Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలంలో బొగ్గు సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు బాగా పెరుగు తున్నారు. అతితక్కువ వేతనాలతో తీవ్ర శ్రమ దోపిడీకి గురౌతున్నారు. ఇక బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణతో రెగ్యులర్ ఉపాధి మరింత దెబ్బతింటుంది. కార్మికుల రక్షణ ప్రమాదంలో పడనున్నది. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్నది. ప్రయివేటు కార్పొరేట్ లాభాల కోరల్లో బొగ్గు పరిశ్రమ చిక్కుకుని, దేశ ఆర్థిక పురోగమనానికి గొడ్డలిపెట్టుగా మారనున్నది. కనుక ఆర్థిక స్వావలంబనను కాపాడుకునే ఏకైక లక్ష్యంతో ఆగస్టు 18న జరుగుతున్న దేశభక్తియుత సమ్మెకు దేశహితం కోరుకునే ప్రగతిశీల శక్తులంతా అండగా నిలబడాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోల్ ఇండియా, సింగరేణి పరిశ్రమలకు మరణశాసనం రాసింది. బొగ్గు రంగంలోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) రెడ్ కార్పెట్ పరిచింది. మన దేశ ప్రకృతి సహజ వనరులైన బొగ్గు బ్లాకులను ఇ-వేలం ద్వారా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలోనే 500 బొగ్గు బ్లాకులను ప్రయివేటు వ్యక్తులకు విక్రయించనున్నట్టు దేశ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బాహాటంగా ప్రకటించారు. స్వావలంబన పేరుతో దేశీయ బొగ్గు సంస్థలు కోల్ ఇండియా (సీఐఎల్), సింగరేణిలను ధ్వంసం చేసే ఈ చర్యలను నిరసిస్తూ జులై 2, 3, 4 తేదీల్లో ఆరులక్షల మంది బొగ్గుగని కార్మికులు సమ్మె చేశారు. అయినప్పటికీ లక్ష్యపెట్టక ఇ-వేలం వేసిన బొగ్గు బ్లాకుల బిడ్డింగ్ ఓపెన్ ప్రక్రియ ఆగస్టులో ప్రారంభం కానున్నది. అందుకే మళ్ళీ బొగ్గుగని కార్మికులు 'సమ్మె సైరన్' మ్రోగించారు. ఆగస్టు 18న మళ్ళీ దేశవ్యాపిత సమ్మెకు నడుం బిగించారు.
బొగ్గు గనుల జాతీయకరణ నేపథ్యం
సుమారు 200ఏండ్ల క్రితమే దామోదర నదీ పరివాహక ప్రాంతం, రాణిగంజ్ (పశ్చిమ బెంగాల్) బొగ్గు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. 1853లో లోకోమోటివ్ స్టీమ్ ఇంజన్ ద్వారా రైళ్ళను నడిపేందుకు బొగ్గు అవసరం ఏర్పడింది. 1900లో 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. మొదట్లో బెంగాల్, బీహార్ ప్రాంతాలకు పరిమితమైన బొగ్గు గనులు, క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సందర్భంగా బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. మనకు స్వాతంత్య్రం వచ్చే ముందు నాటికి 1946లో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరింది. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా 1960 వరకు దేశం మొత్తం మీద బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెద్దగా ప్రారంభం కాలేదు. ఆనాడు బొగ్గు గనులన్నీ ప్రయివేట్ వ్యక్తుల క్రిందనే నడిచాయి. క్రమబద్ధమైన త్రవ్వకాలు లేకపోవడం, మితిమీరిన లాభాపేక్ష వల్ల తగిన రక్షణ చర్యలు లేనందున గనుల్లో ప్రమాదాలు జరిగి పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగింది. ప్రయివేట్ మాఫియా బొగ్గు గనుల్లో రాజ్యమేలింది. క్రమంగా దేశంలో ఇంధన అవసరాలు పెరగడం, దానికి తగ్గట్టుగా బొగ్గు త్రవ్వకం జరగకపోవడం, ప్రయివేట్ వ్యక్తుల వద్ద తగినంత పెట్టుబడులు లేకపోవడం, ప్రయివేటు మాఫియా కార్మికులపై