Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతం దేవుడిపై ఆధారపడుతుంది
ధమ్మం జ్ఞానంపై ఆధారపడుతుంది.
ఒక మహిళ గౌతమ బుద్ధుడి దగ్గరకు వెళ్ళి.. నాకు సంతోషం కావాలి.. అని అడిగింది. అందుకు బుద్ధుడు చిరునవ్వుతో.. ''తప్పకుండా నీకు సంతోషం దొరుకుతుంది! అయితే, నువ్వు పలికిన వాక్యంలో 'నాకు' అనేది తీసేరు. అది స్వార్థం. అలాగే 'కావాలి' అనేది కూడా తీసేరు. అది కోరిక. ఆ రెండూ లేకపోతే మిగిలింది 'సంతోషమే' కదా? అని అన్నాడు. నేటి సమాజంలోని మనుషులు ఆ స్థాయిని అందుకునే విధంగా ఉన్నారా? బుద్ధుడు కల్పిత పురాణ పురుషుడు కాదు. కొన్ని వేల ఏండ్ల క్రితం ఈ నేల మీద నడయాడిన చారిత్రక పురుషుడు. అప్పుడే అంతటి మానసిక పరిపక్వతను అందుకోగలిగాడు కాబట్టే బుద్ధుడయ్యాడు. మరి ఈ కాలపు మత బోధకులెలా ఉన్నారో మనం చూస్తున్నాం. తమ మాట వినే రాజకీయ నాయకుడిని ఉత్తముడని, విననివాడిని అధముడనీ అంటారు. మీమీ స్వంత ఆలోచనలతో ముందుకు పొమ్మని ఏ మత బోధకుడైనా చెపుతాడా? చెప్పనే చెప్పడు. మత బోధకుల విషయం పక్కనపెట్టి సామాన్య పౌరులేమైనా ఎదుగుతున్నారా? తమ వివేకాన్నేమయినా ఉపయోగి స్తున్నారా? సినిమా హీరో పుట్టిన రోజు గురించి అడగండి అభిమానులు టక్కున చెపుతారు. టీవీ సీరియల్స్ గురించి, రియాల్టీ షోల గురించి అడగండి మురిసిపోతూ చెపుతారు. పోనీ, బారుషాపుల గురించి అడగండి. మందుబాబులు మత్తు మత్తుగా చెపుతారు. ఏ పబ్బు ఎక్కడుందోనని అడగండి యువతీ యువకులు చిటికెలేస్తూ చెపుతారు. జీవితాన్ని ఆధునీకరించి, రోగాల్ని తగ్గించి, ప్రపంచ స్వరూపాన్ని మార్చిన శాస్త్రవేత్తల గురించి అడగండి.. ఏ ఒక్కరూ చెప్పరు. అదే పెద్ద విషాదం! వారి మతం గురించి, వారి దేవేళ్ళ గురించి అడగండి.. రెచ్చిపోయి చెప్పేవాళ్ళు కోకొల్లలు. కరోనాతో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉంటే పట్టించుకోని ప్రభుత్వం, గాల్లో తిరుగాడే రాముడనే దైవభావనను నిలబెట్టడానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దీన్నే 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అని అంటారట?
దేవుడు - దైవత్వం పేరుతో ఈ దేశంలో అన్నీ ధ్వంసమవుతున్నాయి. ఉదాహరణకు కొన్ని విషయాలు గమనించండి. గోమాంసం ఎగుమతిలో భారతదేశం టాప్. స్త్రీ హింసలో, అసాంఘిక కార్యక్రమాల్లో ఈ దేశమే టాప్. నది కాలుష్యాల్లో ఈ దేశమే టాప్. మరి స్త్రీని, నదుల్ని, గోవుల్ని దేవతలుగా పూజించే గొప్ప దేశం ఇది. అందుకే దైవత్వాన్ని అంటగట్టి దేనినైనా నాశనం చేయడం సులభం.. అని ఇక్కడి వారికి బాగా తెలుసు. విధ్వంసాలు మన దగ్గరే కాదు, విదేశాల్లో కూడా విపరీతంగా జరిగాయి. రోమన్ క్రైస్తవ మత పెద్దలు, పోప్లు వేసిన శిక్షలు అమానవీయమైనవి. బైబిల్కు వ్యతిరేకంగా సైన్సు ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తల్ని శిక్షించడం, చంపడం, దేశం నుంచి బహిష్కరించడం, పడవలో ఒంటరిగా ఉంచి సముద్రంపై వదిలేయడం, సజీవంగా దహించడం (బ్రూనో) యావజ్జీవ ఖైదీగా (గెలీలియో) ఉంచడం వంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి శిక్షలకు భయపడి ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు మానేశారు. కొందరు రహస్యంగా చేసినా, ఫలితాలు వెల్లడించడానికి భయపడేవారు. అందుకే క్రీ.పూ.1వ శతాబ్దం నుంచి క్రీ.శ. 1450 మధ్య గల కాలాన్ని వైజ్ఞానిక శాస్త్రరీత్యా చీకటి యుగంగా పేర్కొంటారు.
