Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 కల్లోలం కారణం గా ఉద్భవించిన సామాజిక ఆర్థిక ప్రభావంతో అదనంగా 6.7 మిలియన్ల ఐదేండ్ల లోపు వయస్సుగల బాలలు ప్రమాదకర పోషకాహార లోపంతో బాధపడు తున్నారని, సగానికి పైగా బాలల మరణాలు నమోదు అవుతు న్నాయని 2020 జూలై 29న విడుదల చేసిన 'యూనిసెఫ్-2020 నివేదిక' హెచ్చరిస్తూ, కఠిన వాస్తవాలను వెళ్లడించింది. ప్రతి ముగ్గురు బాలల్లో ఒక్కరు తీవ్ర పోషకాహారలోపంతో ఎదగలేక పోతున్నారు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన 80శాతం బాలలు తీవ్ర పోషకాహార లోపంతో జీవనం సాగిస్తున్నారు. ఇందులో సగం కన్న ఎక్కువ దక్షిణ ఆసియాకు చెందిన బాలలే ఉన్నారని యూనిసెఫ్ నివేదిక తేల్చింది. పోషకాహారలోపంతో బాధపడు తున్న బాలలకు కరోనా లాంటి అనేక అంటువ్యాధులు తొందరగా సోకుతాయని తెలుపుతున్నారు. యూనిసెఫ్ కార్యనిర్వాహక డైరెక్టర్ హెన్రియెట్టా ఫోరె వివరణ ప్రకారం గత ఏడు మాసాలుగా కోవిడ్-19 మహమ్మారి చూపిస్తున్న తీవ్ర ప్రభావానికి మించి, పోషకాహార లోపంతో చితికి పోతున్న బాలల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంట్లో కడుపేదరికం, పని దొరక్క పోవడం, ఆహార భద్రత లేకపోవడమనే కారణాలు బాలల ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అత్యవసర పోషకాహార సరఫరా దెబ్బతిని, ధరలు పెరగడంతో బాలలు కనీస పోషకాహారానికి దూరం అవుతూ, తీవ్ర పోషకాహారలోప స్థితికి చేరడం జరిగిందని నివేదిక తెలిపింది. తీవ్ర పోషకాహార లోపంతో బాలల శారీరక అభివద్ధి ఆగిపోయిన కారణంగా వయస్సు కన్న అతి తక్కువ ఎత్తుతో (స్టంటింగ్) పొట్టి వాళ్ళలా మారుతున్నారని కూడా గుర్తించారు.
వయస్సుకు, ఎత్తుకు తగిన శరీర ఎదుగుదల లేకుండా బక్కచిక్కి, బలహీనతతో ఎముకల గూడుగా మారడమనే 'వేస్టింగ్' కారణంగా అధిక శాతం బాలలు బాధ పడుతూ, శారీరక మానసిక వికాసానికి దూరమవుతూ, చావుకు దగ్గరవుతున్నారని విచారం వ్యక్తం చేసింది. కరోనాకు ముందు ప్రపంచవ్యాప్తంగా 47మిలియన్ల బాలలు పోషకాహార (వేస్టింగ్) సమస్యలతో సహజీవనం చేస్తే, ప్రస్తుత కరోనా కాలంలో వారిసంఖ్య 54 మిలియన్లకు చేరడం మొదటిసారి ఈ మిలీనియంలో జరిగింది. కరోనా వ్యాప్తితో పేద దేశాలలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేండ్ల లోపు వయస్సున్న బాలల సంఖ్య 14.3శాతం పెరిగిందని గుర్తించారు. దీని పర్యవసానంగా సగానికి పైగా బాలలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారని అనుమాని స్తున్నారు. కోవిడ్-19 భయానక పరిస్థితి ఇలాగే మరికొన్ని మాసాలు కొనసాగితే బాలలు, నిరుపేద మహిళా తల్లులు సూక్ష్మపోషకాల లోపం, బరువు పెరగడం, స్థూలకాయం వంటి పోషకాహారలోప సమస్యల వలయంలో చిక్కుకుంటారని ఐరాస సంస్థలు తేల్చాయి. కరోనా విజంభన ప్రారంభ మాసాలలో 30శాతం వరకు నిత్యవసరాలు అందలేదని, లాక్డౌన్ తరువాత 75-100 శాతం నిత్యావసరాల సరఫరా ఆగిపోయిందని గుర్తించారు. విశ్వవ్యాప్తంగా 250మిలియన్ల బాలలకు విటమిన్-ఏ అందలేదని, దాదాపు 25శాతం వరకు పోషకాహార లోపం పెరిగిందని తేల్చారు. వీటి ఫలితంగా 1,28,605 అదనపు బాలల మరణాలు జరుగవచ్చని విశ్లేషించారు. గర్భిణి స్త్రీలకు అందవలసిన సమతుల పోషకాహారం అందక పోవడం కూడా పరిస్థితి తీవ్రతను మరింత జటిలం చేస్తుందని నివేదిక తెలుపుతోంది.
పేదదేశాలకు చెందిన బాలలు, మహిళలకు కనీస పోషకాహారం ఈ ఏడాదిలో అందించడానికి సత్వరమే 2.4 బిలియన్ల అమెరికన్ యుయస్ డాలర్ల నిధి అవసరమవుతుందని అంచనా వేశారు. కోవిడ్-19 కాలంలో రేపటి పౌరుల పోషకాహార హక్కులను కాపాడేందుకు ఆయాదేశాల ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు, దాతలు వెంటనే స్పందించాలని ఐరాస సంస్థలు విజ్ఞప్తులు చేశాయి. ఆహార ఉత్పత్తిరంగాల ప్రోత్సాహం, ఆహార సరఫరా నియంత్రణ, తల్లిపాల రక్షణ, బాలలకు, తల్లులకు సమతుల ఆహార లభ్యతలను కాపాడాల్సి ఉంది. బాలల్లో పోషకాహార లోపాల్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, పేద కుటుంబాలకు ఆహారాన్ని ఇంటి వద్దనే పంపిణీ చేయడం, పాఠశాలల్లో సురక్షిత మధ్యాహ్న భోజనం కల్పించడం లాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ ప్రణాళిక ప్రకారం కోవిడ్-19 ధాటికి తట్టుకుంటున్న విశ్వమానవాళి, ముఖ్యంగా ఐదేండ్ల లోపు బాలలను రక్షించుకోవడానికి రెస్పాండ్(స్పందించు), రికవర్ (క్షేమంగా బయటపడడం) రీఇమాజిన్(తిరిగి రూపాన్ని వ్వడం) అనబడే త్రిసుత్రాలను ప్రతిపాదించారు. సమస్య జటిలం కాక పూర్వమే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయట పడిన వారిని సంరక్షించు కోవడం అనే విషయాలకు కట్టుబడి బాలలను, తల్లులను ఆరోగ్యవంతులుగా చూసుకోవలసిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించకూడదు.
సెల్: 9949700037
డాక్టర్ బుర్ర
మధుసూదన్రెడ్డి