Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో చాలా మంది భారతీయులు కరోనా మహమ్మారి ప్రభావాన్ని సైతం పక్కనబెట్టి చైనా వస్తువుల బహిష్కరణపై, చైనా పట్ల విముఖతపై ఎక్కువగా స్పందించారు అని చెప్పడంలో సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం భారత్ చైనా సరిహద్దులో సంతోష్కుమార్ అనే కల్నల్తో సహా 20మంది భారత జవాన్లు చనిపోవడం. సరిహద్దు రేఖ వద్ద ఏం జరిగిందో, ఎలాంటి ఫైట్ జరిగిందో, ఎవరి తప్పు ఉన్నదో ఇంతవరకు వాస్తవాలు బయటపడలేదు. కానీ మన వాళ్ళు చనిపోయారు. దీనిపై కచ్చితంగా మనకు కోపం రావటం సహజం. అయితే, ''చైనా సైన్యం భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేద''ని ప్రధానమంత్రి ప్రకటిస్తారు, ''130మంది చైనా జవాన్లను మట్టుబెట్టిన భారత దళాలు..'' ''తోకముడిచి వెనక్కి వెళ్లి పోతున్న చైనా బలగాలు'' అని పత్రికల్లో వార్తలు మరుసటి రోజు వస్తాయి. ప్రధానమంత్రి స్వయాన లడక్ ప్రాంతానికి వెళ్లి జవాన్లతో ప్రసంగిస్తూ ''ఇప్పుడు సామ్రాజ్యవాదానికి కాలం చెల్లింది, శాంతికి, అభివృద్ధికి మాత్రమే కాలం ఉన్నది'' అని పరోక్షంగా చైనాను సామ్రాజ్యవాద దేశంగా హెచ్చరిస్తారు. మరి చైనా సామ్రాజ్యవాదానికి పాల్పడినట్టా? భారత జవాన్లు చైనా బార్డర్ ఆక్రమించడానికి వెళ్లినట్టా? తప్పెవరిది? ఎందుకు జరిగింది? వాస్తవాలు బయటకు రావడంలేదు. రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కూడా వెళ్లి పరోక్ష హెచ్చరిక చేసి వచ్చారు. నిజాలు తెలియనప్పుడే ఇలాంటి పరోక్ష వాదనలు వస్తాయి. నిజంగా చైనా తప్పు చేసి దోషిగా అనిపించినట్టయితే చైనాను దోషిగా ప్రధాని, రక్షణ మంత్రితో సహా అధికారంలోని రాజకీయ నాయకులు ఎందుకు ప్రస్తావించరు? ఇరవై మంది మన వాళ్ళు చనిపోయాక కూడా చైనా చేసింది ముమ్మాటికీ తప్పే అని ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయరు? దౌత్య సంబంధాలలో ఈ దాగుడు మూతలు ఎందుకు? అంతర్జాతీయ వేదికలపై ఎందుకు ఫిర్యాదు చేయరు? కింది స్థాయి అధికార పార్టీ నాయకులు మాత్రం చైనాపై ప్రజలను రెచ్చగొడుతూ ఉంటారు. చైనా పట్ల ద్వేషాన్ని ప్రకటించేందుకు ఈ డొంకతిరుగుడు దారులు ఎందుకు? చైనా పెట్టుబడులను భారత్ నిషేధించిందని, భారత్లోని చాలా మంది వ్యాపారస్తులు ఆ రకమైన అడుగు ముందుకు వేశారని ప్రచారం ఊపందుకుంది. ఇందులో ఏమాత్రమూ నిజంలేదు. చైనా నుంచి ఆటోమేటిక్ రూట్ల ద్వారా వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే ముందు కేంద్రం యొక్క అనుమతి తప్పనిసరి అని మాత్రమే కేంద్రం నిర్దేశించింది. అంతే తప్ప ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను వ్యతిరేకిస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. చైనా పట్ల భారత ద్వంద్వ వైఖరి ఇంతకు ముందునుంచీ సందేహాత్మకంగానే ఉన్నది. చైనాను రాజకీయ ఉపన్యాసాల్లో విమర్శించడం, ప్రజల్లో చైనా యొక్క విధానాలను ముఖ్యంగా కమ్యూనిస్టు విధానాలను వ్యతిరేకించినట్టుగా భావ వాదులకు భ్రమలు కల్పిస్తూ, ఒక సానుభూతి పొందుతూ అధికారానికి నేటి పాలకులు బాటలు సిద్దం చేస్తారు. వీరు ఇలాంటి వైఖరి తీసుకోవడానికి మరో కారణం ఏమంటే చైనాను బహిరంగంగా బలపరిస్తే అమెరికా హర్షించదు. భారత్ అమెరికా అడుగులకు మడుగులొత్తేదిగా మారిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ- అమెరికా ఆదేశానుసారం ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తిని భారత్ నిలిపివేయడం. ఇలాంటి పరస్పర వ్యాపారాధారితాల వల్ల ఏర్పడుతున్న సంబంధాలను పటిష్ట పరచడం కోసం భారత ప్రయోజనాలను ఫణంగా పెట్టి సరిహద్దు దేశాలతో కయ్యాని కారణమవుతున్నారు. ఈ సూక్ష్మ అంశాలను అంతగా గమనించని ప్రజానీకం పైపైన కనిపిస్తున్న వాటిపై స్పందించడం సహజం. అట్టి స్పందనలను తాత్కాలికంగా సంతృప్తి పరిచేలా నిర్ణయాలు చేయడం సరైంది కాదు.
పత్రికలు పాలకుల అభిమతాలను ప్రతిబింబిస్తాయి. ఏ దేశపు మీడియా అయినా దీనికి మినహాయింపు కాదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఇలా చేయవలసి వస్తూ ఉంటుంది. ఇక మీడియా ప్రభుత్వ చెప్పుచేతల్లో లేదా అదుపాజ్ఞల్లో పని చేస్తున్నప్పుడు వాస్తవాల కన్నా పాలకుల నిర్దేశాలే ఎక్కువగా ప్రజలకు చేరుతాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో 40మంది జవాన్లను మట్టుపెట్టిన ఉగ్రవాదులకు సమాధానంగా భారతదేశం మరుసటి రోజు జరిపిన సర్జికల్ దాడిలో 300మంది పాకిస్థాన్ వాళ్లు చనిపోయారని స్థానిక జాతీయ మీడియా అంతా వెలువరించింది. దీని సోర్స్ (మూలం) ఎక్కడిది? ఎవరూ పట్టించుకోలేదు. ఇది వాస్తవమా, లేక గాలి కబురా అని కూడా ఆలోచించకుండా అందరూ సంబరాలు చేసుకున్నారు. పాలకులకు కావలసింది కూడా ఇదే. ప్రజలను మభ్య పెట్టడమే ఇప్పుడున్న విధానం.
గడచిన ఆరేండ్లలో మునుపెన్నడూ లేనంతగా సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలు ఏడు(7). పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్. ఈ ఏడు దేశాలలో మయన్మార్ తప్ప ప్రస్తుతం అన్ని దేశాలతో వివాదాలు ఏర్పడ్డవి. రోహింగ్యాలను అత్యంత పాశవికంగా అణచివేస్తున్నదని ప్రపంచమంతా మయన్మార్ను వేలిత్తి చూపిస్తుంటే, భారత్ ఏమీ అనకపోవడంతో మయన్మార్ మనతో వివాదాలు లేనట్టుగా ఉన్నది. పాకిస్థాన్, చైనాలతో ప్రత్యక్షంగా సరిహద్దు వివాదాలు ఎప్పటినుంచో ఉన్నవి. వాటిని దాదాపు పరిష్కరించే స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ సమస్యలు జటిలమై పోయాయి. 