Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీంనగర్ జిల్లా ధాన్యాగారానికి ప్రసిద్ధి. అదే విధంగా పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు కేంద్రం. కానీ వరి పండించే రైతులు, వడ్ల నుంచి బియ్యంగా మార్చడానికి శ్రమించే కార్మికులు పేదలుగానే ఉంటున్నారు. జిల్లాలోని మానకొండూర్, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల్లోని 56 రైస్ మిల్లుల్లో 208 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరి వేతన ఒప్పందం గడువు 2020 మార్చి 31తో ముగిసింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేతన ఒప్పందం.. గతంలో రైస్ మిల్లు ఆపరేటర్ యూనియన్కు, యజమానుల వెల్ఫేర్ అసోసియేషన్కు మధ్య అనేక సార్లు జరిగింది. నూతన ఒప్పందం కోసం యూనియన్ 2020 ఏప్రిల్ 9న సమ్మె నోటీసు ఇచ్చింది. మే మాసంలో పలుమార్లు యజమానుల సంఘం ప్రతినిధులుతో చర్చలు జరిగాయి. కొంతమంది యజమానుల మొండి వైఖరి కారణంగా చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కలెక్టర్ జోక్యంతో డీసీఎల్, కౌన్సిలేషన్ అధికారి వద్ద రెండుసార్లు చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారం కానందున చర్చల ప్రక్రియను ముగిస్తూ కౌన్సిలేషన్ డీసీఎల్ అధికారి జూన్ 9న ఉత్తర్వులు ఇచ్చారు. కార్మికుల డిమాండ్లలో ప్రధానమైంది వేతనం. 8గంటల పనికి రూ.6500 పెంచాలని యూనియన్ మొదట డిమాండ్ చేసింది. సమ్మె ప్రారంభానికి ముందు రోజు జూన్ 17న యజమానులు రూ.1000 పెంచుతామని చెప్పగా, యూనియన్ రూ.2650 పెంచాలని కోరింది.
సమ్మె:- కరోనా నేపథ్యంలో దేశం, రాష్ట్రం, జిల్లాలో అనేక పరిశ్రమలు, సంస్థలు, వ్యవస్థలు లాక్డౌన్లో సర్వం బంద్లో ఉండగా రైస్ మిల్లు ఆపరేటర్లు మాత్రం విధుల్లో ఉన్నారు. స్పెషల్ అలవెన్స్ కాదు కదా! కనీసం మాస్కులు, శానిటైజర్ సౌకర్యం కల్పించకున్నా రైస్ ఉత్పత్తి చేశారు. కనీస వేతనాలు ఇస్తే సరిపోతుంది జీతం పెంచాల్సిన అవసరం లేదనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (డీసీఎల్) తప్పుడు సూచనలు, కోవిడ్-19 నేపథ్యంలో కార్మికులు ఆందోళనలు, పోరాటాలు చేయలేరనే ధీమా, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యమే కదా మాకేంటి అనే యజమానుల మొండి వైఖరి కారణంగా కార్మికులు అనివార్యంగా 2020 జూన్ 18 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. 27రోజులపాటు సమ్మె జయప్రదంగా జరిగింది. సమ్మె ప్రారంభమైన రెండో రోజే అదనపు కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. రెండుసార్లు చర్చలు జరిపాక జూన్ 24న 8 గంటల పనికి రూ.2000 పెంచాలని యజమానులను ఆదేశించారు. కార్మికులు అంగీకరించినా.. రైస్మిల్లు యజమానులు రూ.1500 మాత్రమే పెంచుతామని మొండి కయడంతో సమ్మె దీర్ఘకాలం కొనసాగింది. కనీస వేతనం అంటే గరిష్ట వేతనం కాదని, రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒప్పంద కాలపరిమితి పూర్తయిందని, లాభాలు వచ్చే, చెల్లించే సామర్థ్యం ఉన్న రైస్ ఇండిస్టీలో మల్టీ స్కిల్డ్ కార్మికులైన ఆపరేటర్లకు ఫెయిర్ వేతనం ఇవ్వాలని యూనియన్ వాదించింది. ఇది కార్మిక అధికారికి