Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాలలకు అక్రిడిటేషన్, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశమంతటా ఒకే పరీక్ష నిర్వహణ తదితర విషయాలు కేంద్ర పెత్తనం పెరుగుదలకు దారితీస్తాయి. విద్యా ప్రమాణాల్లో పోటీకోసం ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను ఆహ్వానించాలనే లక్ష్యంతో విద్యారంగంలో విదేశీ జోక్యం పెరిగే ప్రమాదం కూడా దాపురిస్తుంది. ఈ విధానంలోని అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే సానుకూల అంశాల కంటే ప్రతికూల విషయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ఉపయోగం లేనిదిగా తేలిపోతుంది.
ఎట్టకేలకు నూతన జాతీయ విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రిమండలి జూలై 29న ఆమోదించింది. పార్లమెంటులో చర్చకు పోకుండానే అమలు చేయడానికి సిద్ధమైంది. 2015 మార్చి నుంచి మొదలైన ముసాయిదా విద్యావిధానం రూపకల్పనకు ఆరున్నరేండ్లు పట్టింది. ఇంత సుదీర్ఘ కాలం తయారైన విద్యావిధానం గతంలో ఏదీ లేదు. ఇంత ఎక్కువ సమయం తీసుకున్నందున ఎంత గొప్ప విధానమో అనుకుంటే అంతేమీ లేదని తెలుస్తోంది. విద్యారంగంలో నెలకొన్న నిరాశా నిస్పహలను తొలగిస్తుందని, 21వ శతాబ్దానికి సరితూగే, ప్రపంచ పోటీలో ధీటుగా నిలబడే విధంగా, అందరికీ నాణ్యమైన ఆధునిక విద్యను అందించే భారీ సంస్కరణలను ఆవిష్కరించినట్టు పెద్ద ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్సైట్లో లభించిన 66పేజీల డాక్యుమెంటులో 27ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు అంతగా ఉపయోగంలేనివి, కొన్ని అసంబద్దమైనవి, మరికొన్ని నష్టం చేసేవిగా ఉన్నవి. విద్యారంగంలో నెలకొన్న అసమానత, నాణ్యతాలేమి, అభ్యసన సామర్థ్యాల్లో అసంతృప్తి, విశంఖల విద్యావ్యాపారం, నిధుల కొరత, బాధ్యతా రాహిత్యం తదితర సమస్యలను పరిష్కరించక పోగా అవి మరింత పెరిగేందుకే ఈ విధానం దోహదపడుతుంది.
మానవ వనరుల అభివృద్ధికి మంగళం
జీవనోపాధికి, ఉద్యోగ అవకాశాలకు, దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ, సంస్కృతిశాఖ, క్రీడాశాఖలను కలిపి 1985లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాని స్థాయిని దిగజార్చి సాధారణ విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తున్నారు. విద్య, అభ్యసనంపైన కేంద్రీకరించడానికే పేరు మారుస్తున్నట్టు చెప్పారు. కానీ భారతీయ సంస్కృతిని, విలువలను, లలిత కళలను, వృత్తి విద్యలను, క్రీడలను కరిక్యులర్ సబ్జెక్టులతో సమానంగా మార్కులు, గ్రేడులు అవార్డ్ చేసే ముఖ్యమైన విషయాలుగా నేర్పాలని పాఠశాల విద్యకు ప్రతిపాదించారు. విద్యారంగానికి భావిభారత పౌరులను దేశానికి అవసరమైన మానవ సంపదగా మార్చాల్సిన అవసరం లేదన్నట్టు నూతన విద్యావిధానం వ్యవహరిస్తోంది. ఆరెస్సెస్ వత్తిడికి తలొగ్గి చేసిన మార్పులలో యిదొక ముఖ్యమైన విషయమని తెలుస్తోంది. తొలి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పి.వి.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంలోనే ఈ అనుచితమైన చర్యకు పాల్పడడం శోచనీయం.
విద్యాహక్కు విషయంలో మౌనం!
