Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నారు లెనిన్ మహాశయుడు. నిజమే, సామాజిక వాస్తవికతతో సంబంధం లేని కళలు, సాహిత్యం సామాజిక పురోగమనానికి తోడ్పడకపోగా, సమాజ తిరోగమనానికి దారితీస్తాయి. వాస్తవికతను విస్మరించడమంటే అది కేవలం గారడీయే అవుతుంది. ఏ కళైనా సరే, ప్రజలను చైతన్యవంతం చేసేలా, ఆలోచనపరులుగా తీర్చిదిద్దేలా ఉండాలే తప్ప వారిని నిద్రమత్తులో ముంచకూడదు. ఇటీవలి కాలంలో మన టీవీల్లో వస్తున్న బిగ్బాస్, జబర్దస్త్, అదిరింది వంటి అనేక కార్యక్రమాలు యువతీయువకులను నిష్క్రియా పరులుగా మార్చేస్తున్నాయి. ఒకనాడు మన కళలు జాతీయోద్యమాన్ని, సంస్కరణోద్యమాన్ని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు, వారిని పోరాటయోధులుగా మలిచేందుకు కీలక పాత్ర పోషించాయి. నేడు మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే.. అందుకు కళలు నిర్వహించిన పాత్ర ఎంతో ఉంది. ఎందరో కళాకారులు తమ జీవితాలను అందుకు త్యాగం చేశారు. ఇఫ్టా, ప్రజానాట్యమండలి.. సామాన్యులను సైతం కదిలించాయి. సమస్యలపై ఉద్యమించేలా చేశాయి. ఫలితంగానే మనం నేడీ పరిస్థితుల్లో ఉన్నాం. మాభూమి నాటకం తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. నిజాం దురాగతాలను ప్రజల కండ్లకు కట్టి వారిని ఆలోచింపచేసింది. ప్రజానాట్యమండలి ప్రభావంతో తొలినాళ్లలో సినిమాలు కూడా ప్రజాచైతన్యానికి ఆయుధాలుగా నిలిచాయి. మన కళారంగం హిమాలయ శిఖరాలను అధిరోహించడానికి ఇవన్నీ కారణమయ్యాయి. కానీ నేడు మన సీరియళ్లు, హాస్యం పేరుతో వస్తున్న ఎపిసోడ్స్, బిగ్బాస్లు ఆ కళారంగాన్ని పాతాళంలోకి తోసేస్తున్నాయి. వీటన్నింటికీ పరాకాష్టే బిగ్బాస్ షో. ఇది విలాసవంతమైన అనైతిక సంస్కృతిని నిస్సిగ్గుగా ప్రదర్శించడం కాదా?
అదొక ఇంద్రలోకాన్ని తలపించే అత్యంత విలాసవంతమైన భవనం. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే విజరుమాల్యా అనుభవించిన విలాస జీవితాన్ని ప్రతిబింబించేట్టు 'బిగ్బాస్' చిత్రీకరణ ఉంది. దీనికి ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పరిచయకర్తగా ప్రత్యక్షమయ్యారు. ప్రారంభంలోనే ఈ మాయా శిబిరంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. అతనిని ఆహ్వానిస్తూ నాగార్జున ఆ యువకుడికి ముగ్గురు సినిమా తారల చిత్రాలు చూపి వీరి ముగ్గురితో నీకేమి చేయాలని ఉందని అడుగుతాడు. అందుకాయువకుడు 'ఒక అమ్మాయితో డేటింగ్ చేయాలనీ, మరో అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనీ, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.' అని జవాబు ఇస్తాడు. దీన్ని తిలకించే అవకాశాన్ని ప్రజలకు నాగార్జున 'మాటీవీ' ద్వారా కల్పించారు. ఆ సినిమా హీరోయిన్ల పేరు చెప్పడం సంస్కారం కాదు. ఈ అబేధ్య విలాస పంజరంలోకి యువతీయువకులతో పాటు ఎత్తుగడల రీత్యా ఓ పేద ముసలమ్మను కూడా ఆహ్వానించారు. వారందరూ వంద రోజులు ఈ నిర్బంధం గృహంలో ఉంటారు. వారికి సెల్ ఫోన్స్ ఉండవు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంబంధం ఉండదు. ఇంతకీ ఈ షో ద్వారా సమాజంలోని యువతకు వీరిచ్చే సందేశం ఏమిటి? ఈ షోల వల్ల వచ్చే పర్యవసానాలను ఎప్పుడైనా వీరు ఆలోచించారా? అలాగే జబర్దస్త్, అదిరింది షోల ద్వారా పచ్చిబూతులు, ద్వంద్వార్థాల మాటలతో సమాజానికి ఏం చెబుతున్నారు. యువతీయువకులు ఆ పోకడలను అనుసరించాలని సూచిస్తున్నారా? అటువంటి తరాన్నేనా మనం కోరుకుంటున్నది?
