Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర శాసన సభలో 2020 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత అట్టహసంగా రెవెన్యూ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతూ, ఇది మొత్తం రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలన్నింటిని పరిష్కరిస్తుందనీ ప్రకటించారు. తాను ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులలో 1. భూమి హక్కుల రికార్డు - పాస్పుస్తకం 1971 సవరణ చట్టం, 2. వీఆర్ఓ పదవుల రద్దు చట్టం, 3. గ్రామ పంచాయతీలకు ధరణీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చట్టం, 4. మున్సిపాలిటీలకు ధరణీ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చట్టం ఉన్నాయి. పై నాలుగు చట్టాలు మొత్తం రెవెన్యూ సంస్కరణలను తెస్తాయని, ఇది చారిత్రక మార్పు అని, దేశంలో ఎవరూ చేయని పని తాను చేస్తున్నాననీ, ఈ చట్టాలతో రెవెన్యూ శాఖలో అవినీతి మటుమాయం అవుతుందనీ శాసనసభలో చెప్పారు. రానున్న కాలంలో మొత్తం భూములు ఇంచ్ టు ఇంచ్ సర్వే చేయిస్తానని చెప్పారు. 2014 జూన్లో అధికారంలోకి వచ్చినప్పుడే భూముల సర్వే ప్రకటించి నేటివరకు వాయిదా వేశారు. ఈ ఆరేండ్ల కాలంలో అనేక అక్రమార్కులు వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకుని అనుభవించడానికి అవకాశం కల్పించారు. రానున్న కాలంలో సర్వే చేయిస్తానన్న ప్రకటన ఆచరణకు నోచుకోకపోయినా అశ్చర్యం లేదు. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన బిల్లులను పరిశీలిద్దాం.
1971 పాస్ పుస్తకాల చట్టంలో (26/1971) పట్టేదార్తో పాటు కౌలుదారుకు, తాకట్టుదారుకు, అక్రమణదారుకు, వాస్తవసాగుదారుకు పాస్పుస్తకాలు ఇవ్వాలని చెప్పబడింది. దాని ప్రకారం పట్టేదారుకు పట్టా పాస్పుస్తకం, సాగుదారుకు స్వాదీన పాస్పుస్తకం ఇచ్చారు. పట్టేదారు స్వంతంగా సాగు చేసుకున్నచో అతనికి రెండు పాస్పుస్తకాలు ఇచ్చారు. 2014 వరకు ఈ పాస్పుస్తకాలు కొనసాగాయి. 1971కి పూర్వం నైజాం కాలం నుండి ''పావుతీబహీ'' అను రశీదు పుస్తకం, ఆ తరువాత శిస్తు చెల్లింపు రశీదు పుస్తకం ఇచ్చారు. ఈ ప్రభుత్వం 'పహణీ'లో సాగు కాలంను తొలగించారు. కౌలుదారులను వాస్తవ సాగుదారులను ఈ ప్రభుత్వం గుర్తించదని శాసనసభ సాక్షిగా చెప్పారు. మొట్టమొదటిసారి తెలంగాణలో 1907లో (1317 పసలీ) రెవెన్యూ చట్టం తెచ్చారు. 1944లో మొదటిసారి కౌలుదారి చట్టం ఆమోదించారు. ఆ తరువాత 1951లో రక్షిత కౌలుదారి చట్టం వచ్చింది. 