Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మంత్రాలు, జపమాలలు విడిచిపెట్టు.. తలుపులన్నీ మూసుకుని, చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావూ? కండ్లు తెరచి చూడు. నువ్వు ఆరాధించే దేవుడు నీ ఎదురుగా లేడు. ఎక్కడ రైతు నేలను దున్నుతున్నాడో, ఎక్కడ శ్రామికుడు రాళ్ళు పగలగొడుతున్నాడో అక్కడ ఆ పరమాత్ముడుంటాడు. ఎండలో, వానలో దుమ్మూ ధూళి కొట్టుకు పోయిన వారి బట్టల్లో ఉన్నాడు. నువ్వు కూడా నీ పట్టు పీతాంబరాల్ని పక్కన పెట్టి ఆ నేల మీదికి వెళ్ళు... - విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.
మనం ఒక విషయం ఆలోచిద్దాం! ఇటీవల లాక్డౌన్ సమయంలో పులులు, సింహాలు, పాములు ఇంకా ఇతర వన్యప్రాణులు నగరాల్లోకి వస్తే వ్యవస్థలన్నీ ఏకమై, అల్లకల్లోలమైపోయాయి కదా? ఇంత అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండి కూడా జనం బెంబేలెత్తి పోయారు కదా? అవి పట్టుబడే దాకా నిద్రలేని రాత్రులు గడిపారు కదా? మరి అతి పురాతన కాలంలో ఏ సౌకర్యాలు లేకుండా, ఏ ఆయుధాలు లేకుండా అంత నిర్భయంగా మునులు అరణ్యాల్లో ఎలా తపస్సు చేయగలిగారూ? కీకారణ్యాల్లో కూర్చుని రుషులు ఘోర తపస్సు చేశారని పురాణాలు చెపుతున్నాయి. అక్కడ దేవుని విగ్రహాలు కానీ, ఆయన 'దివ్య స్వరూపపు' సింబాలిక్ గుర్తులు గానీ ఏవీ ఉండేవి కావు. అయినా పాపం దేవుళ్ళు భేషజాలు లేకుండా తటాలున వారికి ప్రత్యక్షమైపోయేవారు. తమకు ఒక గూడు, అదే గుడి కట్టించమని దేబరించేవారు కూడా! పురాణ సాహిత్యం జీర్ణించుకుని చెప్పే పండితుల మాటల వల్ల, మత బోధకుల బోధనల వల్ల మనకు ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే జరిగిన ఈ సనాతన ప్రచారంలో ఏదో తిరకాసు ఉన్నట్టు తోచడం లేదూ? ''ఎన్నెన్నో అభూత కల్పనల్లో ఇది కూడా ఒకటిలే'' అని అనుకోవాల్సి వస్తోంది మరి? క్రూర మృగాలకు రాజూ, పేద, ముని, గినీ అనే తేడాలుండవు. మీదపడి పీక్కు తినడం తప్ప వాటికి ఏ విచక్షణా ఉండదు. అడవిలో క్రూర మృగాల మధ్య, సురక్షితం కాని క్రిమికీటకాల మధ్య పాములు, తేళ్ళూ పాకుతుండే చోట, కోతులు, కొండెంగలు కిచకిచమని కీచులాడుకునే చోట, బబూన్లు భల్లూకాలు తిరుగాడే చోట, భయంగొలిపే వాతావరణ మార్పుల మధ్య.. రక్షణలేని కీకారణ్యాల్లో మానవ మాత్రులైన కొందరు మునులు తపస్సు చేశారంటే అనుమానించాల్సి వస్తోంది. కండ్లు మూసుకుని, హాయిగా ప్రశాంతంగా ఏండ్లకేండ్లు భయభ్రాంతులను అధిగమించి తపస్సు చేశారని చెప్పడం ఏ రకంగా చూసినా ఒక అభూత కల్పనే అని అనిపిస్తుంది. కాదు వాస్తవం అని అనుకుందామంటే, అందుకు ఆధారాలే లేవు. సమకాలీనంలోని ఈ మనుషులకు అడవి