Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా అంతా ఉత్తిదే అన్నారు. అంతా బాగానే ఉందన్నారు. మీకు మేమున్నామన్నారు. మోడీ, కేసీఆర్లు కరోనా అంతు చూస్తున్నట్టే మాట్లాడారు. నిజమే అనుకున్నాం. ఈరోజు కరోనా మనకు చేయి చాస్తే అందేంత దూరంలో ఉంది. మన సన్నిహితులూ ఒక్కొక్కరు చనిపోతున్నారు. ఇంకా దగ్గరి వాల్లెందరో ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. కరోనా లేనప్పుడు మీడియాకు భారీ ఉపన్యాసాలిచ్చిన నాయకులు కరోనా విలయం పెరుగుతూ ఉంటే కనబడటం మానేశారు. వాళ్ల దగ్గర ఉపన్యాసాలు తప్ప మరొకటి లేదు. ఓం హ్రీం గప్ చుప్ (లాక్డౌన్) అంటే కరోనా దానికదే పోతే తేరగా ఆ క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నారు. చివరికి, పాలకులనబడే వాళ్లు లాక్డౌన్తో పాటు చేతులు కూడా ఎత్తేయడంతో ఈరోజు కరోనా కేసులు, చావుల్లో ప్రపంచ దేశాలనన్నింటినీ వెనక్కి నెడుతున్నాం. ఇటీవలి కాలంలో కొంత వైద్యం అందుబాటులోకి వచ్చి, కార్పొరేటు ఆస్పత్రులు కేసులు తీసుకోవటం ప్రారంభించాక ఇక మాకేం ఫరవాలేదని శిష్ట వర్గం నిర్ధారించుకుంది. ఇప్పుడు కరోనా పాలకవర్గాల సమస్య కాదు, కేవలం సామాన్యుల సమస్య. సంపన్న, పాలక వర్గాలకు ప్రమాదమనుకున్నప్పుడు ఆ సమస్యను ప్రపంచ సమస్య చేస్తారు. వాళ్లకు ప్రమాదం లేకపోతే ప్రపంచ సమస్యను కూడా పట్టించుకోరు. ఇంకా, దానిపై చేయగల వ్యాపారానికి మాత్రమే ప్రణాళికలు వేసుకుంటారు. శిష్టవర్గం కాని మనుషులందరినీ వారి ప్రాప్తానికీ, కరోనా దయకూ ప్రభుత్వాలు వదిలేశాయి. కేసులు, శవాల లెక్కలను మాత్రమే చెపుతున్నారు, అవీ అనేక రెట్లు తగ్గించి. ఇంత తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమయిందనే విమర్శ రాకుండా, రాజకీయ నష్టం జరగకుండా మాత్రం చూసుకుంటున్నారు. ప్రజల ధన, ప్రాణ రక్షణ తమ ప్రాథమిక కర్తవ్యం అనుకునే రాజకీయ విలువల్లేని దౌర్భాగ్యపు వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. ప్రజలకు తమను కాపాడటానికి ప్రభుత్వం, వైద్యులు, ఆస్పత్రులు ఉన్నాయనే నమ్మకం పోయింది. వారిప్పుడు ప్రాణ భయంతో ఆస్పత్రులకు పరుగు పెడుతున్నారు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని వెల్లగొడితే రోడ్లమీద పడి చనిపోతున్నారు. ఈ మాత్రం కరోనా తీవ్రతకే ఇంత విధ్వంసం జరిగితే రేపు ఈ ఉధృతి మరింత పెరిగితే లేదా మరో కొత్త వైరస్ మరింత తీవ్రతో వస్తే పరిస్థితి ఏమిటి. ప్రభుత్వం మాత్రం అంతా సజావుగా ఉందంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అద్భుతంగా