సమకాలీన ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలకనుగుణంగానే మనిషి జీవితం ప్రభావితం అవుతుందనీ, కళ ఆ జీవితంలో అంతర్భాగమనే వస్తుగత దృష్టితో పరిశీలించలేకపోవడమే దీనంతటికీ కారణం. మన జానపదాల్లో కూడా పిట్టకథలు తదితరాలు మనిషి ప్రయోజనాన్ని ఉద్దేశించే ఉండేవనే వాస్తవాన్ని మనం గమనించాలి. కళలు సహజంగా నిర్దిష్ట కాలానికి, స్థలానికి చెందినవైనా నిర్దిష్ట స్థలకాలాదులకు అతీతంగా నిర్వహించబడతాయి. ప్రభావం చూపుతాయి. ఈ సీరియళ్లు, షోలు చూసే ప్రేక్షకుడు ప్రకృతి విరుద్ధంగా జడత్వంతో లేదా నిస్సారంగా లేదా అదో రకమైన అచేతనాస్థితిలో ఉంటాడని వీరి నిర్మాతలు, నటులు, దర్శకుల అభిప్రాయమా? ఇలాంటి ప్రేక్షకుల కోసం ఈ అనైతిక, విలాసవంతమైన షోలను రూపొందిస్తున్నారా?
ప్రేక్షకుల్లో భిన్న తరగతులుంటాయి తప్ప అంతా వారు ఊహించే లేదా భావించే వారుండరు. వారి జీవన విధానాలు, సాంస్కృతిక పద్ధతులు, అనుభూతులు పొంది నిక్షిప్తం చేసుకునే స్థాయికనుగుణంగా ఆ ప్రేక్షక సమూహం కళలో లీనమవుతుంది. తమదైన జీవనశైలికి కళ ఎంత దగ్గర అయితే అంత దగ్గరగా వారు కళకు చేరువవుతారు. కళ వారి జీవితంలో లీనమమైతే వారు కళలో లీనమవుతారు. అదే ప్రజాకళా జీవ ప్రవాహం. లెనిన్ చెప్పినదదే. కళను బూతుగా, విలాసంగా, అసహ్యంగా ఏ వర్గ ప్రజలూ చూడరు. జీవితంలోకీ, ఇంకా వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టని యువతను బూతులతో, పెడదారులతో ఆకర్షించేలా ఈ 'షో'లు కొంతవరకూ చేయవచ్చు గానీ అది శాశ్వతం కాదు. అయితే ఆ యువతను తప్పటడుగులు వేయించినట్లవుతుంది. అది సమాజానికి ఏ మాత్రం ఉపయోగ పడకపోవడమే కాదు, మంచిది కూడా కాదు. వర్గాలతో సంబంధంలేకుండా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తమ పోరాట ఆయుధంగా కళలను ఏవిధంగా మార్చుకున్నది ఏ దేశ చరిత్ర చూసినా మనకు అవగతమవుతుంది. కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఊరూరా తిరిగి ప్రజాచైతన్యాన్ని ప్రోదిచేసి తెలుగునాట నూతన సాంస్కృతికోద్యమానికి నాంది పలికిన వాస్తవం మనందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్నటి తెలంగాణ ఉద్యమంలోనూ కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిది. ఇంతటి వారసత్వానికి మచ్చతెస్తూ వెకిలిగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా, అప్రస్తుతంగా కాలక్షేపం పేరిట ఇటువంటి పలాయన షోలను ప్రజలపై రుద్దడంలోని ఆంతర్యం ఏమిటి? పెట్టుబడిదారీ సంస్కృతిలో లాభం, ప్రయోజనం తప్ప సమాజ క్షేమం, ప్రజల సంక్షేమం ఉండవు. దాని ఫలాలే ఇవన్నీ. ప్రజాభ్యుదయ భావజాలాన్ని తక్కువ చేసి