ఆత్మల గురించి గొప్పగా మాట్లాడే అన్ని మతాల మత పెద్దలు ఒక విషయం బాగా ఆలోచించాలి. ఆత్మ కంటె దేహమే అందమైందని ఎందుకు అనుకోరూ? ఆత్మను చూసినవాడు ఎవడూ లేడు కదా? ఆకలి వేస్తే అది కచ్ఛితంగా దేహానికే కానీ, ఆత్మకు కాదు గదా? ఆకలి వేస్తే ఆహారం శరీరానికే కావాలి.. ఆత్మకు అక్కరలేదు. యువతీ యువకుల ప్రేమ కలాపాలు కొనసాగాలంటే రెండు దేహాలు కావాలి. ఆత్మలతో ఏ పనీ జరగదు. అంటే పనులన్నీ దేహంతో చేస్తూ.. ''దేహం అసత్యం - ఆత్మ సత్యం'' అని ప్రచారం చేస్తారా? దగా చేస్తారా? అది మూఢత్వం, మూర్ఖత్వం కాదా? ''పాపుల కావుమయా'' అని ఒకడు ''పాం చేశా ప్రభువా!'' అని మరొకడు వారి వారి ప్రార్థనా స్థలాల్లో నటిస్తారే.. దాని వల్ల ఏమొస్తుందీ? ఏమీరాదు.. అంత పాపం చేసి ఉంటే, తప్పిదాలు చేసి ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. అక్కడ తప్పులు ఒప్పుకుని లొంగిపోవాలి, శిక్షలకు సిద్ధపడాలి. అంతటి నిజాయితీ ఉందా ఏ భక్తులకైనా? నిజాయితీ లేకపోగా, ఈ భక్తులు సైన్సుకు అందనిదేదో ఉందని చెపుతుంటారు. అలాంటిది ఏదైనా ఉంటే సైన్సును దాటి అవతలికి వెళ్ళాలి కదా? వెళ్ళరు.. సైన్సు దగ్గరే ఆగిపోయి, సైన్సును వాడుకుంటూ, సుఖపడుతూ ఉంటారు. అట్లని సైన్సు సాధిస్తూ వచ్చిన విజయాల్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మూర్ఖంగా ఈ సైన్సంతా మా మత గ్రంథాల్లో ఎప్పుడో రాయబడి ఉంది అని పిచ్చిమాటలు చెపుతుంటారు. అంటే వీరికి సైన్సు తెలియదు. సైన్సుకు ఆవల ఏముందో తెలియదు. వారి మూర్ఖత్వంలో వారే కొట్టుకు పోయి దేనిమీదా ఒక స్పష్టమైన అవగాహన లేక అనుమానాలతో కొట్టుమిట్టాడుతుంటారు. అందుకే సామాన్య పౌరులంతా మత బోధకుల ప్రభావంలో పడకుండా తమ ఇంగిత జ్ఞానాన్ని తాము ఉపయోగిస్తూ ఉండాలి!