అర్థం కాకున్నా (అర్థం కానట్టు నటించినా) జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మన వాదన(యూనియన్)తో ఏకీభవించారు. ఆపరేటర్ కార్మికులను యజమానులు అనేక విధాలుగా బెదిరించే, భయపెట్టే ప్రయత్నం చేశారు. రెండ్రోజుల్లో డ్యూటీలో చేరుకుంటే స్వచ్ఛందంగా పని కోల్పోయినట్టేనని కార్మికులకు నోటీసులు ఇచ్చారు. అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ కిందకు వచ్చే ఈ చర్యను యూనియన్ ఖండించింది. లేబర్ డిపార్ట్మెంట్ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నా.. కరోనా వైరస్ భయపెడుతున్నా కార్మికులు ఐక్యతే ధైర్యంగా మొక్కవోని దీక్షతో పోరాడారు. అవసరమైన అన్ని సందర్భాల్లోనూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ వారికి గైడెన్స్ ఇచ్చింది. ప్రత్యక్షంగా పాల్గొన్నది. సమస్యను పరిష్కరించాలని లేబర్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చింది. యూనియన్ నాయకులు ప్రతిరోజూ కార్మికులతో మీటింగులు జరిపారు. సీఐటీయూ జిల్లా కమిటీ వర్క్ డిజైన్ చేసుకొని సంఘీభావంగా ఇతర సంఘాల మద్దతు, అనుబంధ యూనియన్లను పోరాటంలో భాగస్వామ్యం చేసింది. సమ్మె ప్రారంభానికి ముందే కార్మిక వర్గంలో 10 వేల కరపత్రాలు, రైతాంగంలో 10 వేల కరపత్రాలు 4 మండలాల్లోని 48 గ్రామాల్లో పంచారు. రైతుల నుంచి కార్మికులకు పెద్దఎత్తున సానుభూతి, సంఘీభావం వచ్చింది. భౌతిక దూరం పాటిస్తూనే కార్మికులు అనేక రూపాల్లో ఆందోళన నిర్వహించారు. కార్మికులను, రైతులను దోపిడీ చేస్తున్న తీరును లెక్కలతో సహా కరపత్రాల్లో ఎండగట్టడంతో జీర్ణించుకోలేని మిల్లు యజమానులు నాయకులపై పరువు నష్టం దావా వేస్తామని బెదిరింపులకు దిగారు.
పోటీ కార్మికులు
రైస్ మిల్లు ఆపరేటింగ్కు స్థానికంగా కార్మికులు దొరికే అవకాశం లేదు. యజమానులు లేబర్ కమిషన్ అధికారి సూచనలతో బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి పని చేయించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. సమ్మె చట్టబద్ధం అంటూనే న్యాయబద్దం కాదని, రైస్ ఇండిస్టీ అత్యవసర సర్వీసు అనే పేరుతో డీసీఎల్ డైరెక్ట్గా పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. యజమానులు పోటీ కార్మికులను పెట్టుకుంటే రక్షణ కల్పించాలని పరోక్షంగా కోరారు. లెటర్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, డీసీఎల్ యజమానులకు లొంగిపోయిన వైఖరిని నిరసిస్తూ నాయకులు లేఖ ఇచ్చారు.
ఆయన లీవ్ పెట్టి అమెరికాకు వెళ్లిపోయారు. బహుశా ఒక లేబర్ కమిషన్ ఉన్నతాధికారి యజమానులతో ఇంతలా కుమ్మక్కైన ఘటన ఇప్పటివరకు జరిగి ఉండదు. ఏ రాష్ట్రమైనా కార్మికులంతా ఒక్కటే. ఒక మిల్లు యజమాని బీహార్ నుంచి నలుగురు పోటీ కార్మికులను తీసుకొచ్చారు. తెల్లవారేసరికి ఇక్కడ సమ్మె జరుగుతుందని తెలిసి ఆ కార్మికులు వెళ్లిపోయారు. కొంతమంది యజమా నులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేటర్ కార్మికు లను తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. కానీ, ఇక్కడి మిల్లు ఆపరేటర్లు సమ్మె చేస్తున్నారని ఆ కార్మికులు తెలుసుకొని రావడానికి నిరాకరించారు.
