Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన కిష్టమైన వంకాయ కూరను అద్భుతంగా వండి వార్చిన భార్యామణిని మనసులోనే తల్చుకుంటూ ''వంకాయ వంటి కూరయు పంకజ ముఖి వంటి భార్యము'' అంటూ లొల్లాయి పదాల్ని సన్నగా పైకి పాడుకుంటూ భుజాన వేలాడే సంచిని సవరించుకుని రెండు చేతుల్తో గోష్పాదమంతటి పిలకను ముడేసుకుంటూ బళ్లోకెంటరైన కుటుంబ్రావ్కి హెడ్మిస్ట్రెస్ తాయారమ్మ ఎదురొచ్చి ''అబ్బ! ఒక్క టెల్గు డిపార్ట్మెంటే మిస్యయిపోయిందేమో అనుకుంటున్నా, మీరూ వచ్చేశారు, ఆల్ హ్యాపీస్!'' అనేసరికి కుటుంబ్రావ్ మనసులోనే ''ఆఁ! ఇంతోటి బడికి డిపార్ట్మెంటేమిటి నా పిండాకూడు!'' అనుకుంటూ పైకి కొద్దిగా నవ్వి ''విశేషమేంటమ్మా? మనబడికి ఈ సూటు, బూట్లేసుకున్న కుర్ర వెధవలొచ్చారేంటీ? అన్నాడు తాయారమ్మగారితో.
''ష్! వాళ్ళూ టెల్గువాళ్ళేనండి! వాళ్ళకీ టెల్గొచ్చు! ఆ చామన్చాయవాడు పదిహేనేళ్ళ క్రితం మన బళ్ళోనే చదివాట్ట! పైగా మీ శిష్యుడేనట!'' అన్నది హెడ్ మిస్ట్రెస్గారు. ఆమె కాన్వెంట్ భాషకు తెలుగును కూడా ఖూనీ చేయగల శక్తి ఉన్నందుకు ఒకింత బాధున్నా తనకు తానే సర్దిచెప్పుకున్నాడు కుటుంబ్రావ్! ఇంతలో సదరు కుర్ర ''వెధవ''లిద్దరూ లేచి నిలబడి నడుముదాకా వంగి నమస్కారం చేశారు కుటుంబ్రావ్కి! వాస్కోడగామాతో మనదేశంలో ప్రవేశించిన బుడత కీచుల (పోర్చగీస్ అనే మాటనే ఇలా బుడత కీచులుగా పలకమని సరస్వతీదేవి మనవారి నాల్కలపై రాసిందని తను బి.ఎ. చదివే రోజుల నుంచి నమ్మేవాడు) నుంచి ఈస్టిండియా కంపెనీ వారి దాకా వంగి మన రాజులకు, రాణులకు నమస్కరించిన తీరు గుర్తొచ్చింది కుటుంబ్రావ్కి.
అప్పటికే పిల్లల తల్లిదండ్రులంతా ఒకర్తో ఒకరు మాట్లాడుకుంటూ గోల గోలగా ఉంది అక్కడ. సరస్వతీదేవి విగ్రహం ముందున్న గ్రౌండ్ అంతా నిండిపోయింది. స్టేజిమీద తాయారమ్మతో పాటు తనను కూడ కూచోబెట్టినందుకు గర్వంగా ఉంది కుటుంబ్రావ్కి.