చేస్తున్న దాడుల ఈ నేపథ్యంలో బొగ్గు గనులను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలనే ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1970లో పెరిగిన విద్యుత్ అవసరాలు, క్రమబద్ధమైన మైనింగ్ నిర్వహణ, కార్మికుల భద్రతా అంశాల అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటుచేశారు. బొగ్గు గనుల నిర్వహణకు భారీ పెట్టుబడుల అవసరం రీత్యా, ఆ సమయంలో ఆయిల్ రేట్లు పెద్దఎత్తున పెరగటం వల్ల బొగ్గుపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ కలిపి 1973లో బొగ్గు గనుల జాతీయకరణకు దారితీశాయి. 1975 నాటికి సింగరేణి మినహా దేశంలోని బొగ్గు గనులన్నీ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) క్రిందికి వచ్చాయి. అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మన తెలంగాణలో ఖమ్మం జిల్లా ఇల్లందులో బొగ్గు నిక్షేపాలు 1871లో కనుగొన్నారు. 1886లో హైదరాబాద్ డెక్కన్ కంపెనీగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతిని పొందగా 1889లో బొగ్గు త్రవ్వకాలు ప్రారంభమైనాయి. అది 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా రిజిస్టర్ కాబడి ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగుతున్నది.
90వ దశకంలో ప్రయివేటీకరణకు పునాదులు
పి.వి. నర్సింహారావు అండ్ మన్మోహన్ సింగ్ కంపెనీ 1991లో నూతన ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కీలకమైన సంస్కరణ ప్రభుత్వ రంగాన్ని బలహీనపర్చటమనే ప్రక్రియ. మరొకటి ప్రభుత్వ రంగాల్లోకి స్వదేశీ, విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచేది. మూడోది కార్మిక సంఘటిత శక్తిని దెబ్బతీయడం. ఈ విధానాల్లో భాగంగానే బొగ్గు రంగంలోనూ పరిణామాలు ముందుకు వచ్చి సంస్కరణల వేగం పుంజుకుంది. అయితే బొగ్గు పరిశ్రమల్లో బలమైన కార్మికోద్యమం దానికి అడ్డుగోడగా నిలిచి, దేశవ్యాప్త ప్రతిఘటనల ద్వారా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటున్నది. దీన్ని గమనించిన పాలకవర్గాలు దొడ్డిదారిన బొగ్గు రంగాన్ని ప్రయివేటీకరించే చర్యలకు ఒడిగట్టారు. అందులో భాగమే క్యాప్టివ్ మైనింగ్ పాలసీ. అంటే ఏదైనా బొగ్గుగనిని ప్రయివేట్ వారు త్రవ్వితే, దానినుంచి వచ్చిన బొగ్గు ఉత్పత్తి తమ పరిశ్రమలకు మాత్రమే వినియోగించే విధానం. ఇది 1910 నుంచి టిస్కో కంపెనీ (టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ), 1918 నుంచి ఇస్కో (ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ) కంపెనీల్లో అమలైంది. అంటే ఆ కంపెనీలకు కేటాయించిన బొగ్గు గనుల నుంచి తీసిన ఉత్పత్తిని ఆ స్టీల్ కంపెనీలకు మాత్రమే వాడటం. 1973 బొగ్గు గనుల జాతీయకరణ పార్లమెంట్ చట్టం ద్వారా అమల్లోకి రావడంతో టిస్కో, ఇస్కో కంపెనీలకు తప్ప క్యాప్టివ్ మైనింగ్ విధానం రద్దయింది.
1993లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1973 చట్టానికి సవరణ తెచ్చి తిరిగి క్యాప్టివ్ మైనింగ్ పాలసీని తెచ్చింది. దీని ఆధారంగా విద్యుత్, గ్యాస్ ప్లాంట్ల కోసం కొన్ని బొగ్గు గనులను క్యాప్టివ్ మైనింగ్ కోసం ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడమనే ప్రక్రియను తర్వాత అధికారంలోకి వచ్చిన వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కొనసాగించాయి.
