Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మీ రెందుకండి అనవసరంగా పట్టించుకుని రాద్ధాంతం చేసి వారి బలం పెంచుతారు'' - ఇది ఒక సీనియర్ జర్నలిస్టు నాతో అన్న మాట. అంతకు ముందే ప్రధాని రామాలయ శంఖుస్థాపనకు వెళితే రాజ్యాంగంలో లిఖించబడ్డ ప్రియాంబుల్కు వ్యతిరేక మని, ప్రధానే రాజ్యాంగ ఉల్లంఘన చేసినవారవుతారని చెప్పాను. రాముడిని- రామ బాణాన్ని ఎక్కుపెట్టి మెజారిటైజేషన్ పిలుపును సానుకూలంగా చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు తెలివిగా, ఒక వైపున మైనారిటీలను అదిరించి, బెదిరించి, బుజ్జగించి నోళ్ళు మూయిస్తే, సెక్యులర్ విధానాలకు అంకితమైన రాజకీయ పార్టీలను, బ్లాక్మెయిల్ రాజకీయాలతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే కదా ప్రియాంకగాంధీ లాంటి వాళ్ళను సైతం ఆత్మరక్షణలో పడేసి సానుకూల ప్రకటనలు చేసేట్టు చేయగలిగారు.
ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వస్తే, ఆగస్టు 5న రాజ్యాంగానికి సంకెళ్లు వేసిన రోజుగా పరిగణించబడు తున్నది. మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని పరిథిలోనే కదా పని చేయాల్సింది అనే వాదన పరిగణనలోకి తీసుకోవడం లేదు. 135కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రధానిగా మోడీ ఉండాలనేది యావద్భారతదేశ ప్రజల ఆకాంక్ష. అయితే మెజారిటైజేషన్ పేరుతో భారతీయులందరూ ఒకే గొడుగు క్రిందికి రావాలనే భావోద్రేక నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకుపోతున్నది.
ఇది ఈనాటి ప్రణాళిక కాదు. అధికారం చేతిలో ఉండటంతో పక్కాగా ఆర్ఎస్ఎస్ నేడు తన ప్రణాళికకు అనుగుణంగా ప్రభుత్వం చేత ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ కనుసన్నలలోనే అంతా జరిగింది. రామాలయ నిర్మాణంపై వేసిన ట్రస్టు సభ్యుల ప్రస్తావనే కనబడలేదు. చివరికి హైదరాబాద్లో వేంకటేశ్వరాలయం నిర్మిస్తే దానికి బిర్లా టెంపుల్ అని పేరొచ్చిందే తప్ప, దానిలో అసలు ఏ దేవుడున్నాడో కూడా చాలా మందికి తెలియదు. భవిష్యత్తులో అయోధ్యలో కూడా మోడీనే దేవుడవుతారేమో..! ఏక బాణం, ఏక పత్ని, ఏక నాయకుడు, ఏక దేశం పేరుతో లక్ష్యాన్ని సాధించుకోవాలనే ఎత్తుగడలు ఆర్యస్యస్ 2014లోనే ప్రారంభించింది. క్రమంగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్లో మార్పులు. అయోధ్య ప్రస్తావనతో మతపర డామినేషన్, కొనసాగింపుగా వివాదాస్పద పౌరసత్వ చట్టాలు, చివరికి మెజారిటీ ప్రజల ఆధిపత్యం పరాకాష్టగా ఏక వ్యక్తి పాలన దిశగా పయనం సాగుతున్నది. అలాంటప్పుడు రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ, సమసమాజపు ప్రయాణం ఎంత వరకు ఆచరణలో లెక్కించబడుతుంది. ఈ పరిణామమెక్కడికి దారితీస్తుంది? అంగీకృత విధానాల ప్రాతిపదికన దేశం ఐక్యంగా ఉండగలదా?
మతాల మధ్య సామరస్యం ఉండాలి. దాని జోలికి రాజకీయ వ్యవస్థ పోకూడదనే మౌలిక అంశం మాయమయితే జరగబోయే పరిణామాలేవిధంగా ఉండబో తున్నాయి? ఈ విధానం కొనసాగితే కొంత కాలం మెజారిటీలు మైనారిటీలను బెదరగొట్టి, ఆధిపత్యం వహించగలరేమో కానీ అది ఎప్పటికీ పక్కలో బల్లెంలాగానే ఉంటుంది. న్యాయపరంగా సాధించుకోలేకపోతే తీవ్రవాదం పెరుగు తుంది. మెజారిటైజేషన్, మైనారిటైజేషన్ అనేది అధికాపక్షం-ప్రతిపక్షంలాగా ఉండదు. రాజకీయ సాంప్రదాయంలో అధికారపక్షం, విపక్షాలు ఎప్పుడూ ఆరోగ్యకరమే. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచన రాజకీయ వ్యవస్థకు ప్రమాదకరం. దాన్ని గమనించకుండా కేంద్రంలో ఆర్యస్యస్ ఆధిపత్యం వహించే బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను సైతం వెంటాడుతున్నది. అటు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏకపక్ష పాలనకు ప్రయత్నిం చడంతోపాటు, సామాజికపరంగా కూడా మెజారిటైజేషన్ వికృత రూపంలో అమలుపరచడానికి అయోధ్య నాంది పలికింది. ద్వంద్వ యుద్ధంలో ఆరితేరిన వస్తాదులాగా అటు రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థపైనా, ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ఏకదాటిగా దాడి చేసే ద్విముఖ వ్యూహానికి ఆర్యస్యస్-యన్డీఏ ప్రభుత్వం ద్వారా పదును పెడుతున్నది. ఈ ప్రమాదాన్ని ఎదిరించే సెక్యులర్ శక్తులు అచేతనంగా మారగా, కమ్యూనిస్టుల శక్తి చాలడంలేదు. ఒకనాడు ఎల్కె అద్వాని నాయకత్వాన రథయాత్ర సాగించి అయోధ్యలో యాత్ర ముగింపురోజే బాబ్రీమసీదు కూలగొట్టే ప్రణాళిక రచించబడ్డది. అయితే ఆనాడు కమ్యూనిస్టు పార్టీ అయోధ్యలో పది వేల మంది పార్టీ కార్యకర్తలతో, రెడ్షర్ట్ వలంటీర్లతో వారం ముందే మకాం పెట్టి, మా దేహాలను ముక్కలు చేసిన తర్వాతే బాబ్రీమసీదు జోలికెళ్ళగలరని గర్జించింది. దానికితోడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయంసింగ్ యాదవ్, బీహర్ ముఖ్యమంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ ఉన్నారు. చివరికి అద్వాని రథయాత్రను లాలుప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు.
కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మమతాబెనర్జి, కేజ్రీవాల్ సైతం తెల్లజెండా లేపేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం సుప్తచేతనావస్థలో ఉండిపోయింది. ఇది ప్రజాస్వామిక శక్తులు పుంజుకోవాల్సిన సమయం. లేదంటే దేశ మనుగడకే ప్రమాదం. రాజ్యాంగ రక్షణకు, లౌకిక ప్రజాస్వామ్య విలువల మనుగడకు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన సమయం. ప్రజలూ ఇది గుర్తించాలి.
డాక్టర్ కె.నారాయణ