Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం 2022నాటికి రైతులను ధనికులుగా చేస్తామని అంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వ్యవసాయ సమీక్షా. సమావేశంలో రైతులను ధనికులుగా చేయటమే తన ఆలోచన అని ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటించిన మద్దుతు ధరలు రైతులకు లభించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రబీ సీజన్లో కరోనాను దష్టిలో ఉంచుకుని రైతుల వద్ద వరి ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు చేసింది. సరిగ్గా యాసంగి పంటల కోతల ప్రారంభ సమయంలో కరోనా నియంత్రణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. రైతులు పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో విపత్కర పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్లు కూడా బంద్ ఉండటంతో.. అసలు తాము పండించిన పంటలు సకాలంలో అమ్ముకునే స్థితి ఉంటుందా? వ్యవసాయ, కుటుంబ అవసరాలకు తెచ్చిన అప్పులు వడ్డీల భయం తోపాటు పండించిన పంటలు నిల్వ చేయడం ఎలా? అనే అంశంపై తీవ్ర ఆందోళనకు గురి అవుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు భరోసా ఇస్తూ రెండు మూడు దఫాలుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని హామీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మూడు నెలల్లో 7000 పైగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసారు. ముఖ్యమంత్రి పదేపదే కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, డబ్బులు కూడా సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు చాలా ఆర్భాటంగా ఒక నెల రోజులు పాటు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇంతా జరిగినా ప్రభుత్వం అంచనా వేసినట్టుగా వరి ధాన్యం ఒక్క కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరగలేదు. 70శాతం మాత్రమే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంట అమ్ముకున్నారు. దీనిలో రైతుల పేరుతో వ్యాపారులు కొనుగోలు చేసి అమ్మిన ధాన్యం కూడా ఉంది.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ఉన్నత అధికారులు అక్కడ రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలిగించటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పలు చోట్ల రైతాంగం రోడ్లు ఎక్కి ధాన్యం రాశులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రైతులపై కేసులు నమోదు చేశారు. రబీ సీజన్లో 39లక్షల ఎకరాలలో రికార్డు స్థాయి దిగుబడి ఒక కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నులువస్తుందని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్ప తనం అంటూ ప్రచారం కల్పించారు. అసలు వానాకాలంలో జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టులలో నీరు లేక వరి పంట సాగు తక్కువ అయి తర్వాత రెండు నెలల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండటంతో రబీలో గత అన్ని సీజన్లో కంటే ఎక్కువగా వరి పంట సాగు కావటం, వాతావరణం పరిస్థితులు అనుకూలించటంతో దిగుబడి పెరిగింది. దిగుబడి మేరకు అవసరమైన గన్నీ సంచులు, ఎగుమతికి అవసరమైన లారీల ఏర్పాటు సకాలంలో జరగలేదు. దీని మూలంగా రైతాంగం విసిగిపోయి ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల్లో అయిన కాడికి దళారులుకు అమ్ముకున్నారు. రైతులదగ్గర కొనుగోలు చేసిన దళారులు అక్కడే ప్రభుత్వ సంస్థలకు అమ్ముకున్నారు. దళారుల దోపిడీ కంటే ప్రభుత్వం యొక్క సహాయంతో రైస్ మిల్లర్లు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు సందర్భంగా చేసిన దోపిడీ ఎక్కువగా ఉందని రైతులు వాపోయారు. రైతులు దారుణంగా నష్టపోయారు. రైతులకు జరిగిన నష్టంపై కనీసం ప్రభుత్వం స్పందించ లేదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు మాబాధ్యత కాదు అంటూ దాటవేస్తున్నారు. రైతాంగానికి అండగా ఉండాల్సిన మంత్రులు ధాన్యంలో తాలు వస్తుంది, అని అందుకే మిల్లర్లు కటింగ్ చేస్తున్నారు అని మీడియాలో ప్రకటనలు చేశారు. దీనీతో రైస్ మిల్లర్లు మరింత రెట్టింపు కటింగ్ చేశారు. తేమశాతం, తాలు పేరుతో సివిల్ సప్లరు మంత్రి గంగుల కమలాకర్ ఇలాకాలో ప్రారంభమైన దోపిడీ రాష్ట్ర నలుదిక్కులా వ్యాపించింది.
