Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వ్యాధికి మందు లేదు. వాక్సిన్ రావడానికి సమయం పడుతుంది. స్వీయ నియంత్రణే రక్ష. రోజుకి 4సార్లు సబ్బుతో చేతులు కడగండీ, వేరే వ్యక్తులను, వస్తువులు తాకితే వెంటనే శానిటైజ్ చేసుకోండీ! ప్రతిరోజు మాస్కులు ధరించండీ! ఇది అంటున్నది ఎవరో కాదు. సాక్షాత్తు ప్రభుత్వాలే. వైద్య నిపుణుల సలహా కూడా ఇదే. ఈ సలహాలను ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంఎల్ఏలు, డబ్బున్న సంపన్న వర్గాలకు చెందినవారు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఎటొచ్చి చచ్చేది నిరుపేదలు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కరోనాపై పోరాటం చేస్తున్న (మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు) కరోనా యుద్ధ వీరులే.
మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు అత్యంత కీలకమైనప్పటికీ ప్రభుత్వం నుంచి వారికి అలాంటి గుర్తింపు దక్కడంలేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలియగానే రక్త సంబంధీకులు సైతం ఆమడదూరం పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ప్రాణ భయంతో ఇండ్లకే పరిమితమైన వేళ, తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తూ, ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడుతున్నారు. కానీ ఇలాంటి వారికి కనీస రక్షణ కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, టవల్స్ సైతం అందించడంలేదు. మార్చి, ఏప్రిల్ నెలలో ఒక్కొక్క కార్మికుడికి రెండు జతల మాస్కులు, గ్లౌజులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
ఆ తరువాత కార్మికులే స్వంత డబ్బులతో వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేయడం, కరోనా అనుమానితులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త వ్యక్తులను గుర్తించి వారికి స్టాంపింగ్ వేయడం, కరోనా వైరస్తో మరణించిన శవాలను స్వయంగా మోసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించడంలో మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వాటి నిర్వహణలో వెనకంజ వేయడంలేదు.
లాక్డౌన్ ప్రకటించి 5నెలలు కావస్తున్నది. ప్రజా రవాణా ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మూడు నెలల పాటు ప్రయివేట్ రవాణా కూడా స్తంభించింది. ఈ కాలంలో కూడా అధికారులు నిర్ణయించిన సమయానికి అనుకున్న ప్రదేశానికి అష్టకష్టాలు పడి కార్మికులు చేరుకొని పనిచేశారు. అర నిమిషం ఆలస్యమైతే మానవత్వంలేని కాంట్రాక్టర్లు, అధికారులు, ఎఫ్ఎస్ఏలు కార్మికులకు నిర్థాక్షిణ్యంగా గైర్హాజర్ వేసిన ఘటనలున్నాయి లేదా వారి వేతనాల్లో కోతలు విధించి శవాలపై పేలాలు ఏరుకుతిన్నట్టుగా కమిషన్లకు కక్కుర్తి పడ్డవారున్నారు.
కరోనా యుద్ధ వీరులకు రాష్ట్ర ప్రభుత్వం అందరి కంటే ఎక్కువ సహాయం చేసి ఆదుకోవాల్సిన సమయం ఇది. కానీ అలా చేయడంలేదు. కరోనా కట్టడి చేసే సందర్బంగా అనేక మంది కార్మికులు సైతం కరోనా వ్యాధి బారినపడ్డారు. వారికి సరైన వైద్యం లేదు. హౌం ఐసోలేషన్లో ఉన్న వారు పౌష్టికాహారానికి నోచుకోవడం లేదు. ఇటీవల కరోసా వైరస్ సోకి రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్పిపాల్టీలో ఒక కార్మికురాలు మృతి చెందింది. ఆ కార్మికురాలు కుటుంబం గురించి పట్టించుకున్న నాధుడేలేడు. మోడీ ప్రకటించిన రూ.50లక్షల బీమా గురించి అధికారులు నోరు మెదపడంలేదు. పారిశుద్ధ్య కార్మికులకు గ్రేటర్ హైదరాబాద్లో రూ.7,500, జిల్లాల్లోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే వారికి ఇన్సెంటీవ్గా రూ.5,000 రెండు నెలలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దానికి కూడా సవాలక్ష షరతులు పెట్టారు. డ్యూటీలు చేసిన వారందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటీవ్ ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నారు. ఇచ్చే నామమాత్రపు ఆర్థిక సహాయాన్ని కూడా దూరం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు 2020లో ఉన్న మొత్తం గ్రామీణ ప్రాంతపు జనాభాకి సేవలు చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం 2011 జనాభా ప్రకారం 500మందికి ఒక కార్మికుడనే నిబంధనపెట్టి అనేక మందికి ఇన్సెంటీవ్ దూరం చేయడం అమానుషం.
గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్కేడే జీవిత బీమా పథకాన్ని అమలుచేస్తున్నట్టు 15నెలల క్రిందట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ ఉద్యోగులు ఎవ్వరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా ఆ బీమా ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన ఎస్కేడే జీవిత బీమా అడ్రస్ లేకుండా పోయింది. కరోనా కాలంలోనే హుజూరాబాద్, దౌల్తాబాద్, రాయపర్తి, దుగ్గొండి, చండూరు, పి.ఎ.పల్లి, నల్లగొండ మండలాలతో పాటు రాష్ట్రంలో దాదాపు 30 మంది చనిపోయారు. వీరికి ముఖ్యమంత్రి ప్రకటించిన బీమా వర్తింపజేయలేదు. గతంలో అమలులో ఉన్న జనశ్రీ యోజన బీమా పథకాన్ని ఇప్పుడు రద్దు చేశారు. గత సమ్మె ఒప్పందాల సందర్బాల్లో కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలు అమలుచేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. కరోనా కాలంలో కార్మికులకు పనిభారం పెరిగింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు సిబ్బందిని నియమించాల్సిన సమయంలో రాజకీయ కారణాలతో సిబ్బందిని తొలగిస్తున్నారు. నారాయణపేట మున్సిపాల్టీలో నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ 15రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్నది. అనేకచోట్ల కార్మికులపై బౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ కాలంలోనే ఖమ్మం, నల్లగొండ, కామారెడ్డి మున్సిపాల్టీల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
కరోనా కష్ట కాలంలో పని చేస్తున్న కార్మికులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలుండాలి. ప్రజల ప్రాణాలను కాపాడే కరోనా యుద్ధ వీరులకే నేడు రక్షణ కరువైంది. సఫాయి కార్మికులకు సలాం చేయడం, సన్మానాలు చేయడం, కాళ్ళు కడగడంతో సరిపెడితే సరిపోదు. గతంలో స్వైన్ఫ్లూ, డెంగ్యూ లాంటి అంటువ్యాదులు ప్రబలినప్పుడు కూడా ఇలాంటి హడావుడి చేసి పారిశుద్ద్య పనులు తాత్కాలికంగా చేపట్టి, తరువాత వాటిని ప్రక్కన పడేసిన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభనలో కూడా గత అనుభవాలే పునరావృతం అవుతున్నాయి. దీనికి పరిష్కార చర్యలు చేపట్టాలి. అందుకు రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో పని చేస్తున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఉద్యోగ, కార్మికులను రాష్ట్ర అవసరాలను, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెటుకొని పర్మినెంట్ చేసి పటిష్టమైన ప్రజారోగ్య పరిరక్షణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
పాలడుగు భాస్కర్
సెల్:9490098033