ఉన్నాయంటుంది. రాష్ట్రంలో మరణాల రేటు తక్కువంటుంది. ప్రయివేటుకు ఎందుకు వెళ్తున్నారంటుంది. మొన్నటిదాకా టెస్టులెందుకన్నారు. ఇప్పుడు వేలకొద్దీ బెడ్లు వేశామంటున్నారు. లాడ్జింగ్లలో వేసినట్టు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, స్టేడియాల్లో బెడ్లు వేశారు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ఒక్క హైదరాబాద్ గాంధీలో ఓ మోస్తరు సర్వీసు అందుతోంది. రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవల పరిస్థితి చాలా అసంతృప్తిగా ఉంది. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే దారుణంగా, బీతావహకంగా ఉంది. బోదనాస్థాయి ఆస్పత్రుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఈ రోజు వరకు సాధారణ ఫేవిపిరావిర్ గోలీలు లేవు. రెండెసివిర్ ఇంజెక్షన్లు లేవు. ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయంటారు. వచ్చిన నిల్వలు ఎన్ని రోజులుంటాయో తెలియదు. మందులు మాత్రమే కాదు సరిపడినన్ని వెంటిలేటర్లు లేవు. ఉన్న వాటిని ఉపయోగించే వైద్య బృందం లేదు. ఆక్సిజన్ అందించే వ్యవస్థ సరిపడినంత లేదు. వైద్యులు, నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. ఉన్నవారిలో ప్రతి రోజూ రోగులను సందర్శించి, వారి పరిస్థితిని సమీక్షించాల్సిన సీనియర్ వైద్యులు ఆ పనికి న్యాయం చేయటం లేదు. కేవలం ట్రైనీ వైద్యుల మీద ఆధారపడి కొంత సర్వీసు అందుతోంది. ఆ జూనియర్ వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కూడా తమ వల్లకావటం లేదని గగ్గొలు పెడుతున్నారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన, భయం గొలిపే విషయమేమిటంటే కోవిడ్ చికిత్సకు సంబంధం లేని ఇతర స్పెషలిస్ట్ వైద్యులను కూడా, కనీస శిక్షణ అయినా ఇవ్వకుండా, కోవిడ్ చికిత్సకు కేటాయిస్తున్నారు. ఇలాంటి అనేక దారుణాలను చూడలేక జిల్లా, బోధనాస్థాయి ఆస్పత్రుల బాధ్యులు రాజీనామాలు చేస్తున్నారు. పట్టించుకునే పాలకుడులేడు. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే ప్రయివేటుకు లాభం చేసిన వాన్నవుతానని చెప్పటం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, వసతులు కాలానుగుణంగా అభివృద్ధి చెందక, ప్రజల ఆరోగ్య అవసరాలన్నీ తీర్చగల స్థాయిలో వాటి సంఖ్యా పెరగక 30ఏండ్లు దాటింది. అన్ని రకాల పాలక పార్టీలు, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనే తేడా లేకుండా చేసిన గాయాలతో ప్రజారోగ్య వ్యవస్థ క్షత గాత్రమై ఎప్పటినుండో రక్తం ఓడుతోంది.
