Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా కరోనా వ్యాధితో... సంబంధిత అనంతర, అనుబంధ పరిణామాలతో అట్టుడికిపోతోంది. ప్రతివారికి బతుకు ఒక సమస్య. బతుకుతెరువు ఒక పెద్ద సమస్య. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక దినం గడవడం కష్టమైపోయి నానాయాతనలు పడుతున్నారు. ప్రభుత్వాలే పూర్తి జీతాలు ఇవ్వటంలేదు. ఇక ప్రయివేటు సంస్థల సంగతి సరేసరి. అయినా ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా కొందరు ధన సముపార్జన మార్గాలను అన్వేషిస్తున్నారు. మొదట కొంతకాలం వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రులలో కరోనా రోగులకు పరీక్షలు, చికిత్సలు, క్వారంటైన్లు ఉచితంగా ఏర్పాటు చేశారు. తరువాత కొన్నిచోట్ల ప్రభుత్వాలే రుసుములు వసూలు చేస్తున్నాయి. తరువాత కాలంలో వ్యాధిగ్రస్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటంతో, ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, వసతులు సరిపోవకపోవటంతో ప్రయివేట్ వైద్యశాలలకు కూడా చికిత్సకు అనుమతులు ఇచ్చారు. దాంతో అప్పటివరకు మూతపడి ఆవురావురు మంటున్న ప్రయివేటు వైద్యశాలలు ఇంక విజంభించి వసూళ్ళు ప్రారంభించాయి. రూ. వేలల్లో, లక్షల్లో వసూలు చేస్తున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు కట్టనివాళ్ళకు, కట్టలేనివాళ్ళకు వ్యాధి తగ్గినాగాని ఇంటికి పంపించటంలేదు. ఒకవేళ రోగి చనిపోతే ఆ శవాన్ని బంధువులకు అప్పగించటం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఎంత అమానవీయం? ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉదాసీన వైఖరిని వీడి సత్వర చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలే కరోనా రోగులందరికీ ఉచిత, సమగ్ర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. చికిత్సా కేంద్రాలను, వైద్యులను, వైద్య సదుపాయాలను పెంచాలి. ప్రయివేటు వైద్యశాలలలో కూడా 'ఉచిత చికిత్స'లు ఏర్పాటు చేయాలి. ప్రయివేట్ ఆస్పత్రులపై సంపూర్ణ, కఠిన నిబంధనావళిని ఏర్పాటు చేయాలి.
- బాపట్ల రామ పుల్లారావు