Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాస్టారూ! ఆర్యులు విదేశీయులా? లేక సింధు నాగరికతకు ముందునాటి భారతీయులా?'' సోషల్ స్టడీస్ మాస్టారు సోమేశ్వరరావు క్లాసులోకి రాగానే అడిగాడు పవన్.
మాస్టారు నవ్వుతూ ''ఈ డౌట్ నీకెందుకొచ్చింది పవన్?'' అని అడిగారు.
''నిన్న మా మామయ్య అన్నాడు మాస్టారూ. ఎన్.ఎస్.రాజారామ్ అనే రచయిత.. ఆర్యులు సింధునాగరికత లేక హరప్పా నాగరికతకు ముందటి కాలంలో నివసించిన భారతీయులేనని నిరూపించాడని చెప్పాడు మాస్టారూ!''.
''ఓహౌ! అలాగా! దేన్ని ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ప్రొఫెసర్లందరూ అంగీకరించారో, ఆ విషయాన్ని మీకు వివరిస్తాను'' అంటూ మొదలెట్టారు మాస్టారు.
''సింధు నాగరికతకు చెందిన నగరాల శిథిలాల్లోని అడుగు పొరల్లో ఎక్కడా మచ్చిక చేయబడ్డ గుర్రాల ఎముకలు పురావస్తు శాస్త్రజ్ఞులకు దొరకలేదు. అంటే దానర్థమేమిటి సాయిజ్యోతి! నీవు చెప్పమ్మా!'' అడిగారు మాస్టారు.
''అంటే ఆ ప్రజలకు గుర్రాలను గూర్చి ఏమీ తెలియదన్న మాట'' అంది సాయిజ్యోతి.
''ఇక ఆర్యుల విషయం తీసుకుందాం. వారికి చెందిన వైదిక సాహిత్యంలో అనేకచోట్ల గుర్రాలను గూర్చి, గుర్రాలు పూన్చిన రథాలను గూర్చీ చెప్పబడింది. దానిని బట్టి నీకేమర్థమవుతుంది చందూ! నీవు చెప్పు.''
''ఆర్యులు గుర్రాలను బాగా మచ్చిక చేసుకున్నారని అర్థమవుతోంది మాస్టారూ!'' అన్నాడు చందూ.
''ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? అనేందుకు ఇది ఒక కీలకసాక్ష్యం. ఆర్యులు గుర్రాలను ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు? ఎక్కడ మచ్చిక చేసుకున్నారు? ఏ త్రోవన సింధు ప్రాంతానికి వచ్చారు? దీనికి సంబంధించి పురాతత్త్వ శాస్త్రజ్ఞులు స్పష్టమైన రుజువులు సంపాదించారు. వారు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పరిశోధనలు చేసి తేల్చి చెప్పిన విషయం చెబుతాను. మచ్చిక చేయబడిన గుర్రాల ఎముకలు ప్రపంచంలో అనేక చోట్ల దొరికాయి. వాటిలో విశేషం ఏమిటంటే, నేటి రష్యాలోని ఓల్గా నదీ తీరంలో దొరికిన గుర్రాల ఎముకలు క్రీ.పూ.6000 నాటివిగా శాస్త్రజ్ఞులు తేల్చారు. అనటోలియా ప్రాంతంలో అంటే, నేటి టర్కీ ప్రాంతంలో లభించిన గుర్రాల ఎముకలు క్రీ.పూ.4000 ప్రాంతానికి చెందినవిగా గుర్తించారు. దీన్నిబట్టి ఏమి అర్థం చేసుకున్నారు?''.
క్లాసంతా మౌనం.
మరల మస్టారే చెప్పటం మొదలెట్టారు.
''గుర్రాలను మచ్చిక చేసుకోవడం నేర్చిన వ్యక్తులు క్రీ.పూ.4000 నాటికి రష్యా నుంచి టర్కీకి వచ్చారన్న మాట. ఇరాన్, అఫ్ఘనిస్తాన్లో లభించిన అవే గుర్రాల ఎముకలు క్రీ.పూ.3000 నాటివిగా గుర్తించారు. అంటే ఏం జరిగిందన్నమాట?'' చెప్పడం ఆపారు మాస్టారు.
