Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తినేని సెప్టెంబర్ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన మాట చరిత్ర చెప్పే వాస్తవం.
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. దేశంలో ఉన్న 565 సంస్థానాలలో 562 భారత్లో విలీనమయ్యాయి. హైదరాబాద్, కాశ్మీర్, జనాగడ్ విలీనం కాలేదు. నైజాం నవాబు అజాద్ హైదరాబాద్గా ఒక స్వతంత్ర దేశంగానే ఉంటుందన్నాడు.
దేశమంతా ఆనందోత్సాహాలతో స్వాతంత్య్ర సంబరంలో మునిగి తేలుతుంటే నైజాం ప్రాంతంలో ఆ ఊసేలేదు. పైగా నైజాం ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా ఈ రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు రఫీ అహ్మద్ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్బజార్లో కాంగ్రెస్ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజిలానీ గౌర్ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ప్రజలలో స్వాతంత్య్ర ఆకాంక్షలు రోజు, రోజుకు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఎగ్రిమెంట్) 1947 నవంబర్ 29న చేసుకుంది. నైజాం ఈ ఒప్పందం ఎందుకు చేసుకొన్నాడు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి భారత ప్రభుత్వం యూనియన్లో కల్సిపోవల్సిందిగా ఒత్తిడి. రెండోవైపు కింద కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాయుధపోరాట ఒత్తిడి బాగా ఉంది.
కమ్యూనిస్టులకు నైజాంకు తగువేంటి? కమ్యూనిస్టులు పేదల తరపున పని చేస్తున్నారు. నైజాం భూస్వాములకు వాళ్ళ దోపిడీ, దౌర్జన్యాలకు అండగా ఉంటున్నాడు. భూస్వాములకు, దేశ్ముఖ్లకు, వేల ఎకరాల భూమి కట్టబెట్టాడు. కొంతమందికి లక్షల ఎకరాల భూమి. ఒక్క నైజాం కిందనే 55లక్షల ఎకరాల భూమి ఉంది. దీనినే సర్ఫేఖాస్ అంటారు. ఇది మొత్తం భూమిలో 40శాతం. కల్లూరు జమిందారు రాఘవరావుకు లక్ష, జన్నారం ప్రతాపరెడ్డికి లక్షన్నర, విస్నూరు రామచంద్రారెడ్డికి 45వేల ఎకరాలు ఇలా వేలు-లక్షల ఎకరాల భూమి కేంద్రీకృతం అయిపొయింది. దీనికి తోడు వెట్టి చాకిరీ.
ఆ సమయంలో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ రెండు నినాదాలు తీసుకొన్నాయి. దున్నేవానికే భూమి కావాలి, వెట్టి చాకిరీ రద్దు కావాలి. వాటి అమలుకోసం పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో తొట్టతొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. 1946 జులై 4న విస్నూరు దేశ్ముఖ్ గుండాల దాడిలో బలైపోయాడు. ఆయన మరణంతో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకొంది. హైదరాబాద్ పారిపోతున్న దేశ్ముఖ్ కొడుకు బాపురెడ్డిని జనగామ రైల్వే స్టేషన్లోనే చంపేశారు. ప్రజల ప్రతిఘటన 400 గ్రామాలకు విస్తరించింది. ఆ ప్రజల పోరాట పటిమను గమనించిన కమ్యూనిస్టుపార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధపోరాటానికి పిలుపు ఇచ్చింది. రాళ్ళు, వడిసెలలు, కర్రలు, కత్తులతోపాటు, తుపాకులు, రైఫిళ్ళు కూడా చేరాయి. ప్రజల మద్దతు బ్రహ్మాండంగా లభించింది. ఆ ప్రజాపోరాటం ఉధృతంగా సాగింది. భూస్వాముల గడీలు ఒకటొకటి బద్దలవుతున్నాయి. విముక్తయ్యే గ్రామాల సంఖ్య వేలల్లోకి చేరింది. లక్షల ఎకరాల భూములు పంచబడుతున్నాయి. వెట్టి రూపమాపబడుతున్నది.
కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డి ఢిల్లీ పొయ్యారు. అక్కడ నెహ్రూ, పటేల్ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏజంటు కె యం మున్షీ (సర్దార్ పటేల్కు ఏజంట్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇక్కడ ఉన్నాడు) ని వివరాలు కోరారు.
ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పాడు. నల్గొండ, వరంగల్ (ఆనాడు ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలోనే ఉంది.) జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు సైన్యాలుగానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదు. అందుకే మనం వెంటనే మొదలు పెట్టాలి సైనికచర్య అనుకొన్నారు. దానికే ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. జనరల్ జెయన్ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్ క్లోజ్ అయింది.
నైజాం నవాబు లొంగిపోయాడు. ఆయన ఆస్తులు ఆయనకు వదిలేశారు. ఆయనను రాజ్ప్రముఖ్ (ఇప్పటి గవర్నర్)ను చేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. 850కోట్ల విలువ చేసే రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడి (ముల్లాత్ కాడింగ్ వెల్లోడి)ని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.
అలా సంస్థానం విలీనమైన తరువాత యూనియన్ సైన్యాలు తిరిగి పోవాలి కదా? కానీ పోలేదు. పోకుండా ఏమి చేశాయి. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని, పంచిపెట్టబడిన భూములను తిరిగి భూస్వాములకు అప్పచెప్పటం మొదలు పెట్టాయి. ఆ భూములను రక్షించుకొనేందుకే ఆ తరువాత తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. 3రోజులలో నైజాంను లొంగతీసుకొన్నానని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం, యూనియన్ సైన్యాలు ఆ పోరాటాన్ని మూడేండ్ల దాకా ఏమీ చెయ్యలేక పొయ్యాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి భూసంస్కరణల చట్టం ద్వారా పేదల స్వాధీనంలో ఉన్న భూములపై వారికే హక్కు కల్పిస్తామని, చట్టపరంగా ఈ రక్షణలుంటాయని, రక్షిత కౌలుదారీ చట్టం 38(ఇ) తెచ్చింది. అప్పుడు కమ్యూనిస్టుపార్టీ 1951 అక్టోబర్ 21న సాయుధపోరాటం విరమించినట్టు ప్రకటించింది.
ఈ చరిత్రలో లేదా పోరాటంలో బీజేపీకి చెందిన వారిపూర్వనాయకులు జనసంఫ్ు నేతలకు ఏమన్నా పాత్ర ఉందా? ఆరెస్సెస్కు ఏమన్నా పాత్ర ఉందా? ఏమీ లేదు. మరెందుకు ఇప్పుడు వీరంతా విమోచనా దినోత్సవం జరుపాలి అంటున్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు. ఇది ప్రజలు ఆలోచించాలి. దీనిని తమ విభజన రాజకీయాలకు వాడుకోవాలని వారు చూస్తున్నారు. నైజాం ముస్లిం పాలకుడనీ, హిందూ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడనీ, ఇది ముస్లిం రాజుపై హిందూ ప్రజలు సాధించిన విజయంగా సంబరాలు జరపాలనీ అంటున్నారు. ఇది నిజమా?
ఎవరు ప్రజలతో వెట్టి చేయించుకున్నారు? జమిందారులు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీలు కాదా? వాళ్ళు హిందువులా-ముస్లింలా? కొమరయ్యను చంపిన విస్నూరు దేశ్ముఖ్ హిందువా-ముస్లిమా? లక్షల ఎకరాల భూములను పోగేసుకొన్న కల్లూరు దేశముఖ్, జన్నారం ప్రతాపరెడ్డి హిందువులా-ముస్లిములా? అంతేకాదు. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వేలమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు కదా? ముఖ్యమైన పాత్ర నిర్వహించారు కదా? హిందూ, ముస్లిం పోరాటమైతే వాళ్ళెందుకు పాల్గొన్నారు? బందగీ ఎందుకు చంపబడ్డాడు? షోయబుల్లా ఖాన్ చేతులు నైజాం గుండాలు ఎందుకు నరికేశారు? నిజాం కాలేజీలో హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు రఫీ అహ్మద్ జాతీయ జెండా ఎందుకు ఎగరేశాడు? నైజాం పాలనకు వ్యతిరేకంగా ముగ్దుం మోహియుద్దీన్ ప్రజలను ఎందుకు సమీకరించాడు? జువాద్ రజ్వీ నాయకత్వంలో 1939లోనే ఏర్పాటయిన ''కామ్రేడ్స్ అసోసియేషన్'' నైజాంకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేసింది?