శిశు విద్యను కూడా చేరుస్తూ పాఠశాల విద్యను 3-18ఏండ్ల వయసు పిల్లలకు విస్తరిస్తున్నట్టు, అదొక పెద్ద మార్పుగా అభివర్ణిస్తున్నారు. కానీ ఆ మేరకు ప్రస్తుతం 6-14ఏండ్ల వయసు పిల్లలకే పరిమితమైన విద్యాహక్కు చట్టాన్ని విస్తరించాల్సిన విషయాన్ని మాత్రం చెప్పలేదు. 10+2గా వున్న పాఠశాల విద్యను 5+3+3+4గా రీ డిజైన్ చేస్తూ ప్రీ ప్రైమరీ, 1,2 తరగతులను (3-8ఏండ్లు) ఒక దొంతరగా చేయబడింది. ప్రీప్రైమరీ విద్య బాధ్యత అంగన్వాడీ కేంద్రాలదే అన్నారు. అవి మాతా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలోనే ఉంటాయి. అందువలన శిశు విద్య విధానపరంగా పాఠశాల విద్యలో పేర్కొన్నా ఆచరణ అగమ్యగోచరంగా మారుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతోకొంత పౌష్టికాహారం పెడతారే తప్ప శిశువిద్య నామమాత్రమే అనే విషయం తెలిసిందే. 85శాతం మెదడు అభివృద్ధి చెందే 3-8ఏండ్ల వయసు పిల్లల భావోద్వేగ, బౌద్ధిక వికాసానికి అవసరమైన తర్ఫీదును యివ్వకపోవడం వల్లనే అభ్యసన సామర్ధ్యాలు, ప్రజ్ఞాపాటవాల్లో వెనుకబాటుకు కారణమవుతుందనే సమస్య పరిష్కారానికి తోడ్పడే అవకాశం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అనే పేరుతో కార్పొరేట్ విద్యావ్యాపారులకు వాటంగా వున్న 11, 12 తరగతులు ఈ విధానంతో కూడా పాఠశాల విద్యలో చేరుతాయని చెప్పలేం. అందువలన 5+3+3+4 అనే రీస్ట్రక్చరుతో అంకెల గారడీ తప్ప ఆచరణలో ఒరిగేదేమి లేదు.
కాలేజీలను మూసేసి నమోదు పెంచుతారా?
ఉన్నత విద్యలో ప్రస్తుతం 25.8శాతంగా వున్న స్థూల నమోదును 2035 నాటికి 50శాతానికి పెంచాలని ఈ విధానం నిర్ణయించింది. అమెరికాలో 88శాతం మంది, ఆస్ట్రేలియాలో 86శాతం మంది, జర్మనీలో 61శాతం మంది, బ్రిటన్లో 56శాతం మంది, బ్రెజిల్లో 46శాతం మంది మలేషియాలో 38శాతం మంది, చైనాలో 30శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా మన దేశంలో నూటికి పాతిక మంది మాత్రమే చదవడం పెద్ద లోపం అని ఆందోళన వ్యక్తం చేసింది.. ఈ దుస్థితిని అధిగమించడానికే టైంబాండ్ టార్గెట్ నిర్ణయించి, దానిని సాధించడానికి అతి పెద్ద సంస్థాగత సర్దుబాటుకు తలపడింది. మూడు వేలమంది పైగా విద్యార్థులతో, మల్టీ డిసిప్లైనరీ (బహుళ విభాగాల) కోర్సులతో, సకల సౌకర్యాలు సదుపాయాలతో ఉన్నత విద్య వాతావరణం ఉట్టిపడే యూనివర్సిటీ లేదా డిగ్రీ గ్రాంటింగ్ అటానమస్ కాలేజీ జిల్లాకి ఒకటి చొప్పున ఉంటే చాలట. అలాంటి ఉన్నత విద్యాసంస్థలు దేశం మొత్తం మీద 15వేలు వుంటే చాలని, ఆ మేరకు ఇప్పుడున్న 40వేలు పైచిలుకు కాలేజీలను, 800 పైగా యూనివర్సిటీలను విలీనం చేసి కుదించాలని నిర్దేశించింది. దాని ప్రకారం 25వేలు పైగా కాలేజీలు ఉనికిని కోల్పోతాయి. ఆ విధంగా చేస్తే ఉన్నత విద్యావకాశాలు దారుణంగా తగ్గిపోతాయనే విషయం తేలిగ్గానే తెలిసిపోతుంది. ఆ సమస్యని తేలిగ్గా అధిగమించడానికి ప్రతి ఉన్నత విద్యాసంస్థ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) ఏర్పాట్లు విస్తృతంగా చేసి, మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు పెట్టాలని చెప్పింది. ఆ విధంగా ఉన్నత విద్యలో నమోదు పెంచాలని సూచించింది. కాలేజీలను మూసేసి నమోదును పెంచాలని చెప్పడం జాతీయ విద్యావిధానం 2020 ప్రత్యేకత!
నిధుల కొరత యధాతధం
సమాజ వికాసానికి ఉపయోగపడే యువతకు ఉన్నత శ్రేణి విద్యను అందించడానికి అవసరమైన పెట్టుబడి పెట్టడానికి వేనుకాడవద్దని ఈ విద్యావిధానం నొక్కి వక్కాణించింది. జీడీపీలో 6శాతం నిధులను విద్యాభివృద్ధికి వెచ్చించాలని 1968 పాలసీలో సూచించినా, 1986లో పునరుద్ఘాటించినా యింతవరకు అమలు జరగక పోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. విద్యారంగానికి చేస్తున్న ఖర్చు మొత్తం జీడీపీలో 4.4శాతంలోపే ఉందని అసంతృప్తి వెలిబుచ్చింది. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్లను కలిపి చూసినా 10శాతం మించడం లేదని వివరించింది. కాబట్టి ఇప్పటికైనా జీడీపీలో 6శాతం నిధులు కేటాయించాల్సిందేనని హితవు పలికింది. ఈ విద్యావిధానంలో చేసిన పలురకాల ప్రతిపాదనలకు అదనపు నిధుల అవసరం పెరుగుతుంది. అందుకోసం ప్రభుత్వ నిధుల కోసమే చూడకుండా ప్రయివేట్ ఫిలాంత్రోఫిక్ సంస్థల భాగస్వామ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. ప్రయివేట్ సంస్థల ప్రవేశానికి అవరోధంగా వున్న ఆంక్షలను సడలించి ''లైట్ బట్ టైట్'' అనే పద్ధతిని పాటించాలని చెప్పింది. దీనిని బట్టి విద్యారంగ అవసరాలకు సరిపడా నిధులను ప్రభుత్వాలు సమకూర్చలేవు గనుక ప్రయివేట్ రంగాన్ని బాగా ప్రోత్సహించాలని విధానపరంగానే చెప్పింది. కనుక ఈ విధానంతో ప్రభుత్వరంగ విద్యాలయాలు మరింత దివాళా తీసే దుస్థితి దాపురిస్తుంది.