హెడ్ మిస్ట్రెస్ మైక్ తీసు కుని ''ఈ ఇద్దరూ టెల్గువాళ్ళు కావడం మన అదృష్టం. (అంతేనో లేకుంటే ద్విభాషా ప్రవీణ కుటుంబ్రావ్గారి అనువాదం తప్పిందన్న ఆనందమో!) ఒకరు ''విన్స్టన్ చర్చిల్ Ê టోజో హిడెకి'' (విటో) అనే ఇంగ్లండ్, జపాన్ల సంయుక్త బహుళజాతి కంపెనీ ప్రతినిధి. రెండవవాడు మనదేశానికే చెందిన, పైగా మన ఊరికే చెందిన మన మాజీ విద్యార్థి 'ఎంపరర్ అశోక Ê సన్స్' అనే కంపెనీ ప్రతినిధి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల్ని మనం, అంటే మీరు ఎలా పెంచాలో వీరు మనకు వివరిస్తారు. మీరంతా ఎక్కువ ఓట్లేసిన కంపెనీనే మీ పిల్లలకు, ఒకరకంగా 'ఒకేషనల్' ట్రెయినింగ్ లాంటిదనుకోండి, కోచింగ్ ఇవ్వడానికి ఎంపిక చేస్తాం. అఫ్కోర్స్! మీరెమీ అదనంగా ఫీజు చెల్లించక్కర్లేదనుకోండి! అన్నది తాయారమ్మగారు ఫీజు లేదన్నందుకు వెంటనే ఆ మధ్య తరగతి జీవాలన్నీ హర్షధ్వానాలు చేశారు. ''ముందు మన ప్రధాని చెప్పినట్లు ''ఇండియా ఫస్ట్'' అనగానే 'ఎంపరర్ అశోక Ê సన్స్' ప్రతినిధి లేచాడు. మాజీ గురువుగారికో నమస్కార బాణం పడేసి, గొంతు సవరించుకుని భారతీయ విలువ గురించి, తోటివారియెడల సహానుభూతి ఎలా తెల్పాలో, దయాగుణం ఎలా అలవర్చుకోవాలో చెప్పాడు. పైగా వాడు ప్రారంభించడమే సమానత్వం, చట్టం ముందు అందరూ సమానులే లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పాడు. తానూ దీపక్మిశ్రా స్థానంలో ఉండి ఉంటే ధిక్కారనేరం కింద ఒక రూపాయి ఫైన్ వేసేవాడ్ననుకున్నాడు కుటుంబ్రావ్. అక్కడితో ఆపి ఉంటే బాగుండేది. ''పిల్లల్లో ప్రశ్నించే తత్వం నేర్పాల''న్నాడు. ప్రభుత్వం నుండి గాని, నాగపూర్ నుంచి కాని వచ్చే వాటిని వచ్చింది వచ్చినట్లు వాట్సాప్ల్లో ఫేస్బుక్కుల్లో ఫార్వార్డ్ చేయకూడదట! గుండు గుత్తగా పిల్లలందర్నీ ''రాజద్రోహ'' నేరానికి పురికొల్పేవాడ్ని కొరత వేయాల్సిందే ననుకున్నాడు మనసులో. తల్లితండ్రులు కూడ ''ఇక చాలు కూచో''! అని గోడవ చేసేసరికి బిక్కచచ్చి కుక్కిన పేనై కూలబడ్డాడు 'అశోకుడి' కంపెనీ ప్రతినిధి.
ఇక 'విటో' ప్రతినిధి లేచి పవర్పాయింట్ ప్రెజంటేషన్ మొదలు పెట్టాడు. ఎంఎన్సీనా? మజాకానా? అనుకున్నాడు కుటుంబ్రావ్ మనసులో. వీడు ప్రారంభించడమే ''మీ పిల్లల్లో ద్వేషించడం నేర్పాల''న్నాడు. ''ద్వేషించడం నేర్చుకున్న పిల్లలు తమ అంతరాంతరాల్లో నిక్షిప్తమైన శక్తులను బయటికి తీయ్యగలరని'' వివరించాడు. కావాలంటే కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వెర్మ వంటి వారంతా మా సంస్థలో శిక్షణ పొందినవారే. మీ పిల్లల్లో ద్వేషభావాల్ని నింపితే, కనీసం ఆ వాతావరణంలో పెంచితే భవిష్యత్తంతా మీ పిల్లలదే'' అన్నాడు. ''ఇక రెండవది అబద్ధాలాడటం. ధర్మరాజు నిజాలు మాత్రమే చెప్పాడనడానికి నాకు తెల్సి భారతంలో కూడా పెద్ద ప్రూఫులేమీలేవు. అబద్ధానికి మాత్రం పెద్ద ప్రూఫే ఉంది. అది మనందరికి తెల్సిందే. మీరు టీవీల్లో చూసే యాడ్స్ పచ్చి అబద్ధం. ఫెయిర్ Ê లౌలీ పూసుకుంటేనో, లక్స్ సబ్బు రుద్దుకుంటేనో అందంగా ఒక్క మనిషి అయినట్లు రుజువు చేస్తే ఇన్ని లక్షల శాలరీ వచ్చే ఉద్యోగం నేను వదిలేస్తాను. మీరు పత్రికల్లో చదివే ఆరు వాక్యాల్లో ఐదు వాక్యాలు అబద్ధాలు. ఈ అబద్ధాల మార్కెట్ మనదేశంలో ఇతర దేశాల కంటే బాగా విస్తరిస్తోంది. మన ప్రధాని నిజంగా భారత ప్రజలకు 20లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చారను కున్నారా?'' శ్రోతల రెస్పాన్స్ కోసం ఇటు, అటు 'విటో' ప్రతినిధి చూసేసరికి జనం 'అబద్ధాలు వర్థిల్లాలి!'' అంటూ స్లోగన్స్ ఇచ్చారు. సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు 'విటో' ప్రతినిధి.