సరళీకరణ విధానాల ఫలితమే భారీ బొగ్గు కుంభకోణం
1973 బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని తుంగలో త్రొక్కి 1993 నుంచి 2014 దాకా వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మొత్తం 218 బొగ్గు బ్లాకులను ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశాయి. బొగ్గు బ్లాకులు దక్కించుకున్న ప్రయివేటు కంపెనీలు అక్రమ చర్యలకు పాల్పడ్డాయి. ఈ పూర్వ రంగంలోనే యూపీఏ-2 హయాంలో రూ.1,76,000 కోట్ల బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇది మన్మోహన్సింగ్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈ కుంభకోణాన్ని రాజకీయంగా బాగా ఉపయోగించుకొని గద్దెనెక్కింది. ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది. 2014 ఆగస్టు 25న సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. మొత్తం 218బొగ్గు బ్లాకులకు గాను 214బ్లాకులను చట్టవిరుద్ధంగా కేటాయింపులు జరిపారని, వాటిని రద్దుచేస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఏన్టీపీసీి, సెయిల్కు కేటాయించిన 4బ్లాకులే క్యాపిటివ్ మైన్లు తప్ప మిగిలినవన్నీ చట్ట విరుద్ధమైనవేనని కోర్టు చెప్పింది. ఆ బ్లాకులన్నింటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు నాటికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్డు తీర్పును చిత్తశుద్ధితో అమలుచేయలేదు. 1973 చట్టంలోని ఏ క్లాజు ప్రకారమైతే, చట్టవిరుద్ధమైన చర్య అని కోర్టు పేర్కొన్నదో, ఆ క్లాజునే మార్చివేసి, బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టం-2015ను తనకున్న మెజారిటీతో పార్లమెంట్లో ఆమోదింప జేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం బొగ్గు బ్లాకులను క్యాపిటివ్ మైనింగ్ (స్వంత వినియోగం)కే కాకుండా కమర్షియల్ (వాణిజ్య వ్యాపారం) మైనింగ్కు ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించవచ్చు. సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న చట్ట ఉల్లంఘన అంశాలను, చట్ట బద్ధమైనవిగా మార్చిన ఘనత మోడీకే దక్కుతుంది.
కోలిండియా, సింగరేణి సంస్థల ధ్వంసమే బీజేపీ ఎజెండా
నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నయా ఉదారవాద విధానలను మరింత దూకుడుగా అమలుచేస్తున్నది. స్వాతంత్య్రానంతరం ఎన్నో అంశాల్లో స్వావలంబన దిశలో అభివృద్ధి సాధించిన ప్రభుత్వరంగ పరిశ్రమలను విధ్వంసం చేయటం ప్రభుత్వ విధానంగా మారింది. కీలక రంగాలు బొగ్గు, రక్షణ, రైల్వే, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, కమ్యూనికేషన్, అంతరిక్షం, అటామిక్ ఎనర్జీ లాంటి రంగాలన్నింటిలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వాటాల విక్రయం, పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్ తదితర పద్ధతులతో ప్రయివేటీకరణ చర్యలను వేగవంతం చేసింది. 2019లోనే బొగ్గు రంగంలో 100శాతం ఎఫ్డీఐలను కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీన్ని నిరసిస్తూ 2019 సెప్టెంబర్ 24న ఆరు లక్షల మంది బొగ్గు గని కార్మికులు అఖిల భారత సమ్మె నిర్వహించారు. దీనితో ఒక అడుగు వెనక్కి వేసిన ప్రభుత్వం కోవిడ్-19ను ఒక మంచి సందర్భంగా ఎంచుకున్నది. కార్మిక పోరాటాలకు పరిమితులుంటాయని భావించింది. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన సందర్భంగా 500 బొగ్గు గనులను ప్రయివేటు వారికి అప్పగించనున్నట్టు ప్రకటించడమే కాకుండా శరవేగంగా జూన్ 18న ఈ వేలం ద్వారా 41బొగ్గు బ్లాకులను వేలం వేసింది. అలాగే 100శాతం ఎఫ్డీఐలకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈ చర్యలన్నీ దేశ ఆర్థిక స్వావలంబనకు తీవ్ర హాని చేయడంతో పాటు మన పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటివరకు మన ఇంధన అవసరాన్నింటినీ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీలు తీర్చుతున్నాయి. దీనికి తోడు మరో 208మి.టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తే మన ఇంధన అవసరాలను 100శాతం తీర్చగలిగే సామర్థ్యం కోల్ ఇండియాకు ఉన్నది. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేంద్ర సర్కార్కు డివిడెంట్ ఇస్తున్న కోల్ ఇండియాను నిర్వీర్యం చేసేందుకు ఇప్పటికే 30శాతం వాటాల విక్రయం చేశారు. బై బ్యాక్ పాలసీ పేరుతో సీఐఎల్ దగ్గరున్న మిగులు నిధుల్లో నుంచి రూ.56,000 కోట్లు బీజేపీ ప్రభుత్వం కాజేసింది.