భాషల పట్ల దోబూచులాట
సాధ్యమైతే 5వ తరగతి దాక, అవకాశం ఉంటే 8వ తరగతి వరకు మాతభాష, ఇంటి భాష, ప్రాంతీయ భాషలో చదువు చెప్పాలని ఈ విధానం చెప్పింది. దీని ప్రకారం విద్యా మాధ్యమం పట్ల పట్టింపు ఏమీ లేదు. సాధ్యాసాధ్యాలు అనేవి యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు. ప్రయివేట్ స్కూళ్ళు ఎలాగూ ఇంగ్లీష్ మీడియంతోనే నడుస్తాయనే విషయం తేటతెల్లం. ప్రజల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అమలు ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల్లో 32శాతం మంది మాత్రమే మాతృభాష, ఇంటి భాష, ప్రాంతీయ భాషా మాధ్యమంలో ఉన్నారు. బహుళ భాషలకు నెలవైన, శతాబ్దకాలం ఇంగ్లీష్ మాధ్యమంలో పరిపాలన సాగిన సువిశాల భారతదేశంలో సమైక్యతా, సమగ్రతలకు అనువైన త్రిభాషా సూత్రం తిరగబడుతోంది. ప్రాంతీయ భాష మొదటి భాషగా, దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ ద్వితీయ భాషగా, పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీష్ తృతీయ భాషగా యాభైయేండ్ల పైగా అమలవుతున్న విధానం విస్మరించబడింది. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు నేర్పాలని, సంస్కృత భాషకు ప్రాధాన్యత యివ్వాలని, మూడో భాషగా స్వదేశీ విదేశీ భాషల్లో ఏదైనా నేర్చుకోవచ్చని చెప్పింది. సెకండరీ స్టేజ్లో నాలుగో భాషగా కొరియన్, జపనీస్, థారు, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ భాషల్లో ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పారు. కానీ అందులో చైనీస్ భాషను మాత్రం కావాలనే వదిలేశారు. పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలు వస్తూ పోతూ ఉండవచ్చు. చైనా పట్ల రాజకీయ వ్యతిరేకతను విద్యావిధానంలో కూడా చూపించడం అవసరమా?
కేంద్ర పెత్తనం పెరుగుతుంది
ఉమ్మడి జాబితాలో గల విద్యారంగంపైన అధికారాలు, బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వున్న విషయం తెలిసిందే. దేశానికి అవసరమైన మౌలిక విధానాలు, కోర్ కరిక్యులమ్ వంటివి కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంటే వాటి ఆధారంగా రాష్ట్రానికి, ప్రజలకు అవసరమైన ప్రణాళికలు వేసుకుని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ అభ్యసన సామర్ధ్యాలు, నాణ్యమైన విద్య పేరుతో కేంద్ర ప్రభుత్వ జోక్యం, పెత్తనం పెరుగుతోంది. ''జాతీయ విద్యా విధానం 2020''లో అది మరింత తీవ్రమవుతుంది. నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఈడీ కోర్సుని నిర్బంబంధం చేస్తే ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రాలకు గల స్వేచ్ఛ హరించుకు పోతుంది. ఇన్పుట్స్ (వసతులు, సదుపాయాలు, ఉపాధ్యాయులు వగైరా)తో నిమిత్తం లేకుండా అవుట్ కంస్ (ఫలితాలు) పైనే కేంద్రీకరించాలని చెప్పడం హాస్యాస్పదం. పాఠశాలలకు అక్రిడిటేషన్, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశమంతటా ఒకే పరీక్ష నిర్వహణ తదితర విషయాలు కేంద్ర పెత్తనం పెరుగుదలకు దారితీస్తాయి. విద్యా ప్రమాణాల్లో పోటీకోసం ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను ఆహ్వానించాలనే లక్ష్యంతో విద్యారంగంలో విదేశీ జోక్యం పెరిగే ప్రమాదం కూడా దాపురిస్తుంది. ఈ విధానంలోని అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే సానుకూల అంశాల కంటే ప్రతికూల విషయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ఉపయోగం లేనిదిగా తేలిపోతుంది.
నాగటి నారాయణ
సెల్: 9490300577