పోరాట ఎత్తుగడలు
సమ్మె కాలంలో పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాం. సమ్మె 18 రోజులు గడిచిన తర్వాత అదనపు కలెక్టర్ సూచించిన 8 గంటల పనికి రూ.2000 పెంచడానికి కొంతమంది యజమానులు ముందుకొచ్చారు. మా మిల్లులు నడపాలని కోరారు. ఇది కార్మికులకు న్యాయం చేస్తుందా! కార్మికుల్లో చీలికకు దారితీసి నష్టం చేస్తుందా? అనే ప్రశ్న ఉదయించింది. కార్మికుల జనరల్ బాడీ వేసి చర్చించాం. సీఐటీయు రాష్ట్ర నాయకత్వంతో సమాలోచనలు జరిపి సమ్మెను సంపూర్ణంగా కొనసాగించడానికే నిర్ణయించు కున్నాం. రెండ్రోజుల వ్యవధిలో ఒక మండలానికి సంబంధించిన మిల్లర్లు అదనపు కలెక్టర్ను కలిసి వేతనాల పెంపుకు అంగీకరిస్తూ లెటర్లు ఇచ్చారు. ఈ మార్పును గమనించి సీఐటీయూ రాష్ట్ర నాయకత్వంతో మరోసారి చర్చించి జీతాలు పెంచడానికి ముందుకొచ్చిన మిల్లుల్లో సమ్మె విరమించి డ్యూటీలో చేరాలనే నిర్ణయించాం. తేడా వస్తే ఆ కార్మికులు తిరిగి సమ్మె చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. కార్మికుల పోరాటం, యూనియన్ ఎత్తుగడ ఫలించింది. 5 రోజుల వ్యవధిలోనే మిల్లర్లందరూ 8 గంటల పనికి నెలకు రూ.2000 ఇవ్వడానికి అంగీకరిస్తూ జిల్లా అదనపు కలెక్టర్కు వారి అసోసియేషన్ నుంచి లెటర్ ఇచ్చారు. రైస్ మిల్ ఆపరేటర్ల 27 రోజుల సమ్మె విజయవంతమైంది. సమ్మె విరమించి డ్యూటీలో చేరాలని అదనపు కలెక్టర్ కోరడంతో కార్మికులు విధుల్లో జాయిన్ అయ్యారు. కొన్ని మిల్లుల్లో పెరిగిన వేతనంతో కలిపి జీతాలు ఇచ్చారు. తెలంగాణలోని పరిశ్రమల్లో రైస్ ఇండిస్టీ అతి చిన్నది. కానీ కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తర్వాత రెండో స్థానంలో ఉన్న పరిశ్రమ. వేతన ఒప్పందం కోసం 27 రోజుల పాటు సమ్మె చేసి రైల్మిల్లు ఆపరేటర్లు విజయం సాధించడం జిల్లా కార్మిక వర్గంలో ఉత్సాహాన్ని ఇచ్చింది.
రైస్ ఇండిస్టీ షెడ్యూల్ పరిశ్రమలో 2007లో ఇచ్చిన కనీస వేతనం జీవోనే గానీ, తెలంగాణ వచ్చి 6 ఏండ్లు పూర్తయినా కొత్త జీవో రాలేదు. ఇదే క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులు తీసుకురావడం, 12 గంటల పని కోసం కొన్ని రాష్ట్రాల్లో ఆర్డినెన్స్లు ఇవ్వడం తదితర ఘటనల నేపథ్యంలో పాలకవర్గాల స్వభావాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకోవడానికి ఈ సమ్మె ఉపయోగపడింది.
గీట్ల ముకుందరెడ్డి