Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశం గర్వించ దగిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15, 1861న జన్మించారు. వీరు పండితుడు, రాజనీతజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుంచి 1918 వరకు దివానుగా పనిచేశాడు. భారతదేశంలో అతని జన్మదినమైన సెప్టెంబరు 15ను ''ఇంజనీర్స్ డే''గా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కష్ణరాజసాగర్కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. అతను తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశంజిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు. విశ్వేశ్వరయ్యకు 12ఏండ్ల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూర్లో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ., తరువాత పూణె సైన్సు కాలేజి నుంచి సివిల్ ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు.
పూణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1903లో మొదటిసారిగా దీనిని పూణె దగ్గరి ఖడక్వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.
1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్లోని ఆడెన్కి పంపించి అక్కడ నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది.
హైదరాబాదు నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, అతనికి గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా అతని పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకూ అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.
1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివద్ధికి కృషి చేసాడు.
1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కాలేజికి అతని పేరే పెట్టడం జరిగింది. ఈనాటికీ ఈ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కర్నాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతను పాత్ర ఉంది. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్గట్టి నిర్మాణానికీ డిజైన్ను అందించాడు.
1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితుడయ్యాడు. 1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకుగాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదునుఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1955లో భారత దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు.
లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ బెంగళూరులోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ అతనికి గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు అతనిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు. వీరు ఏప్రిల్ 12, 1962న మరణించారు. నేటి ఇంజనీరింగు విద్యార్థులు, ఇంజనీర్లు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జయంతిని సామాజిక దూరం పాటిస్తూనే జరుపుకొవాలి. వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
- కె. సతీష్రెడ్డి
సెల్:9848445134