ఇక, కార్పొరేట్ ఆస్పత్రుల కరోనా బిల్లులు ఎగువ మధ్య తరగతికి కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. ''వైద్యాన్ని మార్కెట్కి వదిలిపెట్టాలని, ప్రజారోగ్య అవసరాలను మీరు తీర్చకూడదని, ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం సేవలకు ఫీజులు వసూలు చేస్తూ క్రమంగా పూర్తిగా ప్రయివేటీకరించాలని'' మన స్వతంత్ర పాలకులకు నిర్దేశించింది అమెరికా కనుసన్నల్లోని ప్రపంచబ్యాంకు. దానిని తూచ తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను క్రమంగా పనికి రాకుండా చేస్తూ కార్పొరేట్ల వ్యాపారానికి మార్గం సుగమం చేశాయి అన్ని రకాల దేశీయ పార్టీలు. ఇప్పుడు దినసరి కూలీ కూడా ప్రాణం మీద తీపితో ఆధునిక వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్కి వెళ్లక తప్పని పరిస్థితి వచ్చి ఉంది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి కార్పొరేట్ హాస్పిటల్లు. సొమ్ము పోయటానికి సిద్దంగా ఉన్నవాల్లకూ అందులో బెడ్లు ఖాళీ లేవంటున్నారు. ఇలా ఒకవైపు మోయలేని భారంతో రోగులకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్న ప్రభుత్వ వైద్యరంగం, మరో వైపు ఇదే అదనుగా ఏ రోగికైనా రోజుకు లక్షకు తక్కువ గాకుండా బిల్లు వేయాలని నిర్ణయించుకున్న ప్రయివేటు వైద్యరంగంతో రాష్ట్రంలోని తొంభై తొమ్మిది శాతం ప్రజలకు దిక్కు తోచటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్య బాధ్యతను ఎప్పుడో గాలికి వదిలేసి కేవలం తూతూ మంత్రంగా ఏదో ఒకటి చేస్తునట్టు బ్రమ కల్పిస్తూ ఉన్నది. కేంద్రంలోని ఘనాపాటీలు ఇంకా సిద్ధ హస్తులు. వారు గంటలు కొట్టి కరోనాను ఎప్పుడో దేశం నుంచి పారదోలామనే అనుకుంటున్నారు. ప్రభుత్వాలు సమస్యను గాలికొదిలేయటంతో మన దేశంలో అధికారిక లెక్కల ప్రకారమే కరోనా కేసుల సంఖ్య 20లక్షలు దాటింది. 50వేల మందికి పైగా చనిపోయారు. రోజుకు యాభై వేలకు పైగా కేసులు, వేయి మంది చనిపోతున్న స్థితికి చేరాం. అనధికారిక లెక్కలు ఇంతకు కనీసం కొన్ని పదుల రెట్లు ఎక్కువుంటాయి.
కరోనా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం అనేది నిజమే. కానీ అన్ని దేశాలూ ఒకే స్థాయిలో నష్టపోవడం లేదనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ప్రజలను గౌరవిస్తూ వారి జీవించే హక్కుకే అత్యధిక ప్రాధన్యత ఇచ్చే దేశాలు ప్రాణనష్టాన్ని చాలా తగ్గించుకున్నాయి. కంపెనీల లాభాల కోసం సమూహాల్ని నియంత్రించని అమెరికా తప్ప ప్రజల రక్షణకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఏ దేశమూ ఆ స్థాయిలో నష్టపోలేదు. ఉదాహరణకు క్యూబాలో ప్రజారోగ్య బాధ్యత అంతా ప్రభుత్వానిదే. తన దేశంలో కరోనా నియంత్రణనే కాక ఈ సంక్షోభ కాలంలో ప్రపంచానికే సాయం చేసిన విషయం గుర్తుంచుకోవాలి. సింగపూర్లో ఈ రోజు వరకు నమోదైన 54వేల కేసుల్లో కేవలం 27మందే చనిపోయారు. ఆస్ట్రేలియా కేసుల సంఖ్య ఈ రోజు వరకు 20వేలు కూడా దాటలేదు. మరణాలు కేవలం 250. జపాన్లో కేవలం 40వేల కేసులు, వెయ్యి మరణాలు మాత్రమే. మలేసియా, శ్రీలంకలు మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. న్యూజిలాండ్ కరోనా రహిత దేశంగా నిలిచింది. కరోనా నియంత్రణలో ఎన్నో దేశాలు సాధించిన మంచి ఫలితాలు, అవి చూపిన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోనూ కరోనా నియంత్రణను ఒక ఛాలెంజ్గా తీసుకుని అసాద్యమనుకున్న లక్ష్యాల్ని సాధించి చూపించిన కేరళ రాష్ట్రం, మహారాష్ట్ర ధారవి కేంద్రాలున్నాయి. అయినప్పటికి కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీఅర్ఎస్ పాలకులు మన ప్రజలకు హెర్డ్ ఇమ్యూనిటీ, వాక్సిన్ రాక అంటూ కల్ల బొల్లి కబుర్లు మాత్రమే చెపుతున్నారు. ఈలోపు మంచి వైద్యమైనా అందిస్తున్నారా అంటే దాని సొగసు పైన చూశాం.