థామస్ స్టీఫెన్ సాజ్ ప్రముఖ హంగేరియన్ - అమెరికన్ సైకియాట్రిస్ట్, సైకో ఎనలిస్ట్ 'ద మిత్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్' అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత. ఆయన దేవుడి గురించి, ప్రార్థన గురించి ఆలోచించవలసిన ఒక విషయం చెప్పాడు.. ''నువ్వు దేవుడితో మాట్లాడితే దాన్ని ప్రార్థన అని అంటారు కదా? మరి దేవుడు నీతో మాట్లాడితే పిచ్చి అని ఎందుకు అంటున్నారు? సంభాషించడం వీలుకాని దశలో ఎవరు ఎవరితో మాట్లాడినా అది పిచ్చే కదా? మళ్ళీ ఆ పిచ్చికి ప్రార్థన అనే పేరెందుకూ? అలాగే ఏ ఆహార పదార్థమైనా మనిషి ఆకలి తీర్చేదే అయినప్పుడు దాన్ని ప్రసాదం అని అనడం ఎందుకూ? అన్నంత మాత్రాన దానికి మహాత్యాలు రావు, అద్భుతాలేవీ జరగవు కదా? అది అలా ఉండనిచ్చి సంస్కృతం దేవ భాష ఎలా అయ్యింది? అన్ని భాషల లాగే అప్పటి ప్రజల మధ్య వ్యక్తీకరణలకు అది ఉపయోగపడింది. అంతే కదా? మనకు తెలిసిన ఆధారాలను బట్టి సంస్కృతం క్రీ.పూ. 1500 ప్రాంతంలో పుట్టింది. విస్తృత ప్రచారంలోకి వచ్చింది. దీన్ని బట్టి మరొక విషయం బయటపడుతుంది. ఈ దేవుళ్ళంతా పుట్టింది అప్పుడేనన్న మాట! క్రీ.పూ.1500కు ముందు దేవుళ్ళు లేరన్న మాట! వారి దేవభాష లేదన్నమాట!! ఇవన్నీ చూసే కాబోలు మన నావికాదళ మాజీ ఛీఫ్ అరుణ్ప్రకాశ్ ఇలా అన్నారు.. ''ఓ పక్క చైనా, జపాన్ టెక్నాలజీ, కృత్రిమ మేథ యంత్రాల రంగాలలో పోటీపడి ఎదుగుతూ ఉంటే, మనం మాత్రం గుళ్ళూ, గోపురాలు, మక్కాలు, మసీద్లు, చర్చ్, గురుద్వారాలంటూ కాలాన్ని వృధా చేస్తున్నాం'' అని! దేవుళ్ళకు ఎండా, వాన, వరదలు, పిడుగులు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తూ మనుషులు పకడ్బందీగా నిర్మాణాలు చేస్తున్నారంటేనే ఆ దేవుళ్ళకు గాని, ఆ దైవ భావనలకు గానీ ఏ శక్తీ లేదని తెలిసిపోతూ ఉంది కదా? 2012లో నిర్మించబడ్డ 'ఎలిఫెంట్ వైట్' అనే సినిమాలో ఒక పాత్ర ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. దాని గురించి మనమంతా ఆలోచించాల్సి ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే.. ప్రతి సంవత్సరం రెండు మిలియన్ల బాలికలు వ్యభిచారంలోకి నెట్టేయబడుతున్నారు. ఒకవేళ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు, అంతా బాగుచేస్తాడు అనేదే నిజమైతే దీనికి ఆయన సమాధానం చెప్పాలి. లేదా ఆయనకు భజనలు చేసే విశ్వాసకులైనా చెప్పాలి. ఈ మతమనేది ఒక పంజరం లాంటిదని, స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని అది హరిస్తుందని ఒక ఇమామే ప్రకటించాడు. ''స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకపోవడం వల్లనే ముస్లిం దేశాలు శాస్త్రజ్ఞుల్ని, మహామేధావుల్ని తయారు చేసుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్ని మాత్రమే చదువుకుని, పాటించి ఎవరూ మేధావులు కాలేరు. ఓ పక్షిని బంధించి, హింసించి అది అనంతాకాశంలో స్వేచ్ఛగా ఎగరాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది'' - ఇమామ్ మహ్మద్ తావ్హిది. స్వేచ్ఛలేనిది అభివృద్ధి వీలుకాదన్నది ఇంగిత జ్ఞానమున్న ఇమామ్లే గ్రహిస్తున్నారు.
'భయంకరమైనవీడియో గేమ్స్ ఆడకండి. భయం పుట్టించే సినిమాలు చూడకండి. కేవలం బైబిల్ మాత్రమే చదవండి' అని పాస్టర్లు చెపుతుంటారు కదా.. సరే, మరి అందులో దేవుడు 2.2 మిలియన్ల మందిని చంపుతాడు.. అలా ఎందుకూ అని అడక్కండి. చర్చ్ ముందు పడుకోబెట్టి ప్రార్థనలు చేస్తే.. చనిపోయిన అమ్మాయి బతికింది అని చెపుతాడు పాస్టర్. అదెలా? అని అనవసరంగా అడక్కండి.. ఇలా అడగ్గూడని ప్రశ్నలు అన్ని మత గ్రంథాల్లో ఉన్నాయి. వరాహం భూమిని లేపింది అని చెపుతారు కదా? ఎక్కడ నుంచి లేపిందీ? అని అడక్కండి. అలాగే విష్ణుమూర్తి భార్య భూదేవి అని చెప్పారు. భూదేవి కూతురు సీత అని చెప్పారు. బావుంది. రామావతారంలో విష్ణుమూర్తి సీతను పెండ్లి చేసుకుంటే.. భార్య కూతురు రాముడికి ఏమౌతుంది?అని ఆవేశపడిపోయి అడక్కండి. అంతలోతుగా తరచి చూస్తే కష్టం! విశాలమైన ఆధునిక ఆలోచనా ధోరణి ముందు అన్ని మతాల మత గ్రంథాల్లో అపరిపక్వత కనిపిస్తుంది. వాటిని గుర్తించకుండా, ప్రశ్నించకుండా గుడ్డిగా విశ్వసించడమే మత విశ్వాసకుల కర్తవ్యం కదా? ఒక వస్తువుకు ఒక పేరుంటుంది. అలాగే మనిషికి ఒక పేరుంటుంది. చిన్నప్పుడు ఎన్ని ముద్దుపేర్లతో పిలిచినా, పెద్దయి పెరిగాక అధికారికంగా ఒకే పేరుంటుంది. దేవుడు మనిషికాదు కాబట్టి అనంతకోటి పేర్లతో పిలుచుకోవచ్చునని అనుకుంటారు. నిజమే ఉన్నవాడైతే ఒక్కపేరు చాలు. లేనివాడు కాబట్టి అన్నిపేర్లు కావల్సి వచ్చాయి. అబద్ధానికుండే ఆర్భాటం అలాంటిది!
