Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది భూమికోసం.. భుక్తికోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం. ఆ పోరాటం పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు స్థాపించింది. ఈ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా వీరులు అమరులయ్యారు. ఈ సాయుధ పోరులో సామాన్యులే బంధూకులు పట్టి 13వేలమంది ప్రత్యక్ష పోరాటం చేశారు. పదివేల మందికి పైగా కొన్ని సంవత్సరాల పాటు జైళ్లలో నిర్బంధాలకు గురయ్యారు. పోలీస్, రజాకార్, యూనియన్ సైన్యాల చేతిలో 50వేలమంది అనేక అకృత్యాలకు, అమానుషాలకు గురయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం అమోఘమైన విజయాలను, అనుభవాలను అందించింది. నేటికీ స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంది. 73వ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 10 నుంచి 17 వరకూ జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఆనాటి వీరుల త్యాగాలను, చరిత్రను అవలోకనం చేసుకుందాం. నూతన కర్తవ్యాలతో ముందుకు సాగుదాం.
భారతదేశంలో 662 సంస్థానాలలో నైజాం సంస్థానం విలక్షణమైనది. నిజాం బ్రిటిష్కు సామంతుడిగా ఉండేవాడు. నియంత పాలన కొనసాగింది. ప్రజలను పీడించి బ్రిటిష్ దొరలకు నజరానాలు ఇచ్చేవాడు. నిజాం వంశీయులు 200ఏండ్లు పాలన సాగించారు. చివరి పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పాషా 1911లో గద్దెనెక్కాడు. 1948 వరకు పాలించాడు. ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్నుడు నిజాం. ప్రజలను పీల్చి పిప్పిచేసి ధనాన్ని మూట గట్టేవాడు. నిజాం ఎస్టేట్లో దేశముఖ్లు, పాండేలు, జాగీర్దార్లు, జమిందారులు, అమీన్లు, భూస్వాములు, దొరలదే రాజ్యం. నిజాం దోపిడీకి వీళ్లే మూల స్తంభాలు. ప్రజలు కేవలం వెట్టి చేసే బానిసలు. విపరీతమైన పన్నులు వేసేవారు. లేవి గల్లా పేరుతో రైతులను పీడించి భూములను బలవంతంగా గుంజుకునే వాళ్ళు. నిజాంకు 5కోట్ల 30లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఇందులో 3కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి. దీనిపై శిస్తు ఉండదు. ఇది ఖల్సా లేదా దివానీ ప్రాంతంగా పిలువబడేది. కోటిన్నర ఎకరాలు జాగీర్దారీ వ్యవస్థ కింద ఉండేవి. పదిశాతం భూమి నిజాం సొంత కమతం కింద ఉండేది. దీనిని సపెఖాస్ అనేవారు. దీనిపై వచ్చే ఆదాయం నిజాం కుటుంబం అయన పరివారానికి వాడేవారు. ఇది కాకుండా ఆ రోజుల్లోనే రూ.70లక్షలు సంస్థానం ఖజానా నుంచి చెల్లించేవారు. సర్పెఖాస్ ప్రాంతాల గ్రామాల ప్రజలు నిజాంకు కట్టు బానిసలుగా ఉండేవారు. వారి నియంతృత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండేది కాదు. ప్రశ్నిస్తే రాజదండన తప్పదు. సంస్థానంలో ప్రజలందరూ హీనంగా, దీనంగా కట్టుబానిసలుగా జీవితాలు వెళ్లదీసే పరిస్థితి ఉండేది. ఇది నాటి నైజాం కాలపు దోపిడీ విధానం కొనసాగిన తీరు.
