Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా లాక్డౌన్ వల్ల గత మూడు నెలలుగా సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల వల్ల థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు రిలీజ్ చేసేందుకు ఇంకా వేచి చూస్తున్నారు. మరికొంత మంది నిర్మాతలు తమ వెసులుబాటుని బట్టి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ ద్వారా సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా అగ్ర కథానాయకుడు రవితేజ నటించిన 'క్రాక్' సినిమాని థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ ద్వారా చిత్ర బృందం విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే, తెలుగునాట తొలిసారి ఓ అగ్ర హీరో నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం శుభ పరిణామంగానే చెప్పుకోవాలి.
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్రాక్'. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండి ఉంటే ఈ ఏడాది సమ్మర్లో విడుదలయ్యేది. కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల ఆగింది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మిగిలిన నిర్మాతల మాదిరిగా 'క్రాక్' సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. 'డాన్శీను', 'బలుపు' చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం 'క్రాక్'. ఇందులో రవితేజ సరనన శృతిహాసన్ నటించింది. గతంలో వీరిద్దరూ 'బలుపు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే వరలక్ష్మి శరత్కుమార్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.