''గుర్రాలను మచ్చిక చేసుకున్న వారు క్రీ.పూ.3000 నాటికి ఇరాన్, అఫ్ఘనిస్తాన్ వరకు వచ్చారని అర్థమవుతోంది మాస్టారూ!'' అన్నాడు శ్రీను.
''అవును. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. మచ్చిక చేయబడిన గుర్రాల ఎముకలు సింధు నగరాల శిథిలాలపై పొరల్లో అంటే క్రీ.పూ.1750 నాటి శిథిలాల్లో దొరికాయి. ఇప్పుడు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఏం రుజువైందో ఊహించి చెప్పండి.'' అడిగారు మాస్టారు.
''గుర్రాలను మచ్చిక చేసుకున్న ఆర్యులు క్రీ.పూ. 6000 ప్రాంతంలో రష్యాలో ఉండేవారనీ, వారు క్రమంగా దక్షిణంగా ప్రయాణించి క్రీ.పూ. 4000 నాటికి టర్కీ వచ్చారనీ, అక్కడి నుంచి ఇరాన్, అఫ్ఘనిస్తాన్కు క్రీ.పూ.3000 నాటికి చేరి క్రీ.పూ.1750నాటికి సింధునదీ తీర నగరాలకు చేరారనీ అర్థమవుతోంది మాస్టారూ!'' అన్నాడు మణిధర్.
గుడ్.. 'అడ్వెంట్ ఆఫ్ ది ఆర్యన్ ఇన్ ఇండియా' గ్రంథంలో ప్రొ||ఆర్.ఎస్.శర్మ ఈ విషయాన్నే వివరించారు. పురావస్తు శాస్త్రజ్ఞులు ఇదే నిర్థారించారు. అయితే, చరిత్ర విద్యార్థి కూడా కాని, గణిత శాస్త్రంలో శిక్షణ పొందిన రాజారామ్.. ప్రపంచంలోని చరిత్ర ప్రొఫెసర్లందరూ పరిశోధించి తేల్చిన విషయాలను వక్రీకరించ బూనుకున్నాడు. ఆయన తాను రచించిన 'డీకోడ్ చేయబడిన సింధు లిపి'' గ్రంథంలో హరప్పాకు చెందిన ఒక సీల్(ముద్ర) మీద గుర్రం బొమ్మ ఉన్నదని చిత్రించాడు. ఆ విధంగా హరప్పా వాసులకు గుర్రం పరిచయమున్న జంతువే అని నిరూపించబోయాడు. కానీ చరిత్ర ఆచార్యులందరూ దాన్ని గురించి ప్రశ్నించే సరికి ఆ చిత్రం కంప్యూటర్లో పెద్దది చేసిన చిత్రమని తానే ఒప్పుకోవలసి వచ్చిందని ''చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలపై బీజేపీ దాడి'' అనే పుస్తకంలో 19వ పేజీలో చెప్పబడింది. దాన్ని అమర్ ఫరూఖీ వంటి ప్రముఖ చరిత్ర రచయితలు ఐదుగురు కలిసి రాశారు.
ఇప్పుడు హిందువుల పవిత్రగంథమైన రుగ్వేదమూ, మరో హిందూ మత గ్రంథం 'బౌద్ధాయన శ్రౌత సూత్ర, రుగ్వేదంతో భాషాపరంగా సన్నిహిత సంబంధమున్న ఇరానియన్ మత గ్రంథం 'అవేస్తా'లలో ఆర్యులు పశ్చిమం నుంచి వచ్చారు అనేందుకు ఉన్న రుజువులను వివరిస్తాను.
రుగ్వేదం 7వ మండలంలో ఇలా ఉంది. ''మిత్రావరుణులారా! యజమానులు కొడవలి చేతబట్టి తూర్పు దిక్కుగా సాగినారు. మీరు దాసులను, సుదాస శతృవులైన ఆర్యులను వధించండి.''