తెలంగాణలో నైజాం కాలంలో 1942లో నిర్వహించిన సర్వే ప్రకారం 3668మంది దేశముఖ్లు, దేశ్ పాండేలు ఉండేవారు. వారి కింద మక్తెదార్, బంజర్దార్, ఇజరదార్లు ఉండేవారు. వారిలో జనగామ తాలూకాలో విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రరెడ్డి ఒక్కడే 60వేల ఎకరాల భూస్వామి. అయినా అతని భూదాహం తీరలేదు. పేదల భూములను గుంజుకోవడం వదలలేదు. ఆయన కొడుకు బాబు దొర, దేశ్ముఖ్ తల్లి జానకమ్మ తాను పోషించిన గూండాల చేత పేద ప్రజలను పీడించడంలో ఆరితేరిన వాళ్ళు. విస్నూరు రామచంద్రరెడ్డి వద్ద బందగీ సోదరుడు అబ్బాస్అలీ ఉండేవాడు. బందగీ భూమిని గుంజుకొమ్మని దొర ప్రోత్సహించాడు. బందగీ ఎదురుతిరిగాడు. అబ్బాస్అలీ చేత కోర్టులో దావా వేయించాడు. మూడేండ్లు నడిచింది. బందగీ గెలిచాడు. దీన్ని అవమానంగా దొర భావించాడు. బందగీని తన గూండాల చేత హత్య చేయించాడు. అప్పటికి బందగి వయసు 22ఏండ్లు మాత్రమే. ఎక్కడ హత్య చేయబడ్డాడో... అక్కడే అతని సమాధిని నిర్మించారు. బందగీ భూపోరాటం ఆధారంగానే సుంకరి 'మాభూమి' నాటకాన్ని రాశారు. వందల ప్రదర్శనలిచ్చారు. తెలంగాణలో గ్రామ గ్రామాన 'మా భూమి' నాటకం ప్రజలను చైతన్యవంతం చేసింది. దొరలపై పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది. విస్నూరు గడి నుంచే సాయుధ పోరాటం మొదలవటానికి అగ్గి రాజుకుంది. చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుతో అది మొదలైంది. పాలకుర్తిలో ఐలమ్మ భూములను గుంజుకోవటానికి, పొలంలో పండిన ధాన్యం గడికి తరలించటానికి విస్నూరు గూండాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భీమిరెడ్డి నరసింహారెడ్డి అండతో ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ చైతన్యవంతంగా ప్రజలను ఏకంచేసి దొర గూండా లను తిప్పికొట్టింది. తెలంగాణలో ఐలమ్మ పోరాటం గ్రామగ్రామానికి పాకింది. మట్టి మనుషులను మహావీరులను చేసింది. జమీందారు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రమయ్యాయి. 1946 జూలై 4న కడవెండి గ్రామంలో ప్రజలు ఊరేగింపు జరిపారు. ఇది సహించలేని జానకమ్మ తనవద్ద ఉన్న 200మంది గుండాలచే ఊరేగింపుపై దాడి చేయించింది. కాల్పులు జరిపించింది. కాల్పులలో ముందు భాగంలో ఉన్న దొడ్డి కొమరయ్య అమరత్వం పొందాడు. కొమరయ్య బలిదానం ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. సహించలేని నిజాం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాడు. గ్రామాల్లో సైనిక శిబిరాలను ఏర్పాటు చేయించాడు. ఇదే సాయుధ ప్రతిఘటనా పోరాటానికి దారి తీసింది.
తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటు తొలిదశలో అమోఘమైన విజయాలను సాధించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలలో పోరాటాలు ఉధృతమయ్యాయి. 16వేల చదరపు మైళ్ల వరకూ పోరాటాలు విస్తరించాయి. 30లక్షల జనాభా, మూడు వేల గ్రామాల్లో రైతాంగ పోరాటాలు సాగించింది. 10లక్షల ఎకరాల భూపంపిణీ జరిగింది. దొరలు, భూస్వాములు గడీలను వదిలి పట్టణాలకు పారిపోయారు. వెట్టిచాకిరి రద్దయ్యింది. ఈ పోరాటం అసఫ్ జాహీ వంశపు మధ్యయుగాల నాటి నిరంకుశ పాలనను పునాదులతో కుదిపివేసింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునివ్వగా అది 1951 వరకూ కొనసాగింది. ఈ పోరాటం విజయం సాధిస్తే అది దేశమంతటికీ వ్యాపిస్తుందని గ్రహించి నాటి నెహ్రూ ప్రభుత్వం బెంబేలెత్తింది. అందుకే 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకూ భారత ప్రభుత్వం నిజాం సంస్థానంపై పెద్ద ఎత్తున సైనిక చర్య జరిపింది. కొన్ని వందల గంటల్లోనే నిజాం లొంగుబాటుతో అధికార మార్పిడి జరిగింది. దాంతో అసఫ్ జాహీల 200ఏండ్ల పాలన ముగిసింది. అధికార మార్పిడితో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్లో మిలటరీ పరిపాలన కిందకు వచ్చింది. కానీ నెహ్రూ ప్రభుత్వం అంతటితో ఆగక కమ్యూనిస్టులను వేటాడటం మొదలు పెట్టింది. యూనియన్ సైన్యాలతో భూస్వాములు గ్రామాల్లోకి ప్రవేశించి పేద రైతుల నుంచి భూములను తిరిగి లాక్కోవడం, ప్రజల ప్రాణమానాలను దోచుకోవడం, కమ్యూనిస్టుల జాడలు చెప్పమని మహిళలపై అనేక ఆకృత్యాలకు పాల్పడుతూ తీవ్రమైన నిర్బంధాలకు గురి చేశారు. అయినా ప్రజలు నాయకుల జాడలు చెప్పలేదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా మూడేండ్ల పాటు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాయుధ గెరిల్లా పోరు సాగించారు. ఆనాటి కేంద్ర హౌంమంత్రి సర్దార్ వల్లభారుపటేల్ రెండు వారాల్లో కమ్యూనిస్టులను అణిచివేస్తామని ప్రకటించారు. బ్రిటిష్ పాలన నాటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఫిబ్రవరి 1957న నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమకారులపై ఉపయోగిం చింది. అధికార మార్పిడి జరిగిన మూడేండ్లలోనే ప్రజలపై 1982సార్లు కాల్పులు జరిపింది. జైళ్లలోనే 82మంది ఖైదీలను కాల్చి చంపింది. పోలీసు యాక్షన్ పేరుతో తెలంగాణలో లక్షలాది మందిపై మిలటరీ నిర్బంధాలు ప్రయోగిం చింది. ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరును తీవ్ర నిర్బంధకాండతో అణిచివేసే ప్రయత్నం చేశారు. మిలటరీ గవర్నర్ జయంత్చౌదరి కూడా రెండు వారాల్లో సాయుధ పోరును ఇనుప బూట్ల కింద నలిపివేస్తామని హెచ్చరించాడు. కానీ 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ 21 వరకూ సాయుధ పోరాటం మిలటరీతో సాగింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి భారత ప్రభుత్వం 1947-48లో కాశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ తో యుద్ధం చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో అంత ధనం తెలంగాణ పోరాటాన్ని అణచి వేయడానికి ఉపయోగించిందని సుందరయ్య తన గ్రంథంలో పేర్కొన్నాడు.
నిజాం సంస్థానం భారత యూనియన్లో విలీనమై 73సంవత్సరాలవుతున్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లవుతున్నా.. ప్రజల కష్టాలు తీరలేదు. తెలంగాణలో ప్రజారాజ్యం రాలేదు. అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదరికం పెరుగుతూనే ఉంది. ప్రజలను నమ్మించి, మోసగించి ధనబలంతో ఓట్లు దండుకొని అధికారంలోకొచ్చి పేద ప్రజలను అణగదొక్కుతున్నారు. ప్రజల సంపద కొంతమంది సంపన్నులకే దోచిపెడుతున్నారు. ప్రజల ఎజెండా వదిలేసి వారి రాజకీయ స్వార్థ ప్రయోజనా లకు పాలన సాగిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఆనాటి పోరాట యోధుల ఆశయాలు నెరవేరాలంటే కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో మరో వీరోచితమైన పోరాటం నడిపిం చాల్సి ఉంది. అప్పుడు మాత్రమే పీడిత ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఆనాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే నేటి కర్తవ్యం.
- జూలకంటి రంగారెడ్డి