2011లో లైసన్డ్ అధీకృత రైతుల చట్టం అంటూ కౌలు చట్టం ఆమోదించి అమలు జరిపారు. దేశవాప్తంగా కౌలుదారులకు హక్కులు కల్పించాలని నిటి అయోగ్ (పాత ప్రణాళిక బోర్డు) కౌలుదారి చట్టం ముసాయిదాను తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఇంత జరిగిన తెలంగాణ ప్రభుత్వం కౌలుదారులను, సాగుదారులను రికార్డుల నుండి రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. దీని వలన రాష్ట్రంలో 20 లక్షల మంది భూమి లేని వాస్తవ సాగుదారులు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారు. తెలంగాణలో భూముల అమ్మకాల కొనుగోలులో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా 'సాధాబైనామా' తెల్లకాగితంపై విక్రయ దస్తావేజు రాసుకుంటారు. ఆలాంటివి ఈ ప్రభుత్వం వద్దకు రిజిస్ట్రీ కోరకు 12.5 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.3 లక్షలు పరిష్కరించారు. మిగిలినవి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో వున్నాయి. 2014కు ముందు ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) పథకం, అంతకు ముందు సెక్షన్ 50బి కింద కొనుగోలు చేసిన నాటి రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకొని సాదాబైనామాలను పట్టాలు చేశారు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఫీజు లేకుండానే చేస్తానని చెప్పి పెండింగ్లో పెట్టింది. ఇవేవి కొత్త చట్టంలో చూపలేదు. భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి తహశీల్దార్ మరియు మున్సిపాలిటీలకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఆఫీసు బాధ్యతలను తగ్గించారు. ఒకేఒక్క రిజిస్ట్రేషన్ తహశీల్దార్లు చేయడం ద్వారా ఆన్లైన్లో వేంటనే ధరణీ వెబ్సైట్కు రికార్డులో జమ అవుతుందని దాంతో అవినీతి మటుమాయం అవుతుందని చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్తోపాటు అనేక రెవెన్యూ సమస్యలతో రైతులు కార్యాలయాల చూట్టు తిరుగుతున్నారు. ఆ విధంగా రెవెన్యూ కోర్డులలో (తాహశీల్, ఆర్డీఓ, డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్) 16,163 కేసులున్నట్లు కేసీఆర్ చెప్పారు. వీటి పరిష్కారానికి 10 ట్రిబ్యునల్స్ వేసి పరిష్కరించి తరువాత వచ్చే రెవెన్యూ కేసుల పరిష్కరానికి సివిల్ కోర్టులకు వెళ్లాలని కొత్త బిల్లులో చెప్పారు. డిజిటలైజ్ పాస్పుస్తకాలను ఆధికారులు కాని, ప్రభుత్వం కాని మార్పులు చేసినచో వారిపై ఎలాంటి దావాలు వేయరాదని చట్టంలో ఆదేశించారు. వారసత్వంగా వచ్చే భూములను ఒప్పందం ద్వారా పంపిణీ చేసుకున్నప్పుడు 'మ్యుటేషన్' చార్జీలు చెల్లించాలని కొత్త నిబంధన విధించారు. రిజిస్ట్రేషన్ సవరణ చట్టానికి ఇంత హంగామా అవసరమా? మొత్తం రెవెన్యూ చట్టంలో మార్పులు తెస్తున్నామని చెప్పి ఒక్క పాస్ పుస్తకాల చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. వాస్తవంగా సాగుదారులు రెవెన్యూ శాఖలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎమిటీ?