''నేటి సమాజంలో మీ పిల్లలు బాగా ముందుకు పోవాలంటే చిన్ననాటి నుంచే ఇతరులను దగా చేయడం, మోసం చేయడం నేర్చుకోవాలి. టీచర్లందరూ నన్ను క్షమించాలి'' అని టీచర్ల వైపు ఓ లుక్కిచ్చి ''టీచర్లను మోసం చేయడం నేర్చుకుంటే ప్రపంచంలో ఎవర్నైనా మోసం చేయొచ్చు'' అనగానే టీచర్లు తాము యమ స్ట్రిక్ట్గా ఉంటామని వీడుకూడా చెప్పినందుకు ఒకరి నొకరు అభినందన పూర్వకంగా చూసుకున్నారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్నే మోసం చేసి నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ, విజరుమాల్యా, లలిత్ మోడీ హాయిగా విదేశాల్లో విహరించడం లేదా? ప్రభుత్వానికి తెలిసే వారు విదేశీ విహార యాత్రలో ఉంటే ప్రభుత్వమే 130కోట్ల మందిని మోసం చేసినట్టు కాదా? చతుష్షష్టి (64) కళల్లోనే మోసం / దగాలు లేవు. కాసేపు ఆపి మంచినీళ్ళు తాగాడు శ్రోతలేమైనా దిగులు పడ్డారేమో ననుకుని 'విటో' ప్రతినిధి ''అయినా ఫర్వాలేదు మీ పిల్లల్ని ''వరల్డ్ క్లాస్ చీట్స్''గా తయారుచేసే బాధ్యత మాది'' అని భరోసా ఇచ్చాడు.
''ఇక నాల్గవది. ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైనది. అత్యంత కీలకమైనదీను. ఇది కొద్దిగా వివాదాస్పదంగా కనపడ్డా వాస్తవమైనది. మీ పిల్లలకు చిన్నప్పట్నించి గుండాగిరీ నేర్పడం. అంబానీ, అదానీలిద్దరూ పోటీ పడబట్టికాని, లేకపోతే ఈపాటికి దీనికోసం ఒక విశ్వవిద్యాలయమే నర్మదా నదీ తీరంలో వెలిసుండేది. ఇంతకు ముందు చెప్పిన వాటికిది ఇంటర్ కనెక్టెడ్, అంటే అంతః సంబంధం కలది. అప్పుడప్పుడూ ఆత్మరక్షణ కిది ఉపయోగపడ్డా ప్రధానంగా శత్రు సంహారానికి, అంటే భారత ప్రభుత్వం ఎవరెవర్ని దుర్మార్గులుగా ప్రకటిస్తుందో వారందరినీ దునుమాడటం! అంటే గతంలో బుష్ మహాశయుడు ప్రపంచ భవిష్యత్ విధాతగా వున్న రోజుల్లో కొన్ని దేశాల్ని ''రోగ్స్టేట్స్'' అని నామకరణం చేసినట్టన్నమాట! చిన్నప్పట్నించి దీన్లో శిక్షణ పొందిన మీ పిల్లలు పెద్దయ్యేసరికి రాటుదేలిన గుండాలుగా రూపుదిద్దు కుంటారు. ఇది మగ పిల్లలకే పరిమితమైన శిక్షణ కాదు. దీనికి పురాణాల్లోని నారీమణుల గురించో, చరిత్రలోని రాణీమణుల గురించో అవసరం లేదు. మన కండ్ల ముందున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లాంటి వీర వనిత లెందరికో జన్మనిచ్చిన కర్మభూమి మనది.''
''ఇక చివరి అంశం. ఇది లేకపోతే మిగతా వన్నీ వేస్టే! అధికారానికి అంటకాగటం కీలకం. ఈ నేర్పుంటే మీ పిల్లవాడు గర్భవతుల కడుపులు చీరి పిండాల్ని గాల్లో కెగరేయగలడు. కొన్ని మతాల మహిళల్ని మానభంగం చేసినా, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసినా పైనుంచి గృహ మంత్రిత్వశాఖ కాపాడుతూంటుంది. దీన్నే ''ధర్మో రక్షతి రక్షితః'' అంటారు. అంటే ప్రస్తుత యుగధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది'' అంటూ ముగించాడు విటో ప్రతినిధి.
తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పేరెంట్సందరూ ఈ కంపెనీనే ఎంపిక చేసుకున్నారు. కుటుంబ్రావ్ సంతృప్తిగా వేదికదిగి ఇల్లు చేరుకున్నాడు.
- శ్రామిక్