జంతువులను మచ్చిక చేసుకునే నైపుణ్యం లేదు- ఆ రోజుల్లో మహర్షులకు ఉండేది.. అని అంటారా? సరే, అదే నిజం కాబోలు అనుకుని, ఆ కోణంలో ఆలోచిద్దాం.. అలాగైతే జంతువులు మనుషుల భాషలో మాట్లాడటం, సూక్తులు, నీతులు చెప్పడం, లేదా ప్రశ్నలు గుప్పించడం వంటి పనులు చేస్తుండేవని.. పురాణాల్లోను, జానపద కథల్లోనూ ఉన్నాయి. అది నిజమైతే ఇప్పుడున్న జంతువులు ఆ.. పూర్వ కాలపు జంతువుల సంతతిలే కదా? మరి ఇవెందుకు మనుషుల భాషలు మాట్లాడటం లేదూ? దారి తప్పి ఇప్పుడు ఊళ్ళలోకి వస్తున్న ఈ అడవి జంతువులు నెమ్మదిగా, మర్యాదగా.. ఎవరికీ హాని చేయకుండా ఎందుకు మసలు కోవడం లేదూ? కొన్ని వందల ఏండ్ల క్రితం అడవుల్లో ముక్కుమూసుకుని కూర్చుని, తపస్సు చేసుకునే మునీశ్వరులకు ఏ హాని కలగకుండా ఈ వన్యప్రాణులు మసలుకున్నాయి కదా?
మానవ ప్రవృత్తిలో, ఆలోచనా విధానంలో మార్పువచ్చినట్టు జంతు ప్రవృత్తిలో కూడా మార్పు రావాలి. కానీ, రాలేదు. ఎందుకంటే వాటి మెదడు చిన్నది. వాటి అవగాహన పరిమితమైంది. మనిషి - తన అవగాహన పెంచుకోవడం, జీవన విధానం మార్చుకోవడం, కొత్త విషయాలు శోధించి తెలుసుకోవడం ఎలాగైతే చేస్తున్నాడో, జంతువులు అలా చేయడం లేదు. శతాబ్దాలుగా అవి అలాగే ఉన్నాయి. క్రూర మృగాలు ఒకప్పుడు జంతువుల్ని వేటాడి తినేవి. ఇప్పుడూ అలాగే తింటున్నాయి. మార్పులేదు. ఒకప్పుడు మనిషి కూడా జంతువుల్ని వేటాడి తినేవాడు. కానీ, అతడు అక్కడే ఉండిపోలేదు. వ్యవసాయం ప్రారంభించాడు. మాంసాహారంతో పాటు శాఖాహారానికి కూడా ప్రాధాన్యమిచ్చాడు. కొత్త ఆవిష్కరణలతో విశ్వనరుడయ్యాడు. భూమిని, భూమిలోపలి పొరల్ని, గ్రహాల్ని, విశ్వాన్ని అన్నింటినీ అర్థం చేసుకోగలిగే స్థాయికి వచ్చాడు. కాలానుగుణంగా వృక్షాల్లో, జంతువుల్లో కొన్ని కొన్ని మార్పులొస్తున్నా.. అవి మనిషి వివేకంతో పోటీపడలేకపోతున్నాయి. అందువల్ల, పొరపాటున ఊళ్ళోకి వస్తున్న ఈ క్రూర మృగాలు వాటి సహజ లక్షణాల ప్రకారమే ప్రవర్తిస్తున్నాయి. మనిషి కనబడితే చాలు మీదపడి పీక్కుతినే ఈ క్రూర మృగాలు ఒకప్పుడు ఈ మనుషుల్ని తపస్సు చేసుకోనిచ్చాయా? వీళ్ళు నిద్రాహారాలు లేకుండా ఏండ్లకేండ్లు తపస్సు చేస్తూ వచ్చారా? శరీర ధర్మ లక్షణాలకు అడ్డుకట్ట వేసుకుని, జీవిస్తూ వచ్చారా? జుట్టు జడలు కట్టి, పైనుంచి పుట్టలు పెరిగినా వారికేమీ తెలియకుండా ఉండేవారా? దానివల్ల వారికి స్వాధీనమయ్యే మంత్ర శక్తులేమిటీ? ఆ మంత్రశక్తులు అంటే అతీంద్రియ శక్తులు ఆనాటి ప్రజాజీవనానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయీ? ఆనాటి సమాజానికి జరిగిన మేలేమిటీ? అంటే లోక కళ్యాణమేమిటీ? ఎక్కడా ఎవరూ నమోదు చేయలేదు ఎందుకూ?