రాష్ట్రంలో 163 లక్షల ఎకరాల సాగుభూములున్నాయి. ఇందులో రైతుల ప్రయివేట్ భూములు 147.50లక్షల ఎకరాలున్నాయి. వీటిపై 59.48లక్షల మంది రైతులు హక్కులు కలిగి ఉన్నారు. మిగిలిన 15.50లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, భూదాన భూములు, చెరువు పడకలు, బంజర్లు, ఆబాధీ, దేవాదాయ దర్మాదాయ భూములు, వక్ఫ్, పారెస్టు బంజర్ తదితర భూములున్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రైతుల సాగులో ఉన్నాయి. వీటిపై కూడా పాస్పుస్తకాలు ఇవ్వాలి. ఇందులో చాలా భూములు అక్రమ ఆక్రమణలో ఉన్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన వారే ఆక్రమించుకుని ఉన్నారు. చెరువులు ఇరిగేషన్ శాఖకు చెంది ఉన్నాయి. కొన్ని విద్యుత్ శాఖకు, జాతీయ రహదారి శాఖకు చెంది ఉన్నాయి. ఈ భూములన్ని కూడా ఆక్రమణలోనే ఉన్నాయి. ఈ భూములు రెవెన్యూ చట్టంలో స్పష్టంగా నిర్దేశించబడి ఉన్నాయి. కానీ చట్టాలు ఎమి చెప్పినప్పటికిని అక్రమార్కులు ఈ భూములను ఆక్రమించి కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారు. వీటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తుత రెవెన్యూ చట్టంలో చెప్పలేదు. రెవెన్యూ చట్టాన్ని 1864లో 66 సెక్షన్లతో తయారు చేశారు. అలాగే భూ సంస్కరణల చట్టం 1973 20 సెక్షన్లతో, ఏపీ పాస్పుస్తకాల చట్టం 1971 సెక్షన్లు 12తో రక్షిత కౌలుదారి చట్టం 104 సెక్షన్లతో, ఏపీ కౌలుదారి చట్టం 21 సెక్షన్లతో ఆమోదించారు. ఈ చట్టాలన్నీ అమలులో పూర్తిగా విఫలమైనాయి. కొన్నింటికి కాలదోషం పట్టింది. ఇవేకాక రాష్ట్రనికి నూతన రెవెన్యూ కోడ్ తెస్తారని అందరూ ఆశించారు. ప్రస్తుత రెవెన్యూ కోడ్లో 1. రెవెన్యూ రికవరీ చట్టం -1884, 2. కమర్షియల్ టాక్స్, 3. ఎక్సైజ్ ప్రొబిషన్, 4. సివిల్ సప్లయిస్, 5. ఎండోమెంట్, 6. రిజిస్ట్రేషన్, స్టాంపులు, 7. కస్టమ్స్ 8. కోర్టు ఆఫ్ వార్డ్సు శాఖలు కలిగి ఉన్నది. రెవెన్యూ చట్టం అన్నపుడు ప్రకృతి వైపరీత్యాలు, టూరిజం కూడా చేరి ఉంటుంది. రెవెన్యూ అనగా అదాయం. అదాయం వచ్చే శాఖలన్ని రెవెన్యూ కోడ్లో ఉంటాయి. విడివిడిగా శాఖలకు, ఆశాఖలలోని కొన్ని సెక్షన్లకు చట్టాలుంటాయి. చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వం రూల్స్ తయారు చేస్తుంది. రూల్స్కు అనుగుణంగా జీవోలు తెస్తారు. ఇంత పకడ్బందిగా ఎర్పాటు చేసిన రెవెన్యూ కోడ్ను నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అంగ్లేయుల నాటి, నిజాం నాటి చట్టాలను ట్రాన్స్లేషన్ చేసి ఇప్పటికీ అమలు చేస్తున్నాము. భూ సేకరణ చట్టం 1894ను 2013 చట్టంగా మార్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దానికి సవరణగా 2017 చట్టం తెచ్చింది. ముఖ్యమంత్రి చెసిన హంగామాకు రెవెన్యూ కోడ్, రెవెన్యూ చట్టంలో మార్పులు తెస్తారని ఆశించారు. చివరకు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ కూడా నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయలేదు. సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి వీఆర్ఓ వరకు గల 7 అంచెల రెవెన్యూ శాఖను నేటి అవసరాలకు అనుగుణంగా కుదించాలి. అవినీతి రాష్ట్ర స్థాయి నుండే దిగువకు వస్తున్నది. పై వారి సూచనల మేరకే దిగువ స్థాయి కలిగిన వారు రికార్డులు మార్పు చేయడం ద్వారా అవినీతికి పాల్పడుతున్నారు. ఇవేవి మార్చాలని సీఎంకి తోచినట్టులేదు.
