Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ, ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యంత అధ్వాన్నంగా నిర్వహించబడిన ఆర్థిక వ్యవస్థగానూ భారతదేశం ప్రపంచస్థాయి నాయకత్వంలో చోటు సంపాదించుకుంది. ఇంతరెట్టింపు సాహసకత్యాలను మనం ఎలా నిర్వహించుకున్నాం? అంటే దేవుని చర్యల ద్వారా కాదు. ప్రస్తుత నాయకత్వం యొక్క ఉదాసీనత, దుర్భలత్వం, అశక్తత వలన మాత్రమే ఈ స్థితికి చేరుకున్నాం .
క్షీణతపై గణాంకాలు
ఏప్రిల్- జూన్ 2020లో సంకోచం చెందిన అంచనా వేయబడిన 24శాతం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ఇంతకు ముందు సంవత్సరంతో పోల్చినప్పుడు జీ20 ఆర్థిక వ్యవస్థలలో (ఇతర దక్షిణ ఆసియా దేశాలతో పోల్చినప్పటికీ) మన దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నమైన స్థితిలో ఉంది. కానీ ఇవి తక్కువగా అంచనా వేయబడిన సంఖ్యలు. ఎందుకంటే ఆ సంఖ్యలు సంఘటిత రంగానికి సంబంధించిన సమాచారంపై ఆధారపడినవి. కానీ వాటిని అసంఘటిత రంగానికి చెందిన కార్యకలాపాలకు చెందినవిగా చూపించారు. వాస్తవ క్షీణత బహుశా చాలా అధ్వాన్నంగా ఉండి ఉంటుంది. భౌతిక సూచికలైన పారిశ్రామిక ఉత్పత్తి 20శాతానికి పైగా క్షీణించింది. కానీ అసంఘటిత వస్తూత్పత్తులు అంతకంటే ఎక్కువగానే క్షీణించాయని క్షేత్రస్థాయిలోని నివేదికలు తెలియజేస్తున్నాయి. వస్తూత్పత్తి, సేవలకు చెందిన అనేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈఎస్) ఇప్పటికీ మూతపడి ఉన్నాయి, కొన్ని సంస్థలు మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. ఉపాధి క్షీణత, వేతనాల రేటు తగ్గుదల ఈ రెండింటి కలయిక వలనే వేతన ఆదాయాలు జీడీపీ కంటే వేగంగా పడిపోయాయి.
జీడీపీ గణాంకాలలో ఉన్న అప్రమాణికమైన వార్త
వ్యవసాయ రంగం మినహా ప్రతీరంగం, ముఖ్యంగా ఎక్కువ ఉపాధిని కల్పించే రంగాలు చాలా వేగంగా క్షీణించాయి. రబీ సీజన్లో అనుకూలమైన రుతుపవనాలు, మంచి పంట దిగుబడులు వ్యవసాయ రంగంలో కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. కానీ ఆదాయాలు తగ్గాయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా పొందలేక పోవడం వల్ల సంవత్సర కాలంలో రైతులు ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేదు. గడిచిన సంవత్సరం ఇదే కాలంలో ప్రభుత్వ వినియోగపు వ్యయం 16శాతం పెరిగింది. కానీ మొత్తం పెట్టుబడి (సగానికి సగం) అత్యంత వేగంగా పడిపోయింది కాబట్టి, ప్రభుత్వ పెట్టుబడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ఇతర సేవల రంగాల్లో కూడా చేరిన స్థూల విలువ 10శాతానికి పైగా తగ్గింది. తగ్గిన ఆ 10శాతంలో సుమారు 90శాతం జీతాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ జీతాలు తగ్గలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలపై కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. అనేక రాష్ట్రాల్లో జీతాల చెల్లింపుల్లో ఆలస్యం చేయడం లేదా జీతాలు స్తంభింపచేయడం జరుగుతుంది తీవ్రమైన దురవస్థ