2016-17లో భూటాన్ సరిహద్దు ప్రాంతంలో భారత్ నిర్మించిన రోడ్డు మార్గంవల్ల ఆదేశంతో వివాదం మొదలైంది. అది ఇప్పటికీ సద్దుమణగలేదు. భారతదేశంతో అత్యంత సన్నిహితంగా ఉన్న నేపాల్ కూడా కయ్యానికి కాలు దువ్వి తమ దేశ నైసర్గిక స్వరూప చిత్రపటాన్ని భారత్కు అభ్యంతరమయ్యేలా మార్పు చేసింది. చెడిన భారత్ నేపాల్ సంబంధాల అంశంపై కూడా వాస్తవాలు వెలుగు చూడాలి. సమగ్ర చర్చలు జరపకుండా, కనీసం ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఆ తర్వాతి పరిణామాల వల్ల ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భారత్కు శత్రుదేశాలుగా మారాయి. అభివృద్ధి చెందాలనుకున్న ఏ దేశానికైనా ఇలాంటి వివాదాలు చేటు చేయవా? సరిహద్దు వివాదాలు పెరిగేకొద్దీ ఆయా దేశాలే కాదు వాటి మిత్ర దేశాలూ దూరమవుతాయి. దీనికి ఉదాహరణ: ఇరాన్ నుంచి చమురు రవాణాను సులభతరం చేయడానికి నిర్మిస్తున్న ''ఛాబ్బహార్'' పోర్టు నిర్మాణం నుంచి భారత్ను ఇరాన్ వద్దనుకుంది, చైనాను దగ్గర చేసుకుంది. మన ప్రధాని రెండేండ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అర్థంతరంగా ఆగిపోవడం ఏ రకమైన దౌత్య సంబంధం? ఇలాంటి వాతావరణం నిరంతరం కొనసాగితే తటస్థ దేశాలూ, అభివృద్ది చెందిన అంతర్జాతీయ వేదికలూ దేశానికి దూరమవుతాయి. దేశంలోనూ విద్వేష పూరిత వాతావరణం నెలకొని ఆర్థిక అంశాలపై కేంద్రీకరణ సన్నగిల్లుతుంది. భారత పాలనా దక్షతను పతాక స్థాయిలో కీర్తిస్తున్న వారందరూ ఆత్మవిమర్శతో ఈ వాస్తవాలను అవలోకనం చేసుకోవాలి.
ఇక చైనా వస్తు బహిష్కరణ గురించి ప్రస్తావిస్తే, చైనా దిగుమతులను అనుమతిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచీకరణకు పెద్దపీట వేసిన తర్వాత విదేశీ వస్తువుల దిగుమతిని ఒక్కసారిగా ఆపివేయడం కుదరదు. అందుచేతనే ప్రభుత్వం చైనా దిగుమతులను నిషేధించడానికి సిద్ధంగా లేదు. అంతేకాకుండా విదేశీ దిగుమతులపై అతిగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థను గత 30ఏండ్లుగా, వారిస్తున్నా వినకుండా, నిర్మించిన ఈ పాలకులు ఇప్పటికిప్పుడు చైనా దిగుమతులను నిషేధిస్తే వ్యవహారాలను నడపలేరు. చైనా వస్తువులను ఇన్నాళ్ళూ ప్రజలు కొన్నది ఆ దేశంపై అభిమానంతో కాదు. అక్కడి వస్తువులు తక్కువ ధరకు, అత్యంత నాణ్యతతో లభిస్తున్నాయి కాబట్టి. ఏ దేశ వస్తువులనైనా వద్దనుకోవాలంటే దానికి ప్రత్యామ్నాయంగా అంతకు మించిన నాణ్యతతో స్వదేశీ వస్తువులు తయారు చేయడమే పరిష్కారం. కొసమెరుపేంటంటే, చైనా వస్తువలను బహిస్కరించాలని చైనా ఫోన్ల ద్వారా ప్రచారాలు చేయడం. చైనాను కాదని అమెరికాతో సత్సంబంధాలు నెరిపే విధంగా భారత్ అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. భారతదేశానికి అమెరికా ఎప్పటికీ మిత్రదేశం కాలేదు. ఎందుకంటే, మితృత్వం సమఉజ్జీల మధ్యలోనే సాధ్యమవుతుంది. ప్రపంచీకరణలోని వ్యాపార సంబంధాల కాలంలో ఎవరు ఎవరికెంత ఉపయోగమన్నదే ముఖ్యం తప్ప మితృత్వం కాదు. ప్రపంచ జీడీపీలో అమెరికాది 