ఒక్క రిజిస్ట్రేషన్లో మార్పులు చేసినంత మాత్రాన రెవెన్యూ సమస్య పరిష్కారం కాదు. మార్పు చేసినదానిలో కూడా వారసత్వ పట్టాలకు చార్జీలు వసూళ్ళ చేయడం, రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టకపోవడం సరైన విధానం కాదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగు భూమిపై వాస్తవ సాగుదారులకు హక్కులు కల్పించడానికి అనుగుణంగా రెవెన్యూ చట్టంలో మార్పులు తెవాలి. 1786లో అంగ్లేయులు శిస్తుల వసూళ్ళ కోసం ఎర్పాటు చేసిన రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇతర బాధ్యతలు అప్పగించినప్పటికీ గత చట్టాలే అమలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసిన అంశాలపైననే అందుకు భిన్నంగా కేంద్రం చట్టాలు చేయడం జరిగింది. కేంద్రం చేసిన 2013 భూ సేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 సవరణ చట్టం తెచ్చింది. రాష్ట్ర జాబితాలో ఉన్న విత్తన చట్టం తేవడానికి రాష్ట్రం ఊగిసలాడుతున్నది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయిలో 'ధరల నిర్ణాయక కమిషన్' వేయాలి. కానీ నేటి చట్టాలను పరిశీలిస్తే ఏది రాష్ట్ర జాబితాలో ఉందో? ఏది కేంద్ర జిబితాలో ఉందో, ఏవి ఉమ్మడి జాబితాలో ఉన్నాయో అగమ్యగోచరంగా ఉంది. అక్రమార్కులకు ఉపయోగ పడేవిధంగా ప్రతి చట్టానికి 'బోక్కలు' ఉన్నాయి. భూ సంస్కరణల చట్టంతో పాటు చివరికి సివిల్ సప్లయి చట్టాల వరకు ఈ లోపాలు కనబడుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వమూ లోపాలను తోలగించే ప్రయత్నాలు చేయలేదు. తమ ప్రభుత్వంలోనే ఉన్న అలాంటి శక్తులను కాపాడడానికి పాత చట్టాలనే కోనసాగిస్తున్నారు. ధరణీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్లాగా అప్పడప్పడు కొన్ని చిన్న సవరణలకు విస్తృత ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత 70ఏండ్లలో జరిగిందే ప్రస్తుతం జరుగుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం 96శాతం సర్వే పూర్తి చేశానని ఇప్పటికి అనేక సార్లు ప్రకటించింది. కానీ కేసులు మాత్రం రెవెన్యూ కోర్టులో పెరుగుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరాశ నిస్పృహలకు గురై ప్రజలు ఆత్మత్యాగాలకు సిద్దపడుతున్నారు. భూసంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా భూ సేకరణలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల చట్టం, దేవాలయ భూముల చట్టం, వక్ఫ్ చట్టం, ధనవంతులకు పాదాక్రాంతమైంది. చివరకు ఇరిగేషన్ వనరులను కూడా ప్రయివేట్ అస్తులుగా పరిగణిస్తున్నారు. మారిన నేటి పరిస్థితులలో అందరూ ఫామ్హౌజ్ల ఏర్పాటుపై దృష్టిపెట్టి భూముల అక్రమ సేకరణ గావించారు. చెరువులనూ కాజేశారు. అందువల్ల మొత్తం రెవెన్యూ చట్టాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయాలి. గతంలో చేసిన భూభారతి విఫలమైంది. మ్యానువల్గానే భూ సర్వే రానున్న నాలుగు మాసాల్లో పూర్తి చేయాలి. భూ సర్వేకు ముందు సర్వే నిబంధనలను చట్టంలో పొందుపర్చాలి. ఇప్పటికి ప్రభుత్వ భూములు వందల ఎకరాలు ఆక్రమించిన వారిపై నిర్థిష్టమైన చర్యలు చేపట్టాలి. పారెస్టు, రెవెన్యూ భూముల మధ్య సరిహద్దు సమస్యను జాయింట్ సర్వే ద్వారా పరిష్కరించాలి. పారెస్ట్ చట్టాలను పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే రెవెన్యూ చట్టం ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఒకేఒక్క పాస్పుస్తకాల చట్ట సవరణ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావు. దీనిని ప్రభుత్వం, నిపుణులు గుర్తించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
సెల్:94900980666