క్వింటాల్కు మూడు నుంచి పది కేజీల ధాన్యం కట్టింగ్ చేశారు. ఒక్క లారీ లోడ్కి 10 నుంచి 50 క్వింటాళ్ల కట్టింగ్ పెట్టారు. 40 కేజీలకు అదనంగా బస్తా బరువు తారం పేరుతో మరో కేజీ కట్టాలు వేస్తే మిల్లర్ల వేధింపులుతో కొందరు రైతులు 42 కేజీల ధాన్యం కటాలు వేశారు. సీసీఐ పత్తి కొనుగోలులోను క్వింటాళ్లకు ఐదు నుంచి పది కేజీల కట్టింగ్ పెట్టింది. అంటే ప్రభుత్వం ఇచ్చే రూ.5550లో రూ.550 కట్టింగ్ రవాణా ఖర్చులు వెయిటింగ్ ఛార్జి మామూలే, మక్కలు కొనుగోలులో మొదట తేమశాతం, తాలు ఏమీ మాట్లాడకుండా రైతులకు డబ్బులు చేల్లించేటపుడు భారీగా కోత విధించారు.
ఇంత భారీ దోపిడీ జరిగినా ప్రభుత్వం స్పందించటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పోలీసు స్టేషన్లో ఒక మహిళా రైతు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోసైటీ సిబ్బంది ద్వారా ధ్యానం కొనుగోలు చేసి కాటా ప్రకారం ట్రక్ సీటిలు ఇచ్చి వాటి ప్రకారం డబ్బులు ఇవ్వకుండా రూ.43వేలు కట్టింగ్ చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్దకు రైతు తీసుకువచ్చిన ధాన్యం మొదట తేమశాతం పరీశీలనచేసి నాణ్యతా ప్రమాణాలు చూసి కొనుగోలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ అధికారులు చేస్తారు. అక్కడ నుంచి రైతులకు సంబంధం లేదు. కానీ కొనుగోలు కేంద్రాల నుంచి వాటిని తరలించేవరకూ రైతు బాధ్యత వహించాలని, అంతటితో ఆగక దిగుమతి అయ్యే వరకు రైతుపై బాధ్యత, భారం వేశారు. దోపిడీకి ఇక్కడే భారీ బీజం పడింది.
కాటాలు అయిన బస్తాలు10 నుంచి 20రోజులు కొనుగోలు కేంద్రాలనుంచి తరలించలేదు. పలు కొనుగోలు కేంద్రాల్లో కాటాలు అయిన బస్తాలు చదలు పట్టాయి. లారీలు అందుబాటులో లేవు. దీనితో రైతులు విసిగిపోయి ధాన్యంకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులకు తోడు ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేస్తుందో లేదోనన్న గందరగోళం నెలకొంది. వీటిని రైతులలో దళారులు ప్రచారం కల్పించి రైతుల దగ్గర కొనుగోలు చేసి తిరిగి అక్కడ దళారులు ప్రభుత్వంకు అమ్ముకున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, ధనిక రైతులు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమ ధాన్యంను కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే తరలించారు. వారికి అవసరమైన గన్నీ సంచులు లారీలు సకాలంలో అందుబాటులోకి వచ్చాయి. సన్న చిన్న కారు రైతుల, మధ్య తరగతి రాజకీయ పలుకుబడి లేని రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే చివరి గింజ వరకూ ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని హామీ ఇచ్చినా రైతులు ఇబ్బందులు పడలేక విశ్వాసం కోల్పోయారు. ఒక కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం లక్ష్యానికి అమడ దూరంలో నిలిచింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసినా రైతులకు ఆ ధర దక్కడం లేదు. ప్రభుత్వం రైతులను ధనికులుగా చేయడం అనేది ప్రచార కార్యక్రమం కాకుండా ఉండాలంటే మొదటగా ప్రభుత్వం కొనుగోలులో ఉన్న లోపాలను క్షుణ్ణంగా పరీశీలించి నిర్మూలించాలి. నిజంగా రైతులను ధనికులుగా చేయడం జరగాలంటే ప్రభుత్వం కోనుగోలులో లోపాలు సరిదిద్దాలి. అలా కాకుండా అసలు మద్దతు ధరలు ఇవ్వకుండా, ప్రభుత్వ కోనుగోలు లేకుండా చేసే విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతులు ధనికులు కాకపోగా కనుమరుగు అవుతారు.
బొంతు రాంబాబు
సెల్:9490098205