ఈ క్రమంలో కరోనా మహమ్మారి అడ్డూ, అదుపు లేకుండా కొనసాగుతునే ఉంది. ''వక్రరేఖను సమాంతరం చేయాలని'' మాట్లాడిన అందరి మాటలు మాయమైనాయి. వాటి స్థానంలోకి పూర్తిగా అర్థంలేని విధంగా రికవరీ రేటు (పునరారోగ్యప్రాప్తి) సూచిక వచ్చి చేరింది. అనాగరిక జాతీయ లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సృష్టించింది, ఈ పతనం కరోనా వ్యాప్తికి ముందు కూడా బాగానే ఉంది. పరీక్షించడం, గుర్తించడం, ఏకాంత వాసంలో (ఐసోలేషన్) ఉంచడం, చికిత్సను అందించడానికి బదులుగా (ఖరీదైన చర్యలైనప్పటికీ, వ్యాధిని నిరోధించే ఏకైక మార్గం ఇదే) కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా లాక్డౌన్ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా అన్నింటినీ మూయించి వేసింది. తర్వాత, కేంద్ర ప్రభుత్వం జీవనాధారాలను కోల్పోయిన 80శాతం మంది కార్మికులకు ఏ విధమైన నష్టపరిహారాన్ని గానీ, సామాజిక రక్షణను గానీ సమకూర్చలేదు. వలస కార్మికులను తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళమని ఒత్తిడి చేసి అత్యంత భయానకమైన పరిస్థితుల్లో వారిని వెళ్ళగొట్టారు. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన వలస కార్మికులు అక్కడ ఉన్న దయనీయమైన ఆరోగ్య పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తమకు తెలియకుండానే ఈ వ్యాధిని వ్యాప్తి చేశారు. అక్కడ ఆహారాన్ని తగినంత పొందలేక పోవడం, పౌష్టికాహార లోపాల కారణంగా, శ్రామిక ప్రజలు కడు పేదవారుగా, దుర్భలమైన వారుగా మారిపోయారు. కరోనా వ్యాధి ప్రమాదకరమైన పరిస్థితులను పెంచుతున్న ఈ తరుణంలో కూడా తక్కువ వేతనాలకు పని చేయడానికి తిరిగి రమ్మని వలస కార్మికులను ఇప్పుడు మళ్ళీ ఒత్తిడి చేస్తున్నారు.
ఇది ఇప్పటికీ ప్రారంభం మాత్రమే. ఆర్థిక వ్యవస్థ, వైద్య విధానాలకు సంబంధించి ప్రభుత్వ వ్యూహంలో ఒక పెద్ద మార్పు రాకపోతే ఈ భయంకరమైన ప్రక్షేప మార్గం నిలిచి ఉంటుందని నమ్మేందుకు ఒక చిన్న కారణం ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడడం ప్రస్తుత త్రైమాసికంలోకి కూడా కచ్చితంగా విస్తరిస్తుంది. బహుశా సంవత్సరంలో మిగిలిన కాలంలో కూడా విస్తరించవచ్చు. అందువలన మనం స్వతంత్ర భారతదేశంలో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నాం.
రాష్ట్రాలకు వ్యతిరేకమైన దెబ్బ
డిమాండ్ లేకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు ఒక ముఖ్యమైన కారణం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కంటే ముందే వినియోగం, పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున పతనం అయినప్పటికీ, ప్రభుత్వం నుంచి అందిన సహాయక చర్యలు చాలా తక్కువగా ఉండడం దయనీయమైన విషయం. మిలియన్ల సంఖ్యలో ప్రజలు బాధలకు గురైతే, అతి కష్టం మీద వందల సంఖ్యలోని ప్రజలకు మాత్రమే సహాయం చేరింది. మొత్తం మీద డిమాండ్పై చాలా కొద్ది ప్రభావాన్ని చూపింది. ఆస్తులను డబ్బుగా మార్చేందుకు సంకోచిస్తూ తీసుకున్న చర్యలు నిరుపయోగం అయ్యాయి. బ్యాంక్ రుణాలు ఇవ్వడం మొత్తంగానే తగ్గింది. అన్ని రకాల రుణగ్రస్థులు బ్యాంక్ల నుంచి కూడా చాలా తక్కువ రుణాలను మాత్రమే పొందినారు .
రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అవమానకరంగా నిరాదరణకు గురవుతున్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం విధింపు అమలు కేంద్రీకరణ అయినప్పటికీ, దాదాపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థలో సంభవించిన పరిణామాలను, ఆరోగ్య సంక్షోభాలను నిరోధించే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వంతంగా మోయాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నది. కానీ ఈ నిర్వహణకు అవసరమైన వనరులను సమకూర్చడానికి మాత్రం కేంద్రం నిరాకరించింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నష్ట పరిహారాన్ని కూడా నిరాకరిస్తున్నది. ఈ ఒప్పందాల అమలు అతిక్రమణ పరిణామాలు అసమర్థంగా, అధ్వాన్నంగా ఏర్పాటు చేసి ఘోరంగా అమలు చేసిన జీఎస్టీకి అంతం పలుకుతాయి .