ఈ విషయాన్ని 'బౌద్ధాయన శ్రౌత సూత్ర' మరింత స్పష్టంగా పేర్కొన్నది. దానిలో ఇలా ఉంది.. ''పురూరవుడు- ఊర్వశిలకు ఇరువురు సంతానం. వారు ఆయువు, అమవసువు. తల్లి ఊర్వశి వారిని బయటి ప్రాంతాలకు వెళ్లమన్నది. ఆయువు తన అనుచరులతో తూర్పుగా వెళ్లాడు. వారు కురు, పాంచాల, కాశి, విదేహాలను ఆక్రమించారు. అమవసువు పశ్చిమ ప్రాంతంలోనే ఆగిపోయాడు''.
అలాగే, హరప్పా వ్యాపారుల సీళ్లు(ముద్రలు) పశ్చిమాసియా లోని అనేక నగరాల్లో దొరికాయి. అవి సింధు నాగరికత ప్రజలకు ఆయా దేశాలతో సంబంధాలున్నాయని తెలియజేస్తున్నాయి. కానీ రుగ్వేదంలో ఈ ప్రాంతాల ప్రస్తావన లేకపోవడం ఈ రెండు నాగరికతలు వేరువేరనేటందుకు మరో రుజువు.
సింధు, వైదిక నాగరికతలు వేరువేరనేందుకు మరో రుజువు ఏమిటంటే, హరప్పా సీళ్లలో సింహం బొమ్మ ముద్ర ఒక్కటీ లేదు. రుగ్వేదంలో అనేకసార్లు సింహం పేరు ఉదహరించబడింది.
కాబట్టి పై గ్రంథాల్లోని వివరాలు ఆర్యులు భారతదేశానికి పడమర వైపు నుంచి బయలుదేరి మొదట సింధూ ప్రాంతం వరకూ వచ్చారనీ, అక్కడి నుంచి తూర్పుగా విదేహ అంటే నేటి నేపాల్ వరకూ ఆక్రమించారని తెలియజేస్తున్నాయి.
వైదిక ఆర్యుల మూలాలు, సింధునాగరికత ప్రజల మూలాలను గూర్చి జన్యు పరీక్షలు ఏం తెలియజేస్తున్నాయి? అవి కూడా వివరిస్తాను.
ప్రఖ్యాత సైన్సు పత్రిక 'సైన్సు'లో ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు 117 మంది కలిసి ఒక వ్యాసం రాశారు. వారిలో సిసియంబీ డైరెక్టర్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు, డక్కన్ కాలేజ్ డైరెక్టర్ మొదలైన వారున్నారు. వారు 523 ప్రాచీనకాల అస్థిపంజరాలపై జన్యు పరిశోధనలు చేసి చెప్పిన విషయాలు ఏమిటంటే.. ఆఫ్రికా నుంచి 65,000 ఏండ్ల కిందట బయలుదేరి వచ్చినవారే ప్రథమ భారతీయులు. వారు, ఇరాన్ నుంచి వచ్చిన ఆహార సేకరణ సమూహాలతో కలిసి వాయువ్య భారతదేశంలో హరప్పా నాగరికతను సృష్టించారు. వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చారు. క్రీ.పూ.2000 తర్వాత హరప్పా నాగరికత కరువు కాటకాలతో పతనమౌతున్న దశలో, సింధు నాగరికత ప్రజలు ఆగేయ దిశగా కదిలి, ఇతర ప్రథమ భారతీయులతో సంబంధాలు పెంచుకొని పురాతన దక్షిణ భారత ప్రజల మూల పురుషులైనారు. వారి సంతతి ఈనాడు దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నారు.
దాదాపు అదే సమయంలో (అంటే దాదాపు క్రీ.పూ.2000 తర్వాత) హరప్పా నాగరికులు అప్పటికే మధ్య ఆసియా గుండా ఉత్తరభారతానికి వలస వచ్చిన పశుపోషకుల సమూహంతో సంకీర్ణులై, పురాతన ఉత్తర భారత జన సమూహమయ్యారు. అంటే ఆర్యులు క్రీ.పూ.2000 తర్వాత ఆసియాగుండా వచ్చారని ఈ జన్యు విశ్లేషణలు రుజువు చేస్తున్నాయి. అంతే కాదు, ఈ విశ్లేషణలు 'ఇండియా నుంచి బైటికి వలసలు' అనే సిద్ధాంతం తప్పని రుజువు చేశాయి. ఆ సిద్ధాంతానికి సంబంధించి, ఏ విధమైన జెనిటిక్గాని, ఇతర రుజువులుగాని లేవని నిరూపిస్తున్నాయి.
