుగురు పాజిటివ్గా తేలారన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తన తల్లి చికిత్స పొందుతున్నారని, ఈ విషయాన్ని బీఎంసీకి తెలియజేయడంతో తమ బిల్డింగ్ను శానిటైజ్ చేశారని అనుపమ్ఖేర్ చెప్పారు.