చూపడమే దాని లక్ష్యం. కానీ ఇది భౌతిక విరుద్ధం. సమకాలీన ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలకనుగుణంగానే మనిషి జీవితం ప్రభావితం అవుతుంది. కళ ఆ జీవితంలో అంతర్భాగమనే వస్తుగత దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే ఈ పిచ్చిపిచ్చి షోల గురించి నేడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సమాజంలో మార్పు సహజం. అయితే అది యాదృశ్చికంగా రాదు. ఆయా వర్గాల ప్రయోజనాల కనుగుణంగా జరిగే ఘర్షణల ద్వారా వస్తుంటుంది. ఆ ఘర్షణలో కళలు కూడా పాత్ర వహిస్తాయి. తను చస్తూ తన తోటివారిని చంపే కళలు ఇలాంటి 'షో'లు. తాను బతుకుతూ తనతోటి వారిని బతికిస్తూ తన ముందుతరాలు బతికేందుకు ఆలంబనగా నిలిచేవి ప్రజాకళలు. ఇప్పుడు మనకు కావాల్సింది అటువంటి ప్రజాకళలే తప్ప ఇటువంటి చెత్త షోలు కాదు.
ఇప్పటి మన పరిస్థితి ఏమిటి? కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నది. అనేక మందిని పొట్టనబెట్టుకున్నది. మానవీయ అనుబంధాలను మంటకలిపింది. తండ్రి లేదా తల్లి లేదా కొడుకు లేదా భర్త లేదా భార్య- ఎవరు చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయడానికి వెనుకాడే ఓ అమానవీయ పరిస్థితి మనల్ని చుట్టేసింది. రైతులు, వృత్తిదారులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. దళితులు, బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల మన రాష్ట్రంలో శిరోముండన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి ఒక విషమ, విషాద పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇవేమీ ఈ 'బిగ్బాస్'లకు పట్టవా? విలాసవంతమైన, విచ్చలవిడి సంస్కృతిని పోగుచేసే ఒక విషవలయాన్ని మన చుట్టూ ముఖ్యంగా మన యువత చుట్టూ బిగిస్తున్నారు. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే సూత్రం వీరికి పట్టదా? సమాజం అంటే మనుషులు సమష్టిగా ప్రకృతితో కలిసి, ప్రకృతితో పోరాడుతూ సాగించే ఉత్పత్తి,, పునరుత్పత్తి ప్రక్రియలు, మానవసంబంధాల సమాహారం అని మార్క్సిజం నిర్వచిస్తున్నది. అంటే సమాజంలో మనుషుల పాత్ర, ప్రకృతి పాత్ర ఉంటుంది. ప్రకృతిని ఉపయోగించుకుని మనిషి మనుగడకు అవసరమైన ఉత్పత్తి సాగించడమూ ఉంది, మనుషుల నిరంతరాయంగా పునరుత్పత్తి కావడమూ ఉంది. ఈ మనుషుల మధ్య సామూహికత వల్ల సంబంధాలు నెలకొడమూ ఉంది. ఆ సంబంధాల్లో ఘర్షణ, ఐక్యతా ఉంటాయి. వీటికి కళలు చోదకశక్తిగా పనిచేస్తాయి. ఇప్పుడు మన టీవీలు చూపుతున్న షోలు ఇందుకు విరుద్ధం. ఇవి మనిషిని పతనదిశగా తీసుకుపోతాయి. ఈ విషవలయాల నుంచి యువత బైటపడాలి.
- డాక్టర్ కె. నారాయణ