ఈ అధ్యయనం మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. జెనిటిక్ విశ్లేషణలు, పురాతత్త్వ తవ్వకాలు, భాషాశాస్త్రం అన్నీ.. సింధునాగరిక ప్రజల చేత ద్రవిడ భాష వ్యాపింపజేయబడిందని రుజువు చేస్తున్నాయి.
అయితే, సైన్స్ పత్రికలోని పరిశోధనా వ్యాసం కంటే ముందు ఈ 117 మందిలోనే ఉన్న 28 మంది శాస్త్రజ్ఞులు సెలో పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో హరప్పా నాగరికతకు చెందిన రాఖీ గర్హీలో లభించిన 4600 ఏండ్ల నాటి ఒక స్త్రీ డీఎన్ఏ విశ్లేషణా ఫలితం వివరించబడింది. ఆ వ్యాసం శీర్షిక ఏమంటే.. ''పురాతన హరప్పా నాగరికతకు చెందిన జన్యువుల్లో పచ్చిక బయళ్ల పశుపోషకుల జన్యువులు లేవని నిరూపితమైంది'' అని. దానిలో భారతీయ మీడియా 'ఆర్యుల వలస లేనే లేదు'' అనే శీర్షికతో వ్యాసాలు ప్రచురించింది. కాని 'సెల్' పత్రికా వ్యాసం సారాంశమేమంటే, ఈనాడు లాగా 4600 ఏండ్ల క్రిందట సింధునాగరికత ప్రజల్లో పశుపోషకుల జన్యువులు ఆ ప్రాంతంలో సర్వవ్యాపితంగా ఉన్నాయన్నది. భారతీయ మీడియా 'ఈనాడు లాగా' అనే పదాలు చూడకుండా, ఆ ప్రాంతంలో పశుపోషకుల జన్యువులు ఏనాడూ లేవనే తప్పుడు నిర్ధారణకు వచ్చింది.
పిల్లలూ! ఇలా రుగ్వేదం, పురాతన గ్రంథాలూ, రుగ్వేదానికి సమకాలీనంగా రచించబడిన 'అవేస్తా' జన్యు విశ్లేషణలు అన్నీ ఆర్యులు విదేశీయులేనని స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరో రుజువు చెప్పి ముగిస్తాను.
భారతమాత ముద్దుబిడ్డలైన బాలగంగాదర్ తిలక్, స్వామీ వివేకానంద కూడా ఆర్యులు విదేశీయులేనన్నారు. ఆర్యులు ఉత్తర ధృవ ప్రాంతం నుంచి వచ్చారని వివరిస్తూ తిలక్ 'ది ఆర్కటిక్ ఆరిజిన్ ఆఫ్ ఆర్యన్స్' గ్రంథాన్ని రాశారు. వివేకానంద ఆర్యులేకాదు, ఆర్య కవులు సృష్టించిన పౌరాణిక పాత్రలను గూర్చి కూడా స్పష్టంగా తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ''ప్రత్యేక జన్మలెత్తిన వారిగా పురాణాల్లో చెప్పిన వ్యక్తులు కూడా బయటి దేశాల నుంచి వచ్చి హిందువులై పోయారని అనుకొంటున్నాను''. ఈ విషయం 'వివేకానంద మహోపన్యాసాల, రచనల సమాహారం, మూడవ సంపుటంలోని 383వ పేజీలో ఉంది.
పిల్లలూ! ఇప్పుడు చెప్పండి. ఆర్యులు భారతీయులా? విదేశీయులా?'' అడిగారు మాస్టారు.
''విదేశీయులే మాస్టారూ!'' అన్నారు పిల్లలందరూ గట్టిగా.
సిద్దూ లేచి ''విదేశాల నుంచి వచ్చి భారతీయులైనవారు మాస్టారూ!'' అన్నాడు. అంగీకార సూచకంగా మాస్టారు చిరునవ్వు నవ్వారు.
కె.ఎల్. కాంతారావు