Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు వీరనారి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న మరణించారు. తన 35వ వర్థంతిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసింది. ఆనాడు తనతో పాటు తన చుట్టూ వున్న ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆలోచించింది. ఆంధ్రమహాసభ సంఘంలో చేరి ఎర్రజెండా పట్టింది. పాలకుర్తితో పాటు అనేక గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యం చేసింది. తన ఇల్లునే పోరాట కేంద్రంగా మార్చింది. ఇది సహించలేని విస్నూర్ దేశ్ముఖ్, భూస్వాములు ఐలమ్మ ఇంటిపైన అనేకసార్లు దాడి చేశారు. ఆమె కుటుంబ సభ్యులను జైలుపాలు చేశారు. అయినా ఐలమ్మ పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇక ఐలమ్మను ఏమీ చేయలేక తన పంటను కాజేయాలని దేశ్ముఖ్, భూస్వాములు పథకం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎత్తుకెళ్ళడానికి వచ్చిన గూండాలను ఐలమ్మ సంఘం సహకారంతో తరిమి, తరిమి కొట్టింది. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్ళడానికి దొర ఎవడని ఆమె మాట్లాడిన తీరు, చేసిన పోరాటం, ఈనాటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం.
ఆనాడు నైజాం పాలనలో మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మహిళలను కనీసం మనిషిగా చూసే పరిస్థితి లేదు. మహిళల మాన, ప్రాణాలకు ఆనాడు రక్షణ లేదు. దేశముఖ్లు, భూస్వాములు మహిళలపైన ఎగబడి అత్యాచారాలు చేసేవాళ్ళు. పసిబిడ్డలు ఏడిస్తే పాలిచ్చే స్వేచ్ఛ కూడా ఆనాడు మహిళలకు లేదు. వీటితోపాటు సాంప్రదాయం పేరుతో ఇంకా అనేక కట్టుబాట్లు మహిళలకు ఉండేవి. వీటికి వ్యతిరేకంగా ఆనాడు మహిళలు అనేక పోరాటాలు చేశారు. మహిళల సమస్యలు పరిష్కారం కావాలంటే నైజాం పాలన అంతం అయినప్పుడు మాత్రమే సాధ్యమౌతుందని మహిళలు భావించారు. అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మతో పాటు అనేకమంది మహిళలు పాల్గొన్నారు. బందూకు పట్టి అడవిబాట పట్టి గెరిల్లా దళాల్లో పురుషులతో సమానంగా పోరాడినవారు కొందరైతే, పోరాటంలో ఉన్న మగవారి స్థానంలో కుటుంబ భారాన్ని మోస్తూ నైజాం ముష్కరుల అవహేళనల్ని ఎదిరించి నిలిచినవారు మరికొందరు. తమ మాన, ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి నిజాం పాలనను అంతం చేసి అనేక హక్కులు సాధించుకున్నారు.
అదే స్ఫూర్తితో నేడు మహిళలు మరిన్ని పోరాటాలకు పునరంకితం కావాల్సి ఉన్నది. నేడు ప్రభుత్వ విధానాల మూలంగా సంఘటిత రంగం తగ్గి అసంఘటిత రంగం బాగా పెరిగింది. ఈ అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారు అత్యధికులు మహిళలే. అనేక పరిశ్రమల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళలకు పురుషులతో సమానంగా కూలీ చెల్లించడం లేదు. అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీం వర్కర్లకు ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.1,000 వేతనం. ఆశాలకు అసలు వేతనమే లేదంటే వెట్టిచాకిరి ఏ రూపంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో పాటు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ప్రయివేట్ కాలేజీలు, స్కూల్స్, ఇంటి పనివారలు, గృహ కార్మికులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో పనిచేస్తున్న మహిళలకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడం లేదు. అతి తక్కువ వేతనాలతో మహిళల శ్రమను దోచుకుంటున్నారు. మహిళలకు ప్రకృతి సహజ సిద్ధంగానే కొన్ని సౌకర్యాలను ప్రభుత్వాలు ఖచ్ఛితంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రసూతి సెలవులు. కానీ ఈ సౌకర్యం కూడా అనేక రంగాలలో వర్తించడం లేదు. దీంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరితో పాటు వ్యవసాయం పైన నేటికీ 50శాతం మంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం వల్ల వీరికి పనులు దొరకడం లేదు. ఉపాధి హామీ పనితో కొంత ఊరట కలిగినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం దానిని కూడా నిర్వీర్యం చేస్తున్నది. సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇప్పుడు ఆ పనులు కూడా బాగా తగ్గాయి. పట్టణ ప్రాంతంలో ఈ పని కూడా లేదు.