ఈ లోభితనపు పరిణామాలను నేడు దేశ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద ఉన్న డబ్బును ముందుగానే ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల వద్ద డబ్బు లేకుండా పోయింది. కేంద్రంలా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన బడ్జెట్ ఒప్పందాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాలు తమ ఆదాయాలు పెంచుకునే అధికారాలను జీఎస్టీకి వదిలి వేశాయి. వారు చెల్లించాల్సిన బకాయిలను ఎప్పుడు ఎలా చెల్లించేది సందిగ్ధంలో ఉంది. కాబట్టి అప్పు చేసి డబ్బు తెచ్చుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతుంది. ఇది సంవత్సరంలో మిగిలిన కాలంలో చేయాల్సిన ఖర్చుపైన కూడా ప్రభావం చూపుతుంది. దీని వల్ల ప్రాథమిక సేవలలోని తగ్గుదల ఫలితాలను ప్రజలు అనుభవిస్తారు.
ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి
సరియైన విధానాలతో ఈ సంక్షోభాన్ని నివారించవచ్చు. ఇప్పటికైనా ఈ భయంకరమైన ధోరణిని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి (వాస్తవంగా డబ్బు అందుబాటులో ఉండే విధంగా, ఉట్టి వాగ్దానాలు కాకుండా) ఈ కింద పేర్కొన్న వాటిని కూడా సమకూర్చాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ నష్టపరిహార బకాయీలను వెంటనే చెల్లించాలి. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావాలను కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎఫ్) ప్రజలందరికీ వర్తింపచేయాలి. ప్రతీ కుటుంబానికి నెలకు ఉచితంగా 10కేజీల ఆహార ధాన్యాలను కనీసం ఆరు నెలల పాటు అవసరం ఉన్న వారందరికీ అందించాలి. క్రూరమైన లాక్డౌన్ కాలంలో ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ప్రతీ కుటుంబానికి నెలకు రూ.7000 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రతీ కుటుంబానికి రెట్టింపు పనిదినాలు (అంటే 200 రోజులు కనీసం ఈ సంవత్సరం లోనైనా) కల్పించాలి. రుణాల మారటోరియంను పొడిగించి, తీసుకున్న రుణాలకు ఆ మారటోరియం కాలానికి వడ్డీ చెల్లింపులు లేకుండా పూర్తిగా నిలుపుదల చేయాలి. అదే విధంగా రుణాల నిరాకరణకు గురైన ఎంఎస్ఎంఈలకు, రైతులకు మళ్ళీ రుణ సదుపాయాలు కల్పించాలి. వైద్య రంగానికి సంబంధించిన అన్ని వనరులను, కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన వనరులను, గత ఐదారు నెలలుగా వాయిదా వేసిన ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల వనరులను సమకూర్చాలి.
వీటిని సమకూర్చడానికి గాను చాలా డబ్బును పెట్టుబడిగా ఖర్చు చేయాలి. కానీ వీటిని సమకూర్చకుండా ఉంటే ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఖర్చు చేయకుండా ఉండే చర్య ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టి వేస్తుంది. ఆదాయాలు తగ్గిన ఫలితంగా పన్నులు కూడా తగ్గి పోతాయి. అందువలన తక్కువ ఖర్చు కూడా పెద్ద ద్రవ్యలోటును సష్టిస్తుంది. ఇప్పుడు పెరిగిన ఖర్చులను కేంద్రం ఆర్బీఐ నుంచి అప్పుచేసి చెల్లించవచ్చు (ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల ప్రభుత్వాలు ద్రవ్యలోటును పూడ్చేందుకు చేస్తున్న విధంగా) నిత్యావసర సరఫరాలు నిర్వహించబడుతున్నంత వరకు ఇది ద్రవ్యోల్బణం కాదు. ఎందుకంటే ప్రస్తుతం డిమాండ్ బాగా తక్కువగా ఉంది. చివరిగా బహుళ జాతి కంపెనీల పైన సంపద పన్నులు, ఇతర పన్నులు (ముఖ్యంగా పన్నులు చెల్లించకుండా తప్పించుకొనే పెద్దలకు) విధించే ఆలోచన కచ్చితంగా చేయాలి. దీని నుంచి బయట పడాలంటే సాహసోపేతమైన ఆలోచనలతో పాటు వేగవంతమైన చర్యలే మార్గం .
- జయతీఘోష్
''ద హిందూ'' సౌజన్యంతో
అనువాదం:బోడపట్ల రవీందర్, సెల్:9848412451