25శాతం, చైనాది 20శాతం, భారత్ది కేవలం మూడున్నర శాతం. అమెరికా భారత్ వల్ల తమకు ఎంత ఉపయోగం ఉన్నది అనే కోణంలోనే ఆలోచిస్తుంది తప్ప భారత్కు సహకరించాలని ఆలోచించదు. భారతదేశ దిగుమతుల్లో అమెరికా చైనాలు దాదాపు సరిసమానంగా ఉన్నవి. చమురు ఉత్పత్తి చేసే దేశాలు, పశ్చిమాసియా ఇస్లామిక్ దేశాల పట్ల అమెరికా వైఖరి శత్రుత్వ పోకడలతో ఉన్నది. దీనిని ఎదుర్కోవలసి వస్తే భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు అవసరం. అందుచేతనే అది మిత్రత్వం నటిస్తూ ఉంటుంది. చైనాకు ఆ అవసరం లేదు. పైన పేర్కొన్న అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నది. వాణిజ్య పరంగా చూసినప్పుడు ఎక్కువ ఎగుమతులు చేయగలుగుతున్న దేశం చైనా. ఆ రకంగా చాలా దేశాలు దానిపై ఆధారపడి ఉన్నవి. భారత్ నిషేదాలు చైనా ఆర్థిక వ్యవస్థను అంతగా ప్రభావితం చేయవు. ఎందుకంటే అంతే స్థాయిలో భారత ముడిసరుకుల ఎగుమతి దెబ్బతింటుంది. ఆసియా ప్రాంతం లోని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్లతో సహా లాటిన్ అమెరికా దేశాలైన వెనెజులా, బొలీవియా, క్యూబా వంటి దేశాలతోనూ చైనా సత్సంబంధాలు కలిగి ఉంది. గడచిన అర్ద శతాబ్దపు కాలాన్ని గమనిస్తే అమెరికా అనేక దేశాలతో యుద్ధాలు చేసింది. సుదూర ప్రాంతంలో ఉన్న దేశాలతోనూ తమకు అనుకూలంగా ప్రవర్తించడం లేదన్న సాకుతో, లేదా తమ చెప్పుచేతల్లో పనిచేయని ప్రభుత్వాలను కూలగొట్టడం కోసమో యుద్ధాలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. భారత పాలకులకు ఈ విషయాలన్నీంటిపై పూర్తి అవగాహన ఉన్నది. అయినప్పటికీ భారతదేశ పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం తద్వారా బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకోసం అనవసర వివాదాలతో తప్పిదాలు చేస్తూ మిత్రలాభం మిత్రబేధాన్ని భారత్ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ- దేశీయ కంపనీ బీఎస్ఎన్ఎల్ యొక్క మొబైల్ సేవల అనుమతిని ఏడేండ్లు నిరాకరించి, 4జి సేవలకు అనుమతినివ్వక... దానిని ఎదగనీయకుండా చేసి రిలయన్స్ జియో భారత టెలికం రంగాన్ని అమాంతం మింగేలా అవకాశమివ్వడం. ఇప్పుడీ దేశీయ కంపనీ- రిలయన్స్ జియో మెల్లి మెల్లిగా తన కొన్ని వాటాలను బహుళజాతి కంపెనీలు-ఫేస్బుక్, గూగుల్ వంటి పదమూడు కంపెనీలకు అమ్మేసింది. రేపటిరోజు ఫేస్బుక్, గూగుల్పై చర్యలకు ఉపక్రమించాలంటే రిలయన్స్ సహిస్తుందా..? ఇదండీ అభివృద్ది నీడలో బహుళ జాతి క్రీడ. అంచేత ఆర్థిక వ్యవస్థలో ఎలాగూ నివారించనలవి కాని తప్పిదాలు చేస్తున్నారు. ఇక సరిహద్దు వివాదాలతో కూడా దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తే నష్ట నివారణ కష్టం. బాధ్యత కలిగిన ప్రజలు ఈ ప్రేరేపితాల పట్ల తగు జాగ్రత్తగా ఉండటం శ్రేయశ్కరం.
సెల్: 9951300016
జి. తిరుపతయ్య