Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భారత దేశం నుంచి బ్రిటిషు వాళ్లు వెళ్లిపోవాలి'' అని1942 ఆగస్టు 9న ప్రారంభమైన స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా 260 సంఘాల ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 9న ''కార్పొరేట్లను తరముదాం- రైతాంగాన్ని రక్షించుదాం'' అనే నినాదంతో భారత రైతాంగం ఉద్యమిస్తున్నది. ప్రధానంగా 9డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు నిర్థిష్టమైన ప్రతిపాదనలు ఉంచుతున్నది. గత అనేక సంవత్సరాలుగా ఈ సమస్యలను రైతు సంఘాలు లేవనెత్తుతూ, ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. అయినా దేశంలోని ధాన్యాగారాలు పూర్తిగా నిండి వుండేటట్టుగా రైతులు కృషి చేశారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా చేశారు.
కరోనా వైరస్ అంటువ్యాధి ప్రారంభమై, ప్రబలుతున్నప్పటికి కూడా రైతులు, తమ కృషిని కొనసాగించారు. ఈ భూమిపై ఆధారపడి గట్టిగా కృషి చేస్తున్న రైతాంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని రైతులు ఆశించారు. కానీ రైతుల సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం వాటిని తీవ్రం చేసే వ్యవసాయ సంస్కరణల ప్యాకేజీని ప్రకటించినప్పుడు దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర నిరాశకు గురైంది. వ్యవసాయదారులకు వ్యతిరేకం గా తెచ్చిన ఆర్డినెన్సుల పట్ల ఆగ్రహావేశాలను ప్రకటిస్తున్నది.
3.6.2020న ప్రకటించిన మూడు ఆర్డినెన్సులు - (అ) అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, కామర్స్ అండ్ ట్రేడ్ (ప్రమోషను అండ్ ఫెసిలిటేషను) ఆర్డినెన్సు - 2020, (ఆ) ది ఫార్మర్స్ (ఎంఫవర్మెంట్ అండ్ ప్రొడక్షన్) అగ్రిమంటు ఆన్ ప్రైస్ అస్యూరెన్సు అండ్ ఫామ్ సర్వీసెస్ ఆర్డినెన్సు-2020, (ఇ) ఎసన్షియల్ కమోడిటీస్ యాక్టు (అమెన్డ్మెంటు)- 2020 - ఈ మూడు ఆర్డినెన్సులను కనీసం పార్లమెంట్లో చర్చించ కుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా తీసుకు వచ్చారు. ఈ ఆర్డినెన్సులు అప్రజాస్వామి కమైనవి. కోవిడ్-19, లాక్డౌన్లను అడ్డుపెటు ్టకొని, వీటిని తీసుకురావటం జరిగింది. వీటి ఫలితంగా వ్యవసాయదారులకు పంటల ధరలు తగ్గుతాయి. విత్తనాల భద్రత మరింతగా దెబ్బతింటుంది. వినియోగదారులకు ఆహార ధరలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ జోక్యం రద్దు కావటం వల్ల, ఆహార భద్రత క్షీణిస్తుంది. భారత ఆహారం, వ్యవసాయ వ్యవస్థలపై కార్పొరేట్ల ఆధిక్యాన్ని పెంపొందిస్తుంది. దొంగ నిల్వలు, బ్లాక్ మార్కెటింగులకు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయదారులు ''ఒకే దేశం - ఒకే మార్కెటు''ను కోరుకోవడం లేదు. వారు ''ఒకే దేశం - ఒకే కనీస మద్దతు ధరలు'' ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం దీనిని గుర్తించకుండా వ్యవహరించడం ఎవరికోసం..?
కేరళ తరహా రుణవిమోచన చట్టం చేయాలని రైతు సంఘాలు అనేక సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికైనా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ రూపొందించిన వ్యవసాయదారులందరికీ రుణ విముక్తికి స్వేచ్ఛను కల్పించే బిల్లు ముసాయిదాను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలి. కానీ 2019-20 రబీ పంటలకు రైతులకు యిచ్చిన రుణాలను ప్రభుత్వం రద్దు చేసి, 2020 ఖరీప్కు వడ్డీ లేని రుణాలు యివ్వాలనీ.., స్వయం సహాయక బృందాలకు అప్పుల వసూళ్లను ఆపుచేసి, మైక్రో ఫైనాన్స్తో సహా, వారి అప్పులపై వడ్డీని మాఫీ చేయాలనీ రైతాంగం పోరాడుతున్నా ఈ ప్రభుత్వాలకు పట్టడంలేదు.
ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల బాధ్యత ఉంటే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయుట నేరపూరితమైన అపరాధంగా ప్రకటించాలి. 2014 ఎన్నికలకు ముందు స్వయాన ప్రధానమంత్రి నరేంద్రమోడీ 300 సభలల్లో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అమలు చేయడంలేదు. కనీసం ఇప్పటికైనా అఖిల భారత రైతు పోరాట కమిటీ రూపొందించిన వ్యవసాయదారులందరికీ గ్యారంటీగా లభించే గిట్టుబాటు కనీస మద్దతు ధరల ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదించాలి. కూరగాయలు, పండ్లు, పాలతో సహా వ్యవసాయోత్పత్తులన్నింటికీ కనీస సమగ్ర ఉత్పత్తి ఖర్చులపై 50శాతం అదనంగా ఉండేటట్టుగా సి2+50శాతం మద్దతు ధర ఉండేటట్లుగా చట్టం చేయాలి.
ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, చిన్న దుకాణదారులు, సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారుల విద్యుత్ బిల్లులు కోవిడ్-19 అంటురోగం తగ్గనంత కాలం రద్దు చేయాలి. ఈ ఏడాది పంటలు నష్టపోయిన వ్యవసాయదారులకు నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే డీజిలు ధరలు తగ్గించాలి - 2014 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 60 శాతం తగ్గాయి. అయినా, కేంద్ర ప్రభుత్వం 22 సార్లు డీజిలు ధరలు పెంచింది. డీజిల్ ధర పెరగడం వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతాయి.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలు పెంచాలి
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి పని దినాలు కనీసం 200కు పెంచడం వలన ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దీనికి రూ.61,500 కోట్లు కేటాయించింది. ఇందులో గత సంవత్సరం బడ్జెట్ రూ.11,500 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజిలో రూ.40,000 కోట్లు కేటాయించారు. దాదాపు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది ఉపాధిహామీ పనిలో పని చేస్తున్నారు. వీరు కాకుండా దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళారు. కాబట్టి ఉపాధిహామీ పథకానికి మరో రూ.1,30,000 కోట్లు కేటాయించాలి. దేశంలోని రైతాంగం కష్టపడి పండించిన ఆహారధాన్యాలను, భారతీయులెవరూ ఆకలితో ఉండకుండా వినియోగించాలి. కరోనా వైరస్ సంక్షోభం మొత్తం కాలంలో ప్రతి నెలా కేరళ తరహాలో మనిషికి 15కి.గ్రా. ఆహార ధాన్యాలు, కుటుంబానికి ప్రతి నెలా 1 కి.గ్రా. మంచి నూనె, 1 కి.గ్రా. పప్పులు, 1 కి.గ్రా. చక్కెర అందచేయాలి. అదనంగా, ఇతర ప్రాథమి కావసరాల కొరకు కుటుంబాలన్నింటికీ, నగదు బదిలీ చేయాలి.
గిరిజనులు, ఇతర వ్యవసాయదారుల భూమి, ఇతర అటవీ వనరులకు రక్షణ కల్పించాలి. వ్యవసాయ భూమి కంపెనీలకు సేకరించకుండా, నిషేధించాలి. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూముల నుంచి వ్యవసాయదారులను ప్రభుత్వం గెంటి వేయరాదు. అటవీ భూముల్లో 'కాంపా' చట్టం పేరిట బలవంతాన మొక్కలు నాటటాన్ని ఆపు చేయాలి.
రైతుల భూరికార్డుల వివాదాలన్నింటిని వెంటనే పరిష్కరించి, రైతులు, కౌలు రైతులందరికీ రైతుబంధు పథకం వర్తింపచేయాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్నా సర్కారులో చలనం లేదు. బీమా పథకం కూడా రైతులు, కౌెలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ వర్తింపచేయాలి. కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చి, పంట రుణాలు ఇవ్వాలి. ఆత్మ హత్యలు జరిగిన రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీ, చేతివృత్తుల కుటుంబాలన్నింటికీ పరిహారం, ప్యాకేజీ ఇవ్వాలి. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే వెంటనే ప్రారంభించాలి. పంటల బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వెంటనే చెల్లించాలి. కల్తీ, నాసిరకం విత్తనాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.
కానీ రైతుల ఈ న్యాయమైన డిమాండ్లనుపట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇప్పటికే అనేక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నవి. రైతులతోపాటు వ్యవసాయ రంగాన్ని రక్షించాలనే కాంక్ష ఉన్న అందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి.
సెల్:9490098055
టి. సాగర్