బొగ్గు బ్లాకుల వేలం మరింత ప్రమాదకరం
దేశంలో పుష్కలంగా ఉన్న విలువైన బొగ్గు నిక్షేపాలను, మన దేశ సౌభాగ్యానికి వినియోగించుకోవాలనే ఇంగిత జ్ఞానం పాలకులకు కరువైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బొగ్గు బ్లాకుల వేలంతో కోల్ ఇండియా, సింగరేణి తీవ్ర గడ్డు పరిస్థితులనెదుర్కొంటాయి. ప్రస్తుతం నడుస్తున్న బొగ్గు బావుల్లో పూర్తిగా బొగ్గు తీశాక, ఆ రెండు సంస్థలు సజీవంగా ఉండాలంటే కొత్త బొగ్గు బ్లాకులు కావాలి. మరి కొత్త బ్లాకులన్నింటినీ, ప్రయివేట్ వారికి కమర్షియల్ మైనింగ్కు ఇచ్చాక, వారు ఆ బొగ్గును ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మన దేశంలోని పరిశ్రమలకే ఇవ్వాల్సిన షరతులేవీ లేవు. అప్పుడు బొగ్గు ఆధారిత మన దేశ పరిశ్రమలన్నీ సంక్షోభంలో పడతాయి. మరోవైపు కోల్ ఇండియా, సింగరేణి కంపెనీలకు కొత్త బ్లాకులు కేటాయించకపోతే ఆ సంస్థలూ సహజ మరణం వైపు నెట్టబడతాయి. బొగ్గు పరిశ్రమ అంటేనే లక్షలాది మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమ. 1990 దశకం కంటే ముందు దేశంలో 8లక్షల మంది బొగ్గుగని కార్మికులున్నారు. సంస్కరణల ఫలితంగా నేడు ఆరు లక్షల మందికి తగ్గారు. 1991లో 1,16,000 మంది ఉద్యోగులున్న సింగరేణిలో నేడు 47,000మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఈ కాలంలో బొగ్గు సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు బాగా పెరుగు తున్నారు. అతితక్కువ వేతనాలతో తీవ్ర శ్రమ దోపిడీకి గురౌతున్నారు. ఇక బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణతో రెగ్యులర్ ఉపాధి మరింత దెబ్బతింటుంది. కార్మికుల రక్షణ ప్రమాదంలో పడనున్నది. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్నది. ప్రయివేటు కార్పొరేట్ లాభాల కోరల్లో బొగ్గు పరిశ్రమ చిక్కుకుని, దేశ ఆర్థిక పురోగమనానికి గొడ్డలిపెట్టుగా మారనున్నది. కనుక ఆర్థిక స్వావలంబనను కాపాడుకునే ఏకైక లక్ష్యంతో ఆగస్టు 18న జరుగుతున్న దేశభక్తియుత సమ్మెకు దేశహితం కోరుకునే ప్రగతి శీల శక్తులంతా అండగా నిలబడాలి.
ఎం. సాయిబాబు
సెల్:94900980930