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆనాడు నైజాం నవాబు కానీ, రజాకారు సైన్యాధిపతి ఖాసిం రజ్వీ కానీ ముస్లింలందరినీ మతం పేరుతో తమవైపు తిప్పుకోవాలని చూసినమాట నిజం. ఎప్పుడయినా పాలకవర్గాలకు తమ ఆధిపత్యం అంతమవుతుందంటే, ఏ రూపంలో అయినా నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తాయి. అందులో భాగమే ఆ విభజన ఆలోచన. అమన్ మాలిక్ (నేనే యజమాని లేదా రాజు) అనే నినాదాన్ని తీసుకు వచ్చారు. కానీ ముస్లిం ప్రజానీకం అంతా దాన్ని స్వీకరించలేదు.కొందరు యువకులు ఆకర్షించబడి ఉండవచ్చు గాక. కానీ పేద ముస్లిం ప్రజానీకం ఈ ఆలోచనను స్వీకరించలేదు. అందుకే రజాకారు సైన్యాలలో హిందూ దోపిడీదారులను కూడా చేర్చుకొన్నారు. విసునూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి రజాకార్గా ఉండి కమ్యూనిస్టుల చేత చంపబడ్డాడు. అలానే బి ధర్మారెడ్డి కూడా కమ్యూనిస్టుల చేతిలో హతమైన వాడే. ఇతనూ రజాకార్గా చేరినవాడే. కానీ ఈ రజాకార్ పోరాటమంతా భూస్వామ్యాన్ని రక్షించటానికే. భూస్వాములు, జమిందారులలో 98శాతం హిందువులే.
అందుకే ఇది భూస్వాములకు - కౌలు రైతులకూ, భూస్వాములకూ-పేద రైతులకూ, భూస్వాములకూ-వ్యవసాయ కూలీలకూ మధ్య జరిగిన పోరాటం. వర్గపోరాటం. మతపోరాటం కాదు. ఆ భూస్వాములకు అండగా నైజాం నవాబు ఉన్నాడు. సర్దార్ పటేలూ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళూ ఉన్నారు. టీఆర్యస్ కూడా ఉంది. అందుకే ఆనాడు నవాబు లొంగిపోయాకకూడా సైన్యం వెళ్ళలేదు. నవాబు తన పాలనలో 1500మందిని చంపితే, యూనియన్ సైన్యాలు భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన 2500మంది కమ్యూనిస్టు యోధులను చంపేశాయి.
ఇప్పుడు బీజేపీ కూడా ఆ భూస్వాములు బడా కార్పొరేట్ శక్తుల కోసమే తాపత్రయ పడుతున్నది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, 35ఎ రద్దు అందులో భాగమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో దేశసంపదను, భూమిని, గనులను కార్పొరేట్లకు కట్టబెట్టడం కూడా అందులో భాగమే. తెలంగాణలో సెప్టెంబర్ 17 పేరుతో రాద్ధాంతం చేసేది ఆ చర్యలను మరింత వేగవంతం చేయటానికీ, తెలంగాణలో కూడా తగినంత బలాన్ని సమీకరించుకొనే దురుద్దేశంతోనే తప్ప మరొకటి కాదు. దీనికి తోడు ఇప్పుడు కరోనా నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి, నిరుద్యోగం నుంచీ, ప్రజల దృష్టి మళ్ళించాలి. జీడీపీ మైనస్ 24శాతానికి పడిపోయింది. ఇది చర్చకు రాకుండా చేయాలి. అంటే ఏమి చేయాలి. దేశంలో ఇలాంటి వివాదాలు ఎక్క డెక్క డున్నాయో వెతికి, వెతికి వాటిపై గొడవ చేయడమే బీజేపీ పని.
అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి. మన బాధలను పట్టించుకోకుండా, మతం పేరుతో చిచ్చులు పెట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే బీజేపీ చర్యలను ఎండగట్టాలి. ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకు పాల్పడిన నాటి భూస్వాములు, జమిందారులు, జాగీర్దాలను ఎదిరించి తమ ప్రాణాలను, ఆస్థులను, కుటుంబాలను త్యాగం చేసి భారత విప్లవోద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయే పోరాట అమరవీరుల ఆశయసాధనకు ఉద్యమించినప్పుడు మాత్రమే మన బాధలు తీరతాయనే విషయాన్ని గుర్తించాలి. ఆ అమరవీరులను స్మరించు కోవాలి. వారు చూపిన బాటలో సాగాలి. ఇదే నేటి కర్తవ్యం.
- పోతినేని సుదర్శన్రావు