సమాజంలో మార్పు వస్తుంది. అది మారకుండా ఏమీ ఉండదు. కానీ, సత్యాన్వేషణని, వైజ్ఞానిక స్పృహని, హేతువాదాన్ని, హితవాదాన్ని అన్నీ కలిపి మానవ వాదాన్ని జనం తమ మెదళ్లలో ప్రతిష్టించుకోగలిగితే.. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన సమాజం దానంతట అదే రూపుదిద్దు కుంటుంది. అయితే ఈ మార్పు కొందరిలో త్వరగా రావొచ్చు. మరి కొందరిలో రావడానికి కొంత సమయం పట్టొచ్చు. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు, నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు అది ఎవరి నుండైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోగలిగే ఓర్పు, నేర్పూ ఉండాలి. అజిత కేశ కంబళితో చర్చించిన తర్వాతగానీ బుద్ధుడికైనా చావు, పుటుకల మీద స్పష్టమైన అవగాహన ఏర్పడలేదు. అయితే ఎవరీ అజిత కేశ కంబళి.. అని కొందరికి అనుమానం రావొచ్చు. ఆయన ఒక ఉగ్రభౌతికవాది. భూమీ-నీరు-అగ్ని-వాయువు అనే నాలుగింటితోనే జీవం పుట్టిందని తన పరిశీల ద్వారా తెలుసుకున్నవాడు. రుజువులు చూపినవాడు. అందుకే తొలి భారతీయ పదార్థ భౌతికవాది కాగలిగాడు. అయితే ఇప్పుడు మన లక్ష్యసాధనకు ఏమి చేయ్యాలీ అంటే మొదట మన సంభాషణల్లో దేవుడి ప్రస్థావన తగ్గించుకోవాలి. మానవ సాధికారతకు ప్రాధాన్యమివ్వాలి. ''దేవుడి దయ - పైవాడి కటాక్షం - రామరాజ్యం - రామబాణం - లక్ష్మణరేఖ - ప్రెయిజ్ ద లార్డ్ - ఇన్ష అల్లా'' వంటి ఊత పదాల్ని వాడకుండా ఉండగలగాలి. అలాంటి మాటలన్నీ కల్పించుకున్న భావనల్లోంచి రూపుదిద్దుకున్నవేననే నిజాన్ని గ్రహించాలి.
'జ్ఞానం అంతమైన చోటే మతం ప్రారంభమౌతుంది' అని అన్నాడు బెంజమిన్ డిజ్రాయిలీ. 1868-1880 మధ్య కాలంలో రెండు సార్లు బ్రిటిష్ ప్రధానిగా పనిచేసిన ప్రముఖుడు. నూటాయాభై సంవత్సరాలు గడిచిపోయినా, రావల్సినంత మార్పు రాలేదు. మార్పు రాలేదని ఊరుకుంటామా? ఊరుకోం.. ముందు మనం మారుతాం. తద్వారా సమాజాన్ని మారుస్తాం. ఈ దిగజారిన సమాజంలో మనం మన ఆశాభావాన్ని ఇలా తెలియజేయవచ్చు - పెట్రోలు ధరలా దేశ ప్రజల సుఖ సంతోషాలు పెరగాలి! దుఃఖాలన్నీ ఈ దేశపు రూపాయి విలువలా పడిపోవాలి! దేశమంతా వ్యాపించిన అవినీతిలా దేశ ప్రజల హృదయాల్లో మానవీయ విలువలు వెల్లవిరియాలి!! చెడుని చెడుగా వదిలేయడం కాదు. దాన్నిమంచిగా మార్చుకుని ముందుకు కదలాలి!!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజి ప్రొఫెసర్
డాక్టర్ దేవరాజు మహారాజు