బ్రిటన్ ప్రభుత్వం తన బడ్జెట్లో 19శాతాన్ని, అమెరికా ప్రభుత్వం కనీసం 20శాతాన్ని ఆరోగ్యరంగానికి కేటాయి స్తున్నాయి. అలాగే అన్ని ధనిక, చాలా పేద దేశాలు కూడా తమ బడ్జెట్లలో పది శాతానికి మించి ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో మాత్రం గత 30ఏండ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2శాతం మించలేదు. దేశభక్త బీజేపీ పాలనలో కూడా అదే మరి. తెలంగాణలో ఆంధ్ర పాలకులు ఆరోగ్యరంగానికి 4శాతం కేటాయించే వారు. స్వతంత్ర తెలంగాణ పాలకులు ఆంధ్ర పాలకులను ఆదర్శగా తీసుకొని ఆ 4శాతాన్ని పెంచకుండా జాగ్రత్త పడ్డారు. కడపటి బడ్జెట్లో కేసీఆర్ దాన్ని 3.5శాతం చేశారు. బడ్జెట్లు పెరగకుండా ప్రజారోగ్య వ్యవస్థ ఎలా మెరుగవుతుందని ఎవరూ అడగరని వారి గట్టి నమ్మకం.
నిజానికి కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రెండే రెండు మార్గాలుంటాయి. ఒకటి నివారణ, రెండవది చికిత్స. అవి సాధించాలంటే ప్రభుత్వాలకి ప్రజల్ని రక్షించాలనే బలమైన సంకల్పం ఉండాలి. లక్ష్యాల్ని సాధించగల మౌలిక సదుపాయాలను పెంచుకోవాలి. తగినంత సిబ్బంది ఉండాలి. వారిలో తగిన నైపుణ్యం ఉండాలి. సంక్షోభ కాలంలో అన్ని వనరుల్ని ఒక దగ్గరికి తేవాలి. వారికి యుద్ధప్రాతిపదికన అవసరమైన శిక్షణ ఇవ్వాలి. విధానాల అమలు, కార్య నిర్వహణ పర్యవేక్షణ చివరిదాకా యుద్ధ సమీక్ష లాగా ఉండాలి. అన్నింటికీ మించి బడ్జెట్కి కొరత ఉండకూడదు. ఇవి మౌలిక సూత్రాలు. ఇవేవీ చేయకుండా ఇప్పటికి ఆరు నెలల విలువైన కాలాన్ని వృథాచేశారు. ఇప్పటికైనా, తక్షణ బాధ్యతలుగా, ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను, మందులను అడ్వాన్సుగా సమకూర్చి ఉంచాలి. చికిత్స చేయటానికి వైద్యులు, సిబ్బంది లేని 'పడకల ఏర్పాటు' నిరర్థకమైనది. వైద్యుల్ని, నర్సులను ఇతర మెడికల్ సిబ్బందిని పెద్ద ఎత్తున శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలి. ప్రభుత్వ వైద్య రంగంలో వారి కొరత ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వారి శాశ్వత నియామకం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా తప్పనిసరే. ప్రభుత్వ రంగ వైద్య సేవలు అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చగలిగిన నాడు, ముఖ్య మంత్రి, ప్రధాన మంత్రి సహా మంత్రులంతా ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రమే చేరటం తప్పనిసరి అయిన నాడు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బిల్లులు ప్రభుత్వం లేదా ప్రజలు మోయాల్సిన అవసరమే ఉండదు. అప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు తేడా లేకుండా ప్రజల కరోనా చికిత్సకయ్యే వ్యయం మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ వ్యాసం చదివి పాలకులు ఇవన్నీ చేయరు. ప్రజలు అనేక మార్గాల ద్వారా ఒత్తిడి పెడుతూ ప్రభుత్వ విధానాల్ని శాసించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉండాల్సిందే ప్రజా సంక్షేమం కోసం. రాచరికం చేయటానికి కాదు.
డాక్టర్ ఎస్. తిరుపతయ్య
సెల్: 9849228212