Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీతి, నిజాయితీ, నిలువెత్తు తెలుగుదనానికీ నిదర్శనం బోడేపూడి. మార్క్సిస్టు ఉద్యమ నేతగా, ప్రజా నాయకుడిగా, ఆదర్శ రాజకీయ వేత్తగా, రైతు బాంధవుడిగా అత్యంత గౌరవ మన్ననలను పొందిన మహావ్యక్తి బోడేపూడి వెంకటేశ్వరరావు. మార్క్సిజంలోని సజీవసారాన్ని గ్రహించి లెనిన్ నిర్వచించినట్టుగా నిర్దిష్ట పరిస్థితుల - నిర్దిష్ట విశ్లేషణ అనే అంశం ఆధారంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక బహుముఖ వైవిధ్యం ఉన్న ఖమ్మం జిల్లాలో మార్క్సిస్టుపార్టీ ఉద్యమ విస్తరణకు కృషి చేశారు.
చిన్నతనంలో తండ్రి మరణించడంతో మేనమామల గ్రామం, వైరా మండలం, గండగలపాడుకు తల్లితో బతుకుదెరువు కోసం వచ్చి, మేనమామ ఇంట్లోనే పాలేరుగా తన జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావంతో కమ్యూనిస్టుగా మారి కడవరకు పేదల, రైతుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి కషిచేసిన యోధుడు బోడేపూడి. రాత్రి పాఠశాలలో పెద్దబాలశిక్ష నేర్చుకొని గ్రామంలో పెద్దల సలహా మేరకు పాఠశాల ప్రారంభించి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పే బాధ్యత తీసుకున్నారు.
తను నివాసమున్న గ్రామంతో పాటు సమీప గ్రామాల్లో నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ సాయుధ పోరాటం అనేకమందిని ఆకర్షించింది. బోడేపూడిపై కూడా పోరాట ప్రభావం పడింది. పాలేరుగా పనిచేస్తూనే ఆంధ్రప్రాంతం నుంచి వచ్చే పార్టీ రహస్య సమాచారాన్ని, పత్రికను సింగరేణి కాలరీస్ కార్మిక నాయకుడు కామ్రేడ్ శేషగిరిరావుకు కొత్తగూడెం కాలినడకన వెళ్ళి అందిస్తూ కొరియర్గా మారారు. గ్రామంలోని అనేకమంది అరెస్టు కావడంతో తాను రహస్యంగా మద్రాసు చేరుకొని ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయడం జరిగింది. మద్రాసు నుంచి తిరిగి వచ్చి కమ్యూనిస్ట్పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టి నల్లమల గిరిప్రసాద్, నల్లమోతు పిచ్చయ్యతో కలిసి మధిర తాలుకాలో కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేశారు. చిర్రావూరి లక్ష్మి నర్సయ్య, మంచికంటి రామకిషన్ రావు, కెఎల్ నరసింహారావు, పర్సా సత్యనారాయణ, టిబిఆర్ చంద్రంలతో కలిసి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) విస్తరణకు కృషి చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా దశాబ్దకాలం పనిచేశారు.
నిరంతర ప్రజా పోరాటాలతో ఆగస్టు 5, 1997న తాను కన్నుమూసే వరకూ ఎర్రజండా మోస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసిన రైతు బాంధవుడు బోడేపూడి వెంకటేశ్వరరావు. 1985 నుంచి వరసగా 89,94, ఎన్నికలలో మధిర అసెంబ్లీ నుంచి గెలుపొందిన బోడెపూడి 89నుంచి మరిణించేవరకు శాసనసభ లో సీపీఐ(ఎం) పక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా విస్తృత సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పునః నిర్మాణంలో నేలకొండపల్లి రైతు మహాసభ తొలి అంకం. అది మొదట తుదిశ్వాస విడిచే వరకూ రైతాంగ ఉద్యమంలో ఆయన భాగస్వామి. గిట్టుబాటు ధరలు, పంటనష్టపరిహారం కోసం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రైతు నేత. సాగు నీటి అభివృద్ధికి సంబంధించి వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శాసనసభలో నొక్కి చెప్పే వారు. కరువు, వరదలతో పంటలు దెబ్బతిన్న సమయంలో విస్తృతంగా పర్యటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వారు. జిల్లాలో దళిత గిరిజన రైతులు, సన్న చిన్న కారు రైతుల కోసం, వాగులు, ఏరులుపై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయించారు. ఇప్పటికీ అవి ఉపయోగకరంగా ఉన్నాయి.
వైరా రిజర్వాయర్ ఆయకట్టు ద్వారా రెండు పంటలకు నీరు అందించే ప్రయత్నం చేశారు. సాగర్ ఆయకట్టులో చివరి భూములకు సాగునీరు అందించేందుకు కాల్వలపై తన శరీరం సహకరించకపోయినా తిరిగి పంటలను కాపాడిన రైతు బాంధవుడు బోడేపూడి. 1950 దశకం ప్రారంభంలో వైరా కమిటీ స్కూల్ ఏర్పాటుకై పాటిబండ్ల సత్యనారాయణ, చింత నిప్పు నర్సయ్యలతో కలిసి పునాది వేశారు. కేవీసీఎం డిగ్రీ కళాశాల ఏర్పాటు తోపాటు జిల్లాలో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. విద్యార్థి యువజన సంఘాలను ప్రోత్సహించారు.
సహకార సంఘాల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారు. వైరా విశాల పరపతి సంఘం జిల్లాలో నేటికీ పెద్ద సంఘంగా రైతులకు సేవలు అందించటం వెనుక బోడేపూడి పాత్ర ముఖ్యమైనది. సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వామి, ఆదర్శ వివాహాలు జరపటంలో ఆచార్యులుగా ఉండే వారు, కళలు సాహిత్యం పట్ల ఆయన ఎంతో ఆసక్తి చూపేవారు.
వరుస మూడు ఎన్నికల్లో మధిర శాసనసభ నియోజకవర్గం నుంచి ఓటమి చెందినా ప్రజలను అంటిపెట్టుకుని ఉండి సేవలందించిన బోడేపూడి తిరిగి వరుస మూడు ఎన్నికల్లో అదే స్థానంలో విజయం సాధించి అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. మన ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే మిషన్ భగీరథను 1996లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి వైరా రిజర్వాయర్పై సుజల స్రవంతి ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు ప్లోరైడ్ రహిత మంచి నీరు అందించారు. బోడేపూడి వెంకటేశ్వరరావు సంతాపసభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వైరా ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీటీతో పడుతున్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి పట్టు పట్టి సుజల స్రవంతి సాధించారనీ, అందుకే సుజల స్రవంతికి బోడేపూడి సుజల స్రవంతిగా ప్రభుత్వం నామకరణం చేస్తున్నదనీ అని ప్రకటించారు. బోడేపూడి సుజల స్రవంతి నుంచి 7మండలాల ప్రజలకు మంచినీరు సరఫరా జరుగుతున్నది. వైరుధ్యాలు ఎన్నున్నా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా బోడేపూడిని గౌరవించేవారు. ప్రజలను వశపరచుకునే ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం ఆయనది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బోడేపూడి అనుభవాలను, ఆయన మహత్తర వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు నివాళి.
- బొంతు రాంబాబు, సెల్:9490098205