తపోధనులు తమ తపశ్శక్తిన్నంతా ధారపోసి ఇతరులను శపించేవారని పురాణ గాధల్లో ఉంది. అంటే, తపశ్శక్తి శాపనార్థాలు పెట్టడానికి తప్ప, ఇంకెందుకూ ఉపయోగపడలేదా? వీటితో మంచిపనులు చేసిన దాఖలాలు లేవే? ఆ శక్తులతో అన్నార్తుల ఆకలి తీర్చినట్టుగానీ, దాహం తీర్చినట్టుగానీ, ఆ మంత్రశక్తితో వానలు కురిపించి, పంటలు పండించినట్టు గానీ.. ఎక్కడా నమోదుకాలేదే? అసలు వానలెందుకు? తపశ్శక్తితో జనులకు ఆకలి దప్పులు లేకుండా సుఖ సంతోషాలతో వర్థిల్లేట్టు చేయలేక పోయారు కదా? అలా జరిగినట్టు ఎక్కడా ఏ పురాణ గాథల్లోనూ లేదే? దేవుడు ఉన్నాడని, దైవశక్తి ఉందని దబాయించినంత సులభంగా - తపశ్శక్తి ఉందని, మన పూర్వీకులు.. అంటే మనువాద పూర్వీకులు డప్పుకొట్టుకుంటూ ప్రచారం చేశారన్న మాట! మామూలు ప్రజలకన్నా తపస్సు చేసిన వారు మహనీయులని, గౌరవనీయులని, మహిమ గలవారని ఒక తప్పుడు భావనని స్థిరపరిచారన్న మాట! ఉట్టి ప్రచారం కాదు, అది నిజమే అయితే, ఎవరూ తమ తపశ్శక్తుల్ని - అతీంద్రియ శక్తుల్ని ఎందుకు నిరూపించుకోలేక పోయారు. ఇటీవల ఆధునిక కాలంలో అబ్రహం కోవూర్ లాంటి వాళ్ళు పెద్ద మొత్తంలో నగదు బహుమతి ప్రకటించారు కదా? ప్రపంచంలో మానవాతీత శక్తులు ఎవరికి ఉన్నా వారు నిరూపించుకోవాలని ఆయన సాదరంగా ఆహ్వానం పలికారు. ఒక రకంగా ఛాలెంజ్ విసిరారు. ఏరీ ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు. ఇప్పటికైనా ఎవరైనా, ఒంటరిగా కీకారణ్యంలో తపస్సు చేసి తపశ్శక్తులు సంపాదించుకుని వచ్చి నిరూపించుకోవాలి. లేదా పుట్టుకతోనే ప్రత్యేకమైన మంత్రశక్తులుంటే కూడా నిరూపించుకోవచ్చు. మిలియన్ డాలర్ల బహుమతి తక్కువది కాదు. మామూలు మనుషులు జీవితకాలంలో సంపాదించలేనంత. సరే బహుమతి ముఖ్యం కాదనుకుంటే కనీసం కండ్లు మూసుకుపోయిన ఈ మూర్ఖ సమాజానికి కండ్లు తెరిపించడాని కైనా తపశ్శక్తి సంపన్నులు, అతీంద్రియ శక్తులున్నవారు, మానవాతీతులు ముందుకురావాలి! 'సింబాలిక్'గా తప్ప దేవుణ్ణి చూపించలేని వారు, కనీసం తపశ్శక్తి అనేది మనుషులు సాధించగలరని నిరూపించడానికైనా ముందుకురావాలి. అలాంటివి ఉండవు అని వాగే హేతువాదుల 'పిచ్చి'నోళ్ళుమూయించడానికైనా.. ముందుకు రావాలి! ఇలాంటి వారిని చూసి ప్రఖ్యాత తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక మంచి మాట చెప్పారు. దాని గూర్చి సనాతన - సంప్రదాయవాదులు బాగా ఆలోచించవల్సిన అవసరం ఉంది. ''ప్రాచీన ప్రబంధ సాహిత్యాన్ని విమర్శించడం అంటే.. ఆ సాహిత్యంలోని విశాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలను విమర్శించడంగా మాత్రమే అర్థం చేసుకోవాలి!'' అని! జనం అలవాటు పడింది డ్రగ్స్కు, ఆల్కాహాలుకూ కాదు. వాస్తవాన్నించి తప్పించుకు తిరగడానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటు ప్రకారమే దైవభావన, పాపం, పుణ్యం, పునర్జన్మ, కర్మ లాంటి వాటిని ఏర్పరుచుకున్నారు. శతాబ్దాలుగా అలవాటయినవి ఒక్కసారిగా వదులుకోలేకపోతున్నారు. అందుకే ఘర్షణ పడుతున్నారు. ''దైవభావన ప్రాచీన మానవుడి ఆలోచనల ఫలితం.. ఈ విశ్వానికి ఆవల దేవుడి ఉనికిని నేను ఊహించలేను'' అని మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. అలాంటి వారు చెప్పింది జనం వినరని కాదు. వింటారు.. కానీ, సంప్రదాయాల చట్రంలోకి లాగబడి, మళ్ళీ అవే పాత విశ్వాసాల్లో బతుకుతుంటారు. ఇప్పుడిక కొంత ధైర్యం, తెగువా అవసరం. దైవ విశ్వాసం మాత్రమే గొప్ప వ్యక్తిత్వాన్ని ఇస్తుందన్న భావనను వదులుకోవాలి. పురాణాల్లోని ద్వంద నీతిని ప్రశ్నించేవాడే ఆధునికుడవుతాడు. ఉదాహరణకు గరుడ పురాణం ప్రకారం - వ్యభిచరించిన స్త్రీ పురుషులకు కఠినశిక్షలుంటాయి అని ఉంది. మరి మునిపత్ని అయిన ఆహల్యను దొంగతనంగా అనుభవించిన ఇంద్రుడికి శిక్ష ఏది? దారుకావనంలో మునుల భార్యలను అనుభవించిన శివునికి శిక్ష ఏది? పదహారు వేల మందితో ఊరేగిన కృష్ణుడికి ఎంత శిక్ష పడాలి? పరకాయ ప్రవేశం ద్వారా ముండనుకుడి భార్యను వ్యభిచరించిన ఆది శంకరుడికి శిక్ష ఏది? మునిపత్నులకే రక్షణ లేకపోతే మునుల తపశ్శక్తికి 'శక్తి'-లేదని తెలిసిపోతోంది కదా? ఇవన్నీ మానవుడి స్థాయి తగ్గించే రచనలని, ఎదగని ఆలోచనలని తెలుసుకుంటే మంచిది. మన పురావస్తుశాఖవారు సేకరించిన 20వేల ఏండ్ల నాటి రాళ్ళూ, రప్పలు పరిశీలిస్తే వాటి మీద ఎద్దుల బొమ్మలు, బాణాలతో వేటాడుతున్న ఆదిమ జాతుల చిత్రాలే కనిపిస్తాయి. అదేమిటో మరి ఏ మతానికి చెందిన ఏ దేవుడి బొమ్మలూ కనిపించవు. అంటే, ఈ పైత్యమంతా ఆ తరువాత కాలంలో రాసుకున్నదీ, గీసుకున్నదనేగా - దాని అర్థం? ఒక అబద్దపు దైవభావన చుట్టూ తిరిగిన ఎన్నో అంశాలలో తపస్సు - తపశ్శక్తీ కూడా ఒకటి. దైవభావనే కల్పితమైనప్పుడు, దాని చుట్టూ అల్లుకున్న అంశాలు నిజాలెలా అవుతాయీ? కొంచెం లోతుగా ఆలోచిస్తే విషయాలు అర్థమవుతాయి. అయితే అందుకు బూజుపట్టిన భావజాలాన్ని కొంచెం పక్కకు పెట్టగలగే ధైర్యం ఉండాలి!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.