పని ప్రదేశాలలో బాత్రూమ్స్ తదితర సౌకర్యాలు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంఘటితరంగం, అసంఘటితరంగం అనే తేడా లేకుండా పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు విపరీతంగా పెరుతున్నాయి. వీటిని అరికట్టే చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఇప్పుడు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చాలని చూస్తున్నారు. ఇప్పటికే వేతనకోడ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం కూడా పొందింది. ఈ చట్టాలన్నీ మార్పు జరిగితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది మహిళలే. ఇతర సౌకర్యాలతో పాటు మహిళలు ప్రత్యేకంగా సాధించుకున్న ప్రసూతి సెలవులు రద్దవుతాయి. పని ప్రదేశాలు, యంత్రాల దగ్గర ప్రసవించే గత కాలాన్ని మళ్ళీ తేవాలని చూస్తున్నారు. నైట్ షిఫ్ట్ల్లో మళ్ళీ మహిళలతో పనిని ప్రారంభిస్తారు. వీటితో పాటు పని గంటలను 8 నుంచి 12కు పెంచుతున్నారు. మన దేశంలో బయట పనితో పాటు ఇంట్లో పని కూడా మహిళల బాధ్యతగానే ఉంది. ఈ పరిస్థితిలో పని గంటలు పెరిగితే ఇంటి పని కోసం మహిళలు రాత్రంతా మెలుకువగా ఉండాల్సి వస్తుంది. ఈ పరిణామాలు మహిళలను మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతాయి.
మనదేశంలో మహిళలు చేస్తున్న ఇంటి పనికి గుర్తింపు లేదు. దీంతో మహిళలు ఎంత పనిచేసినా గుర్తింపు లేకపోవడంతో చులకన భావనకు గురౌతున్నారు. దీనికి తోడు హత్యలు, అత్యాచారాలు, గృహ హింస, వరకట్న వేధింపులు, ప్రేమ పేరుతో చంపడాలు, యాసిడ్ దాడులు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయి. మహిళలకు భద్రత లేని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో మన దేశం కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం అరికట్టడం లేదు. ఈ పరిణామాలకు మన రాష్ట్రమేమి అతీతంగా లేదు. మన రాష్ట్రంలో మహిళా కమిషనర్ను కూడా ఏర్పాటు చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల పైన హింసకు ప్రధాన కారణం మద్యం. దీనిని నియంత్రించడం లేదు. ఒక్క క్షణంలో చైనా యాప్లను రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం పిల్లలపై జరుగుతున్న హింస, అత్యాచారాలకు కారణమౌతున్న పోర్న్ వీడియోలను మాత్రం రద్దు చేయడం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పురుషాధిక్య భావజాలాన్ని మరింత రెచ్చగొడుతున్నది. హత్యలు, అత్యాచారాలకు మహిళల వేషధారణ కారణమంటూ బీజేపీ మంత్రులు, ఎంఎల్ఏలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసిన నిందితులను శిక్షించడానికి బదులు వారికి దండం పెట్టాలి, బతిమాలుకోవాలని హితబోధ చేస్తున్నారు. హిందూ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని చెప్తున్నారు. మహిళలు పిల్లల్ని కనే యంత్రంలా మార్చాలని చూస్తున్నారు. ప్రస్తుతం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానంలో లింగ వివక్షను మరింత పెంచే విధంగా కేంద్రం మార్పులు చేసింది. ఇప్పటికే లింగ వ్యత్యాసంలో ప్రపంచంలో 153 దేశాలలో మన దేశం 112వ స్థానంలో ఉంది. సాంప్రదాయం పేరుతో స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో పాటు మహిళలు సాధించుకున్న అనేక హక్కులను కాలరాసి, మహిళలను మళ్ళీ వంటింటికే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హక్కుల సాధనకై ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలి.
పి. జయలక్ష్మి
సెల్:9490098605